Monday 23 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 224 (నన్నయ భారతము: ఆదిపర్వము: ప్రథమాశ్వాసము)

కాదన కిట్టిపాటి యపకారము దక్షకు డేకవిప్రసం
బోధన జేసి చేసె నృపపుంగవ! నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదరసంహతిన్   హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్.

శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, ప్రథమాశ్వాసము లోని పద్యం, రెండు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మొదటిది, ఉదంకుడిని పరిచయం చేస్తూ, నన్నయగారు రచించిన పద్య మిక్కడ గమనార్హము.

పంకజసన్నిభు డఘ
పంకక్షాళణ మహాతపస్సలిలు డనా
తంకమతి పైలశిష్యు డు
దంకుం డను మునివరుండు దద్దయు భక్తిన్.

ఉదంకుడెట్టివాడు? బ్రహ్మ వంటివాడు, అఘ పంకక్షాళన మహాతపస్సలిలుడు, భయ మెరుగని మనస్సు కలవాడుఇందులో, అఘ పంకక్షాళన మహాతపస్సలిలుడు, అంటే, పాపమనే బురదను, గొప్ప తపస్సనే నీటిచే కడుగ గలవాడుఅంటే, ఒకవేళ పాపం చేయక తప్పని పరిస్థితి వస్తే, దానిని తన తపోశక్తిచే పోగొట్టుకొన గల సామర్థ్యము కలవాడుఅందునా, అనాతంకమతిఅంటే, భయమెరుగని మనస్సు కలవాడు. మూడు విశేషణములను బట్టి, తక్షకుడు ఎట్టివానికి, (తన కులమునకు ) ఎంత ప్రమాదకరమైన అపకారం చేసాడో ఊహించవచ్చు.

ఇక రెండవది, అకారణంగా, ఉదంకుని వంటి వానికి అపకారం చేసినటువంటి, జనమేజయుని తండ్రి పరీక్షిత్తు మరణానికి కారకుడైనటువంటితక్షకుని దుర్మార్గం సహింపరానిది కనుక, శిక్షార్హుడని  రూఢి చేసిజనమేజయుడిని సర్పయాగం చేయడానికి ప్రేరేపించిన హేతువు యీ పద్యంలో కనిపిస్తుందిఇక పద్యం అర్థాన్ని తెలుకొనడానికి ప్రయత్నిద్దాము.

" రాజశ్రేష్ఠుడా! జనమేజయ మహారాజా! ఒక బ్రాహ్మణుని మాట పట్టుకొని (శృంగి శాపం మిషతో), తక్షకుడు నీ తండ్రికి చేయరాని అపకారం చేశాడు. అందుచేత, నీవు కూడా పలువురు బ్రాహ్మణుల చేత నిర్వహింపబడే సర్పయాగంలో, అగ్నిజ్వాలల్లో తక్షకుడితో సహా మొత్తం సర్పకులాన్ని భస్మం  చెయ్యి. "


పద్యంలో, ఉదంకుని స్వభావం మనకు తెలుస్తుంది.  " తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో ఇంత అపకారం నీకు చేశాడుఅందుకని, పలువురు బ్రాహ్మణులు సమ్మతించేటట్లుగా, సర్పయాగం చేసి ప్రతీకారం తీర్చుకో. " అని హేతువును కల్పించడమే గాక, తన కెవడైనా అపకారం చేస్తే, వాడిని వదిలి పెట్టే ప్రసక్తే లేదనే ఉదంకుడి స్వభావాన్నిఅనాతంకమతిని (భయ మెరుగని మనస్సు కలవాడిని) పాఠకుడు యీ పద్యంలో చూస్తాడు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like