Friday 20 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 211 (పాండురంగ మాహాత్మ్యము: ప్రథమాశ్వాసము)

మారుతాహతి రాలు నారీకేళ ఫలాళి
          నిడిసి జల్లించు పుండ్రేక్షురసము 
చిలుకపోటులచేత జిరిగిన సహకార
          ఫలముల దొరగెడి పచ్చితేనె
చిక్రోడ  దంష్ట్రలు చెక్కు సుగంధి
          నటి పండ్లను గారు నవ్య సుధయు
బాక వేగారంభపరిపాటి దమయంత
          పగిలిన పనస గొబ్బండ్ల బేస

మేకమై కాలువలు గట్టి యేకహేల 
బరవ నందలి క్రియ్యూట పసిమితేట
బండు నవ్వీట ముక్కారు బసిడిగారు
సరస ధాన్యంబు మంచి రాజనపు జేలు.

తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఒక అనర్ఘరత్నంఅందులో, ప్రథమాశ్వాసము నందలి యీ పద్యం చదివితే, పూర్వ మహాకవుల ప్రకృతి పరిశీలన యెంత నిశితంగా ఉండేదో అర్థమవుతుంది.

పూర్వం వ్యవసాయం మీద ఆధారపడ్డ సమాజంపచ్చటి పొలాలుపండ్లతోటలు, పశువుల మందలతో, పల్లెటూళ్ళు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండేవిఇప్పుడు వృద్ధాప్యంలోకి జారిన వారికి చాలామందికి మన పల్లెటూళ్ళ సౌభాగ్యం తెలుసు పద్యం, మధురస్మృతులను మరొకసారి గుర్తుచేస్తుంది.

చేలగట్ల మీద కొబ్బరిచెట్లు  , మామిడిచెట్లు , అరటిచెట్లు , పనసచెట్లు  వరుసగా వేస్తారు.   మధ్యలో చేనులో వరి గాని, చెఱుకు గాని, ఇంకా ఏదైనా పంట గాని వేస్తారు.   గాలికి కొబ్బరిబొండాలు రాలి చెఱకుగడల మీద పడి, అవి చీలిపోయినాయటచీలిన చెఱకుగడల్లోంచి చక్కని రసం కారి చేలో పారుతున్నదటచేలగట్ల మీద కొబ్బరిచెట్ల వరుస, చేలో చెఱకుపంట - ఇంత వరకు ప్రకృతి పరిశీలన. పైన చెప్పినదంతా  కల్పనసహజమనిపించే మధుర చమత్కృతి.

సహకార ఫలము లంటే మామిడిపండ్లు. చిలుకలు కొట్టిన మామిడిపండ్ల నుంచి కారిన తీయని రసంచిలుక కొట్టిన మామిడిపండు ఇంకా ఎక్కువ తియ్యగా ఉంటుందంటారుఇక్కడ, రామకృష్ణుడు పచ్చితేనె అన్నాడు. అదే కవి ప్రత్యేకత

సుగంధి అరటిపళ్ళు. అదొక జాతి చక్కరకేళి లాగాకమ్మని వాసన ఉంటుంది వాటికి.   వాటిని ఉడుతలు పళ్ళతో చెక్కాయట. అప్పుడు వాట్నుంచి రసం కారుతున్నది.

పాకవేగారంభపరిపాటి అంటే మిగలబండినవిపనసపండ్లు బాగా పండి వాటంతట అవే విచ్చిపోయినాయిదానిలో నుంచి గుజ్జు (బేసము) కారుతోంది.

చెఱుకురసం, మామిడిపండ్ల పచ్చితేనె , సుగంధి అరటిపండ్ల నవ్య సుధ, పనస పండ్ల గుజ్జు - ఇవన్నీ చేలో పారుతున్నాయిచేనంతా మధురసంతో ఇంకిపోయి, ముక్కారు  ( మూడు కాలాల్లో పండే పంటలు) రాజనాలను పండిస్తున్నదటరాజనాలనేవి రోజుల్లో పండే, సువాసన కలిగిన వరిధాన్యం రాజనాల ప్రసక్తి ఆముక్తమాల్యదలో కూడా ఉంది.


ఎంత అందమైన పద్యంఒక్కసారి మన పల్లెటూళ్ళోకి, మన చేలల్లోకి, గట్లమీది చెట్లకి మనసును  పరుగెత్తించలేదూ?

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like