Thursday 26 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 234 (తిక్కన భారతము: కర్ణపర్వం: ప్రథమాశ్వాసం)

శరతల్పమున నుండి శాంతనవుండు బీ
          భత్సు దివ్యాస్త్ర వైభవము దెలుప
దివిరి జలం  బట్లు దెప్పించుకొని యప్డు
          పాండుసూనులతోడి బాంధవంబు
నడపుము సిరి పంచి కుడుచుట మే లింత 
          తో గయ్య ముడిగి శాంతుడవు గమ్ము
బ్రదుకుము నీ వన్న పనుపుసేయడు సుయో
          ధను డిప్డు శోకాబ్ధి మునుగ కున్నె?

పడుచు లీక లూడ్చి పట్టి యాడెడునట్టి
పులుగు చందమయ్యె దలప నా
వస్థ యెందు జొచ్చు వాడ? నీ యలమట
దీర్ప నెవ్వ రిందు దిక్కు గలరు?

యుద్ధరంగంలో కర్ణుడు కూడా పడిపోయిన తరువాత, ధృతరాష్ట్రుడు చెప్పలేని దుఃఖానికి లోనయ్యాడుఅంశయ్యమీద ఉన్న భీష్ముడి మాటలను గుర్తుకు తెచ్చుకుని, విధంగా దుఃఖిస్తున్నాడు.

" అంపశయ్యమీద ఉన్న భీష్ముడు, అర్జునుని యొక్క శస్త్రాస్త్ర నైపుణ్యాన్ని దుర్యోధనాదులకు మరొకమారు గుర్తు చేసి, వారిని యుద్ధం నుంచి విముఖులుగా చేయాలనుకొన్నాడు. అందుకనే, దాహమనే మిషతో, అర్జునుడి బాణప్రయోగంతో, పాతాళగంగాజలాన్ని తెప్పించేటట్లు చేసి, తన దాహం  తీర్చుకొనే సన్నివేశాన్ని కల్పించాడు తరువాత, పాండవులతో సఖ్యం చేసి, వారి రాజ్యం వారికిచ్చి, యుద్ధానికి స్వస్తి చెప్పి, శాంతిపథంలో నడవమన్నాడు. కానీ, దుర్యోధనుడు మాటలు పెడచెవిన పెట్టాడు. ఇక ఇప్పుడు శోకసముద్రంలో మునుగకుండా ఉంటాడాఅదుపు ఆజ్ఞలు లేని పిల్లలు గనుక, పక్షి రెక్కలు పీకేసి, దానిని ఎగురకుండా చేసినట్లయింది నా పని. బాధ నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళేది బాధలు పోగొట్టటానికి నాకు ఇంకెవరు మిగిలున్నారు? "

సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాబారతము, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసానికి విశేష వ్యాఖ్యను వ్రాసిన డాక్టరు జీ. హరిహరనాథ్ గారిని, సంపాదకవర్గం వారిని, అభినందించాలి. పద్యానికి వారు అందించిన విశేష వ్యాఖ్యను కూడా పొందుపరుస్తున్నాను.

" తిక్కనగారి మహాకవిత్వం ప్రతి పదంలోనూ కనిపిస్తున్నది. ' శరతల్పమున నుండి ' అనటంలో భీష్ముడు మరణోన్ముఖుడై ఉన్నాడు. ఆయన ఇదివరకటి వలె పక్షపాతబుద్ధి కలవాడు కాడుఇట్టి పరిస్థితిలో ఏమి చేసినా ఎల్లరి మేలుకే తప్ప, స్వార్థంతో కాని, పక్షపాతబుద్ధితో కానీ పని చేయడని సూచితం.  ' శాంతనవుండు ' అనటంలో ఆయన జన్మపవిత్రత సూచితం. భీష్ముడి తండ్రి రోగగ్రస్తుడిని తన చేతులతో స్పృశిస్తే, అతని రోగం తొలగి శరీరం (తనువు) శాంతి వహించేదికనుక అతడు శాంతతనుడు - శంతనుడు అని అనిపించుకొన్నాడుఅట్టివాని పుత్రుడు అహితం చెప్పడని సూచితం

అట్టిదే ' బీభత్స ' శబ్దం. అర్జునుడి గొప్పతనాన్ని దీని ద్వారా చెప్పదలచుకొన్నాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చేస్తుంటే, యుద్ధభూమిని చూస్తే జుగుప్స కలిగేటట్లు చంపుతాడటఅందువలన అతడి కాపేరుఅట్టివాడికి దివ్యాస్త్రాలు తోడుకనుక అతడితో స్నేహమే కార్యం అని స్ఫురిస్తుంది. " 

ఇదే తిక్కనగారి కావ్యకళాశిల్పం.  " తిక్కన్న శిల్పంపు తెనుగు తోట " అన్న విశ్వనాథవారి మాట అక్షర సత్యం.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like