Monday 31 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 739 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)




సరి నా పినతల్లి  నా యెడల శత్రువటన్న నెవండు నమ్ము? రా
తిరి చని యామెతోఁ బలికితిన్, నను నా యమ చూచినట్లు భా
సురలగుఁ దల్లులం దెవరు చూతురు? నేననఁ జచ్చిపోవునే !
సరి సరి యామె, యీ విలయసంగతి కాయమ యెట్లు హేతువౌ?

నీ కంటెన్ మఱి రెండు మల్పులు ధనుర్నిర్ణేతృతాధిక్యమున్
నా కున్నన్, బినతల్లి కైకయి కదన్నా ! చేసె, నీ శౌర్యమున్
నీ కోపమ్మును, నీవు నా కగుటయున్ నేరంగనే పోవదా?
యా కైకేయియు, నిట్లు చేసిన దదేలా ! యింత విజ్ఞాత్రియై.

  యిది యెవ్వరు చేయలే దెవరు చేసి
రందు ! దైవమ్ము చేసెఁ గృతాంతుడన్న 
నెంతటి బలీయుడో ! మహాఋషులు కూడా
నతనికి లొంగిపోయిరటన్నఁ జూడు.

ఊహకు నందనట్టిదియు నుర్విని దైవమటందు, మింత సం
దేహము నన్ను గూర్చియును, నిక్కపుఁ దల్లినిఁ గూర్చి, యేటికిం
బోహళమందు దైవమను మొక్కలమై చను శక్తిగాక, తా
నై హవణించు దైవమున కడ్డము నీవును నేన? చెప్పుమా !

సౌఖ్యమును సేగి, లాభనష్టములు, భయము
క్రోధము, భవము నభవము, క్రూరమైన 
దైవకర్మ, లకస్మాకృతంబులును
నూహితంబులు దైవంబు నుగ్రకృతులు.

శ్రీరామచంద్రుడు యువరాజు అవటానికి బదులు, కైక కోరిన వరాల ఫలితంగా వనవాసానికి వెళ్ళబోతున్నాడన్న వార్త విని లక్ష్మణుడు కోపోద్రిక్తుడయ్యాడుఅతడిని శాంతింపజేస్తూ రాముడు ఉచితానుచితాలను బోధించాడు. పినతల్లి కైకమ్మను గురించితన మనసులో నున్నట్టి ఆరాధనా భావాన్ని ఇలా బహిర్గతం చేశాడు.

" నా పినతల్లి నా మీద వైరభావం పూనిందంటే ఎవరైనా నమ్ముతారా? రాత్రి కూడా వెళ్ళి ఆమెతో మాట్లాడాను. నన్ను అమ్మ చూచినంత ప్రేమానురాగాలతో నా ముగ్గురు తల్లులలో ఎవరు చూడగలరు? నేనంటే ప్రాణాలనైనా ఇస్తుందేసరే ఇక చెప్పవద్దు. మీ అందరి విచారానికి కారణమని భావించే యీ సంఘటనకు తల్లి కారణమెట్లా అవుతుంది?

లక్ష్మణా ! ధనుర్విద్యలో నీ కంటె ఒకటి రెండు మెలుకువలు, ఆధిక్యం నాకున్నాయంటే, అవన్నీ తల్లి చేతి చలువ వల్లనే కదా ! నువ్వు చూపిస్తున్న ప్రతాపం, కోపం, నేనంటే నీకున్న ప్రేమ, ఆరాధన, ఇవన్నీ ఆమెకు తెలియకుండానే ఉన్నాయా ? మరి తెలిసి తెలిసి, యింతటి విజ్ఞానవంతురాలు యీ పని యెందుకు చేసిందో?

అసలు యీ పని ఎవరో చేసింది కాదు. మరి ఎవరు చేశారంటావు? దైవం చేసింది. విధి ఎంత బలీయమైనదో, మహాఋషులు కూడా విధికి లొంగిపోయారంటే ఇక చూడు

లోకంలో, ఊహకు అందని దానిని దైవ మంటామునన్ను గురించి ఇంత ఆందోళన, అమాయకురాలు నా పినతల్లిని గురించి యింత అనుమానం నీ కెందుకు? ఇదంతా దైవశక్తి యొక్క కూర్పు. తనకు తానుగా దైవం చేసే యీ చక్కని కూర్పును ఆపడానికి నీకైనా, నాకైనా సాధ్యమా చెప్పు

లోకంలో, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, భయక్రోధాలు, కలిమిలేములు, క్రూరమైన దైవకర్మలు, అనుకోకుండా జరిగే దుర్ఘటనలు, ఊహాతీతమైన పనులు, ఉగ్రకార్యాలు అన్నీ దైవికాలే. " 

అవతారమూర్తి అయిన రామునికి జగత్తు యొక్క రహస్యం తెలుసు. రాముడు దానిని విడమరిచి చెప్పి, లక్ష్మణుడిని శాంతతపరుస్తున్నాడు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.











Sunday 30 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 738 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అవతార ఖండము)


మొగమున నింతయై మురిసిపోయెను రాముడు, కైక కన్నులం
దిగము మఱింత యింత యయి యేళ్ళులువాఱె, దతంతరంతర
స్థగిత రఘూద్వహప్రవిలసచ్ఛిశుమూర్తి మఱింత యింతయై 
జగములు పట్టరాని యొక సాహస దీర్ఘతనుత్వ మొప్పగన్.

దశరథుని కొడుకులకు ఉపనయనం జరుగుతున్నది. వటువు రాముడు ముగ్గురు తల్లుల దగ్గర ' భిక్షాం భవతి దేహి ' అని అడుగుతున్నాడుకైకమ్మ మణులతో కుట్టి, పిడి దగ్గర పట్టువస్త్రం చుట్టి, మరకతం పొదిగినటువంటి చురకత్తిని, వజ్రాలతో కూర్చినటువంటి వాలుటమ్మును భిక్షగా జోలెలో వేసింది

" రాముని ముఖం వింత కాంతులు కురిపిస్తుండగా మురిసిపోయాడు. కైకమ్మ కళ్ళలో చల్లదనం మరింత పెరిగి యేరులాగా ప్రవహించసాగింది. అంతరాంతరాళాల్లో పొరలు పొరలుగా కప్పబడి ఉన్నటువంటి స్వస్వరూపంజ్ఞానం ఒక్కసారిగా కలిగిన రఘువంశ శిశువు తాను జగములు పట్టరానంత దీర్ఘశరీరం కలవాడిగా భావించాడు. "

కైకమ్మ భిక్షగా పెట్టిన వస్తుజాలం రామునికి తన అవతార లక్ష్యాన్ని గుర్తు చేసి, శిశుత్వాన్ని కప్పివేసి, తన యొక్క త్రివిక్రమస్ఫూర్తిని తెలియజేసింది

పద్యం లోని ' యింతయై ' ' మఱింత యింత యయి ' అన్న పదాలు ' మాటలలో చెప్పలేనంత ' అన్న అర్థాన్నిస్తూ, శ్రీమహావిష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని, వామనావతారం లోని త్రివిక్రమాకారాన్ని స్ఫురణకు తెస్తున్నాయి

పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనిది.


సువర్ణ సుమన సుజ్ఞేయము- 737 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: కుంభకర్ణ ఖండము)




అతడుం గొంచెము నిద్రపోవుటకునై ఆశించెనా ! అవ్యవ
స్థితచిత్తున్ సుఖనిద్ర పొందునటెవచ్చీరాని కన్మూతలై 
యతడున్ నిద్దుర పోయినట్లుగను బోనట్లౌచు నుండన్ సమ
ర్పితధీవృత్తి జలించె నాహవమహావృత్తంబె ధారాగతిన్

అపుడు ప్రహస్తుడై పొలిచి యాశరనాయక ! యింతదవ్వు నే
రుపు బచరించినా వకట ! రుద్రుడు వచ్చినయట్టి వాకిటం 
గపులను తెచ్చినావు బహుకంపితచిత్తముతోడ నెట్టివే
లుపులును రాని వాకిటను లోకువయైరి సమస్తదానవుల్.

చెడ గొండంతటి నిన్ను గుజ్జుగను జేసెన్ వాడుగో ! మను
ష్యుడు గోరంతటివాడు కొండయయి పొల్చున్, గామవృత్తంబు నే 
ర్పెడి యీ త్రిప్పట వేడొ సజ్జనుడు నేర్చెన్ నేడు పాలింపగా
నొడయం డింద్రియపంచకంబునను గామోహాళి దాసేరుడై.

ఉప్పు న్నీయది తించునుంటిమని నీ యుద్ధాలలో జత్తు మో
యప్పా ! జీవుడు సర్వకాలము గతప్రాణుండు కానోపడీ
యప్పుం బోలిన జీవితంబునకు మా ప్రాణంబు లర్పించి నీ
యప్పుం దీర్చెద మింత దృప్తిపడు, దైత్యానీకినీ ప్రాజితా

రామలక్ష్మణులు ఇంద్రజిత్తు పన్నిన నాగాస్త్రం నుంచి విముక్తు లవటంతో, రావణునిలో మొలకెత్తిన సంశయ బీజాలు వేళ్ళూనటం మొదలుపెట్టాయి. మనశ్శాంతి కోసం మండోదరి సౌధానికి వచ్చినా, రాత్రంతా రావణుడికి నిద్ర పట్టలేదు.  

" కొంచెమన్నా నిద్రొస్తుందేమోనని ఆశించాడు రావణుడుమనస్సు మనస్సులో లేనివాడికి సుఖనిద్ర పడుతుందా? కళ్ళు మూతలు పడీ పడనట్లుంటే, నిద్ర కూడా వచ్చీ రానట్లుగా ఉంది. కళ్ళముందు  యుద్ధ విశేషాలే కనపడటం మొదలుపెట్టాయి.

వచ్చీరాని నిద్రలో ప్రహస్తుడొచ్చి యీ విధంగా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.

రాక్షసేశ్వరా ! ఏదో ఇంతకాలం నేర్పుగా నెట్టుకొచ్చావు. అయ్యో ! శంకరుడు అడుగుపెట్టిన వాకిట్లో కోతులను తీసుకువచ్చి కూచోపెట్టావు కదయ్యాదేవతలు కూడా  భయంతో వణికిపోయే నీ వాకిట్లోనే ఇప్పుడు యీ దైత్యసమూహ మంతా లోకువై పోయింది గదా

అరరే ! కొండంతటి వాడిని నిన్ను మరిగుజ్జును చేశాడు కదాఇప్పుడు నాకు గోరంత మనిషి కొండంతగా కనిపిస్తున్నాడుకామవశుడైనవాడికి  యీ విధమైన తిరగబడిన పరిస్థితి, అనగా, అల్పత్వం దాపురిస్తుంది. ఇప్పుడు  యీ తిరగబడిన పరిస్థితిని ఔన్నత్యం రూపంలో, యీ సజ్జనుడు సాధించాడు. కామానికి దాసుడవనివాడు పంచేంద్రియ వ్యాపారాలకు కట్టుపడడు.  

ఏం చేస్తాం ! నీ ఉప్పు తింటున్నందుకు నీవు తెచ్చిపెట్టిన యీ  యుద్ధాలలో చస్తాముజీవుడు ఎప్పుడుపడితే అప్పుడు ప్రాణాలు కోల్పోడుఋణానుబంధంతో కూడిన మా జీవితాలను నీకు సమర్పణ చేసి, నీ అప్పు తీరుస్తున్నామని తృప్తిపడుఅంతే. " 

పద్యాలలో రాక్షసవీరులు తనను నిందిస్తున్నాట్లుగా రావణుడి మనస్సుకి అనిపించింది. ప్రహస్తుడు " దైత్యానీకినీ ప్రాజితా ! " అనటంలో, తమ మంచిచెడ్డలు చూసుకొని తమను నడిపించవలసినవాడు కామానికి వశుడై సర్వదానవవంశ వినాశనానికి కారణమౌతున్నాడనే ఎత్తిపొడుపు నర్మగర్భంగా ఉంది.

రావణుడి యొక్క చెదిరిన మనస్సును పట్టి చూపే యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి














ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like