Wednesday 25 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 231 (తిక్కన భారతము: విరాటపర్వము: ప్రథమాశ్వాసము)

ఇది కడు ముద్దరాలు, పను లేమియు చేయగ నేర, దెంతయున్
మృదు, వొక కీడుపాటునకు మేకొనజాల, దుదాత్తచిత్త, యొం
టి దిరుగు దాని కోర్వ, దొకటిం దను దా సవరించు చొప్పెఱుం
గదు, తగ నొడ్లనుం గొలువగా వెర వెమ్మెయి గల్గు నక్కటా!

తిక్కనగారి ప్రసిద్ధ పద్యాలలో ఇది కూడా ఒక పద్యంఅచ్చ తెలుగు పదాలతో పద్యం నడిచిన తీరు చూస్తేనే, పఠితకు ద్రౌపది యెంతటి ముద్దరాలో, సేవలు అందుకొనడమే తప్ప, సేవించడం యెరుగని యెంతటి మహారాణీత్వం కలదో అర్థమవుతుంది.

అజ్ఞాతవాస కాలంలో ఎవరు పని చేయాలో పాండవులందరూ నిర్ణయించుకొన్నారు. ఇక ద్రౌపది ప్రస్తావన వచ్చేటప్పటికి, ధర్మరాజు మనస్సు వేదనతో నిండిపోయింది వేదనకు తిక్కనగారి అక్షర రూపమే యీ పద్యం.

" ఈమె చాల సుకుమారి. సేవలు చేయించుకొనడమే గాని, చేయడం తెలియనిదిమెత్తని మనస్సు కలది. చేయకూడని పనులు చేయడానికి సమ్మతించదు. ఉన్నతాశయాలు కలిగినదిఒంటరిగా తిరగడానికి  సిద్ధపడదు. ఒక్క పనినీ తనంతట తాను చక్కబెట్టుకొనే తీరు తెలియదు. ఇటువంటి ఈమె ఇతరులను యెట్లా సేవిస్తుందో? నేర్పు యెట్లా పొందుతుందో? "

ఇదీ ధర్మరాజు ఆవేదన.

పద్యానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వము, ప్రథమాశ్వాసమునకు, డాక్టరు కే. సర్వోత్తమరావుగారి, సంపాదకవర్గం వారి విశేష వ్యాఖ్యను ఇక్కడ యధాతథంగా పొందుపరచడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాను.

 మూలంలో, " ద్రౌపది మనందరికీ ప్రియమైన భార్యమన ప్రాణాలకంటె మిన్న అయినదితల్లివలె పరిరక్షించదగిందిసోదరివలె మన్నించదగింది. " అని అనటం తిక్కన వదలివేశాడుమూలంలో ఆర్ద్రత ఉన్నా, తెలుగులో ఔచిత్యం ఉన్నదిపాండవపత్నిగా ఆమె ప్రశంస అజ్ఞాతవాస నియమానికి ప్రస్తుతం కాదుఆమె ఇతరుల సేవలో ఎట్లా ఉండగలుగుతుంది - అనేదే ప్రస్తుతాంశంపాండవు లందరిలో అంశాన్ని మాత్రమే ఎన్నుకొని తిక్కన విషమాలంకార సుందరంగా వ్యక్తీకరించాడుతిక్కన పద్యంలో ద్రౌపదిని వర్ణించిన తీరు అనుభావ వ్యంజకంగానూ, భావికథార్థ సూచకంగానూ ఉండటం తిక్కన కావ్య కళాశిల్పంవిరాటపర్వంలో - విశేషించి కీచక ఘట్టంలో - ద్రౌపది పడేపాట్లను ప్రచ్ఛన్నంగా ధ్వనింపజేసే వాక్యవిన్యాసం గమనార్హంఆమె కడు ముద్దరాలుఎంతో మనోజ్ఞమైనది అని భావంసుదేష్ణను మెప్పించిందీ, కీచకుడిని ఆకర్షించిందీ అయిన లావణ్యవిశేషం ఇందులో సూచితంకష్టపడే పనులు చేయలేనిదికాబట్టే సైరంధ్రిగా అలంకరణ సేవలో ఉండిపోయింది. ఆమె ఎంతో మెత్తనిది కాబట్టి కొలువులో ఒదిగి మర్యాదగా ఉండగలిగిందిఒక కీడుపాటునకు కూడా సహించలేనిది కాబట్టి కీచకుడి వలపు బాసలను ఓర్చుకొనలేకపోయిందిఉదాత్తచిత్త కాబట్టి అన్యపురుషవాంఛకు లోనుకాకుండా కీచకుడికి అన్యకాంతాసమాగమవాంఛ హేయమని చెప్పగలిగింది. ఒంటిగా తిరగటానికి సిద్ధపడదనే విశేషం - కీచకుడి ఇంటికి కల్లు తీసికొని రావటానికి ఒంటిగా పోవటాన్ని ఆమె అంగీకరించకపోవడానికి హేతువయింది విషయాన్నైనా తాను స్వతంత్రించి ఒంటరిగా చేయటం అలవాటు లేనిదటఅంటే భర్తల అనుమతితో చేసేది అనే భావం ఏర్పడుతుందికీచకోదంతాన్ని పాండవుల దృష్టికి తెచ్చి, వారి ఎఱుకతో కార్యాన్ని నిర్వహించిన కథార్థాన్ని ఇది స్ఫురింపజేస్తుందిఇది వస్తుధ్వని.   ఇక ద్రౌపదికి వాడిన విశేషణాలన్నీ ఆమె మహారాణీత్వాన్ని సూచించేవిసేవలు చేయించుకొన తగిన స్నిగ్ధమూర్తి ఎవరిని సేవించగలదుఅనే విషమాలంకార చిత్రణకు అనువుగా చెప్పబడినవితిక్కన తెలుగు పదాల జిలుగు రచనకు పద్యం హృద్యమైన ఉదాహరణం.

ఇన్ని భావాలను ఒక్కపెట్టున స్ఫురింపజేసిన పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like