Sunday 15 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 184 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్య కాండము: అభిషేక ఖండము)

గోళకాంతిచ్ఛటల్ పెఱగోళములకు 
బయనముం జేయ నబ్దముల్ పట్టునట్లు
రాచదేవిడీలందు వార్తలును జేర
బ్రభువు ప్రభువును మధ్య నబ్దములు పట్టు.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యకాండము లోని తొలి పద్య మిది.

పద్యాన్ని శతాబ్దపు కవే వ్రాయాలి మాటన్నది పద్యార్థాన్ని వివరిస్తున్న యీ వ్యాఖ్యాత కాదు. కల్పవృక్ష ఫలసారాన్ని పిండి మన కందించిన ఎందరో మహానుభావులలో ఒకరు, " ఇది కల్పవృక్షము " అనే కావ్యానుశీలనాన్ని  లోకానికి అందజేసినవారు అయిన బ్రహ్మశ్రీ వడలి మందేశ్వర్రావుగారువారికి మనఃపూర్వక నమస్సు లర్పిస్తూ, వ్రాస్తున్నవాడు చెప్పబోయే విశేషాంశాలన్నీ వారు పెట్టిన భిక్ష మాత్రమేనని విన్నవించుకుంటూసవినయంగా ప్రారంభిస్తున్నాను.

పద్యం చిన్నదేకానీ, చెప్పుకోవడనికి కావలసినంత సామాగ్రి ఉన్న పద్యమిది.

అసలు, వడలివారు, యీ పద్యం యీ శతాబ్దపు కవే వ్రాయవలసిన పద్యమని ఎందుకన్నారు?  20 శతాబ్దంలో శాస్త్రవిజ్ఞానం బాగా పెరిగిందిదూరవాణి, చరవాణి, అంతర్జాలముల సహాయంతో, ఎక్కడనుంచి ఎక్కడికైనా, వార్తలను పంపగలిగిన వెసులుబాటు మనకుందిపూర్వం రోజులలో అట్లా కాదు. ఒక గ్రహం నుండి, కాంతి, ఇంకొక గ్రహానికి చేరటానికి కొన్ని క్షణాల నుంచి కొన్ని సంవత్సరాలు పట్టినట్లు, దేవిడీలలో, కోటలో, ఒక వార్త, ఒక చోట నుండి ఇంకొక చోటకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. నిబంధనలను, ప్రమాద ఘంటికలను దాటుకుంటూ అవి చేరాలికొన్ని విషయాలు పెదవి  దాటకూడదు

రాముని యౌవరాజ్య పట్టాభిషేక వార్త తాతగారి రాజ్యంలో ఉన్న భరతునికి చేరలేదుసుమంత్రుడు చెప్పేవరకు రామునికే తెలియదురాముని స్నేహితులు చెప్పేవరకు కౌసల్యకు తెలియదురాముణ్ణి తన కొడుకు కన్నా అధికంగా  ప్రేమించిన కైకమ్మకు, కలలో కనపడిన దేవతలు, తనను పట్టాభిషేకం చేసుకోవద్దంటున్నారని, రాముడు చెప్పేవరకు తెలియదుఇది దేవతల ప్రణాళికలో భాగమని, కైక దుర్బుద్ధి ఫలితం కాదని, దశరథునికి ఆజన్మాంతం తెలియదురామునిలో పొడచూపిన వైరాగ్యభావన మాత్రం తెలియడానికి దశరథునికి చాలా సమయం పట్టిందితెలిసినప్పుడు తండ్రి ఏం చెయ్యాలి?

బ్రహ్మచారి సుతుండు విరాగియైన
జనకు డూహించు సుతు గృహస్థుని బొనర్ప
దా గృహస్థుండె సుతుడు విరాగియైన
దండ్రి వ్యవహార మతనిని దాల్పజేయు.

అందుకే, అప్పటికే గృహస్థుడైన రామునికి తన రాజ్యభారం అప్పగించాలనుకొన్నాడు. రాముని వైరాగ్యభావ వార్తలు అతనికి ముందుగా చేరివుంటే, భరతశత్రుఘ్నులు అయోధ్యలో ఉన్నప్పుడే రామునికి పట్టాభిషేకం చేసేవాడుఆలస్యమవడానికి కారణం, వార్తలు సరియైన సమయంలో అందకపోవడమే.  

దీనినే గ్రంథిగ్రంథులను విడదీయడమంటారుచిక్కుముడి విప్పటం. ఎన్నో అపోహలకు , వ్యాఖ్యానాలకు సహేతుకతను కల్పించి చిక్కుముడి విప్పడంఇది మహాకవులు తెలిసిచేసే శిల్పరచన.

తల్లి చేసిన పని, దశరథ మరణానంతరం, అయోధ్యకు తిరిగివచ్చేటంతవరకు భరతునికి తెలియదు. తెలిస్తే రామకథ బాలకాండతోనే పూర్తయ్యేదితెలిస్తే జగన్నాథుడైన రాముడు, కేవలం రాజ్యపాలన చేస్తూ ,సాకేతమేలిన ప్రభువులలో ఒకడిగా మిగిలిపోయేవాడుఅందుకే, ఇదంతా " కైకేయీ సముపజ్ఞము (కైకేయి దివ్యప్రణాళిక) " అన్నాడు భరతుడు.

రాముడొక స్వయంప్రకాశ గోళ మనుకుంటే, అతని వైరాగ్యభావన దశరథ గోళానికి చేరడానికి   చాలా సమయమే పట్టిందిదేవతల ప్రణాళిక, కైక వరాలు, తత్ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్ళడం - యీ విషయాలన్నీ దశరథునికి తెలియకపోవడమే, రామావతార లక్ష్యం.


మరి వార్తలు ఎవరికి త్వరగా చేరుతాయిస్వేచ్ఛాజీవులైన ప్రజలకు, ద్రష్టలైన ఋషులకువారికి రాచదేవిడీల నిబంధనలు, కట్టుబాట్లు వర్తించవుకొండల్లో, కోనల్లో, వాగుల్లో, వంకల్లో బడి అట్లా వస్తూ ఉంటాయిఅంతే!

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like