Monday 30 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 242 (మనుచరిత్రము: ప్రథమాశ్వాసము)

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక
శ్రీవిధి గూకటుల్ కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్
దేవరవోలె నుండి యిలు దీర్పగ గాపురమొప్పు వానికిన్.

పెద్దనగారి మనుచరిత్రము ప్రథమాశ్వాసం లోని పద్యానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు ఎంతో చక్కని వ్యాఖ్యానం చేసి, నా వంటి వానికి తెలియని ఎన్నో విషయాలు చెప్పారువాటిని నా మాటలలో మీ ముందుంచుతాను.

ప్రవరుని కాపురం ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోతున్నదట. దానికి మూడు కారణాలు చెప్పారుమొదటిది, యువకుడిగా ఉండగానే సోమయాజి అవటం, ధనవంతుడు కూడా అయిఉండటంయవ్వనం లోనే యజ్ఞం చేయటం వల్ల నైష్ఠికత అతని సహజ గుణమని భావించాలిఅందువల్ల, సంధ్యావందనం, అగ్నిహోత్రం వంటి నిత్యం జరిగే అనుష్ఠానాలు, కార్యక్రమాలు అతనికి స్వతఃసిద్ధంగానే వచ్చాయి గానీ, ఎవరో బలవంతంగా రుద్దినవి కాదు. అటువంటివాడు, హిమాలయప్రాంతంలో, ఇంటికి తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో, అప్సరస వంటి వరూధిని తనంతట తాను వలచానని చెబితే, స్థిరచిత్తంతో నిలబడగలిగాడుఇక, తలిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల, ధనం కోసం వెనుకా ముందూ చూసుకొనే కష్టాలు తనకు లేవుఒకరికింత పెట్టి, తాను తినగలిగే స్థితిలో ఉన్నాడు.

రెండవది, ప్రవరుడి వివాహంకమనీయకౌతుకశ్రీవిధి చేసారటఅంటే, ఎంతో ఉత్సాహంగా, వైభవంగావైదికమార్గంలోతలిదండ్రులు సకాలంలో వివాహం చేశారుఈడు జోడు చూసి చేశారుకూకటులు కొలిచి చేశారట. పూర్వం రోజుల్లో, ఈడు జోడు కుదిరిందా లేదా అని, జుట్టు ముడులు కొలిచి చేసేవారటప్రవరుడు అప్పటికే సోమయాజి కాబట్టి, భార్య సోమిదమ్మ అయిందిఅనుకూలవతియైన భార్య దొరికిందిఅన్నీ సమయానికి సమకూరుస్తున్నది. కొరతా లేదుఈడు జోడుగా ఉన్నారు కనుక సుఖంగా, ధార్మిక గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నారు.

మూడవది, ప్రవరుడికి పార్వతీపరమేశ్వరుల్లాంటి తల్లిదండ్రులు ఉండటం పెద్ద అండకుటుంబ భారం ఇతని మీద పడకుండా, బాధ్యతలన్నీ వాళ్ళే నిర్వహిస్తున్నారు. అతడి పనల్లా, సంధ్యావందనం, అగ్నిహోత్రం చేయటం, వేదాధ్యయనం చేయడం, శిష్యుల చేత చేయించటం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను జాగ్రత్తగా చూసుకొనడంజీవితం, వైదిక మార్గంలో, చక్కగా సాగిపోతున్నది.

పద్యం ఇప్పటి రోజులకి కూడా చక్కగా అన్వయించుకోవచ్చుఆర్థికంగా  ఒడుదుడుకులు లేకుండా ఉండి, సకాలంలో తలిదండ్రుల చేతుల మీదుగా వివాహం జరిగి, పెద్దవాళ్ళు మంచీచెడులు చెబుతూ, చీకుచింతా లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంటే, మనిషికి అంతకంటె ఇంకేం కావాలి?


ఇన్ని విశేషాలున్న పద్యానికి ఇంత చక్కని వివరణ ఇచ్చిన ఆచార్యులవారికి ప్రణామాలర్పిస్తూ ముగిస్తున్నాను.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like