Tuesday 31 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 243 (విశ్వనాథ మధ్యాక్కరలు: శ్రీ కాళహస్తి శతకము)

తిరుపతికిం బోయి యొడలి నగలెల్లదీసి యిచ్చెదరు
హర! వచ్చి నిను జూచి యొక్క నమస్కార మాచరించెదరు
వెరపించుటకు మరపించుటకు గల భేద మిది హర
హర హర మహాదేవ! శ్రీకాళహస్తీశ్వరా! మహాదేవ

విశ్వనాథ మధ్యాక్కరల లోని శ్రీ కాళహస్తి శతకము నందలి పద్యం, లోకుల భావనలో శివునికి కేశవునికి ఎంత భేద మున్నదో చక్కగా, సున్నితమైన హాస్యంతో తెలియజేస్తున్నది.

కోరిన కోర్కెలు తీర్చేవాడని, కలియుగ ప్రత్యక్ష దైవమని వేంకటేశ్వరస్వామి మీద అమితమైన భక్తి ప్రజలకి. కోరికలు కోరుకొని, అవి తీరిన తరువాత, తిరుపతి కొండకు వెళ్ళి, ముడుపులు చెల్లించుకుంటారుతిరుపతికి కొద్ది దూరంలో శ్రీ కాళహస్తి ఉంది. అక్కడికి పోయి, శివుడికి ఒక దణ్ణం మాత్రం పెట్టొస్తారు. ఇదేమి భేదమో అని విశ్వనాథవారు చమత్కారంగా అడుగుతున్నారు.

జనానికి వేంకటేశ్వర స్వామి మీద భయభక్తు లున్నాయి.   కోరికలు తీర్చుకొనడానికి మొక్కుకొని, అవి తీరిన తరువాత మొక్కు చెల్లించుకొనకపోతే , దేవుడికి కోపమొస్తుందని భయందీనికి భిన్నంగాశివుడు బోళాశంకరుడని తెలుసు. భక్తికి లొంగిపోతాడని తెలుసు. అందుకనే ఆయనను మరపించి, ఒక నమస్కారంతో మురిపిస్తారు.. వీలైతే ఒక చెంబెడు నీళ్ళు శివలింగం మీద పోస్తారు. అంతే, ఆయన ప్రసన్నుడౌతాడువెరపించటానికి, మరపించటానికి ఇంత తేడానా? అని విశ్వనాథ వారంటున్నారు.

' హర హర మహాదేవ ' అని చివరి చరణంలో అనడంలో, శివునికి  ఎంత అన్యాయం జరిగిపోతున్నదని, శివుడెంత అమాయకుడని ధ్వనిపూర్వక వ్యంగ్యం.

విశ్వనాథవారి జీవితంలో శివకేశవు లిద్దరికీ భేదం లేదనీ, చిన్నప్పటి నుండి వారి ఊరిలో ఉన్న వేణుగోపాల స్వామి, శివాలయాల్లో ఉన్న మూర్తులు ఆయన గుండెలో గూడుకట్టుకొని ఉన్నారని వారి ఆత్మకథ ద్వారా మనకు తెలుస్తుందిశ్రీమద్రామాయణ కల్పవృక్షము అనే రామకథాకావ్యాన్ని శివునికి అంకిత మిచ్చారు విశ్వనాథవారుఅదీ   విశ్వనాథవారికి శివకేశవులపై గల అభేదబుద్ధి.


చమత్కార ధోరణిలో సాగిన పద్యంలో ఏకస్వరూపమయిన శివకేశవ తత్త్వాన్ని లోకం దృష్ట్యా ఒకరు వెరపించి ముడుపులు చెల్లించుకొనే దేవుడిగాను, ఇంకొకరిని మైమరచిపోయి, అడిగినవన్నీ ఇచ్చే దేవుడిగాను చిత్రించారు వీశ్వనాథవారు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like