Wednesday 18 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 202 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధకాండము: సంశయ ఖండము)

విప్పెసలారు మోముపయి వేలుపువాహిని యెఱ్ఱయొండు బొ
ట్టొప్పగ స్నానమున్ సలిపి యొడ్డున నట్టిటు తిర్గుచున్ జరీ
కుప్పడమంచు ధోవతిని గొంగులువారగ నారబట్టు నే 
గొప్పద్విజుండ వొక్కొయిటకుం జనుదెంచితి మత్సఖుండవై.

శ్రీనాథ కవిసార్వభౌముని శృంగారనైషధము కావ్యంలో, హంస నలదమయంతుల మధ్య దౌత్యం (రాయబారం) నెరిపింది స్ఫూర్తితో, కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు తమ అత్యుత్తమ కావ్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, సంశయ ఖండంలో, హంసదౌత్యాన్ని ప్రవేశపెట్టారు.

విశ్వనాథవారి పద్యం యెంత అందంగా, బిగువుగా ఉంటుందో, వచనం కూడా అంత అందంగా, బిగువుగా ఉంటుందిఇక్కడ విశ్వనాథవారు చక్కని వచనం వ్రాసారు.

" ఆంత మహాసేనవోని సముద్రంబునకును సముద్రంబువోని మహాసేనకును నడుమ నున్న శ్రీరామచంద్రమూర్తి పశ్చిమ సంధ్యోపాసనాంతమున నొక్క శిలాతలంబున నాసీనుండై సంజ యెఱ్ఱదనమ్ములు చివళ్ళ నదిమిన సాగర వీచీకాంతి పరీణత రాజహంస కుడికంటి మలపుల మెలపులుగా జూచి. " 

భగవంతుడైన శ్రీరామచంద్రుని ధ్యానించి, దివ్యత్వాన్ని హృదయంలో నింపుకొని, రాజహంసను భ్రూమధ్యంలో నిలుపుకొంటే, రాజహంసగా వచ్చిన  శివుడు ప్రత్యక్షమవుతాడు.

విశ్వనాథవారు, ఖండానికి సంశయ ఖండమని నామకరణం చేశారు. రావణుని అనుమాన మేమంటే, విష్ణువు రాముడిగా తనను సంహరించడానికి వచ్చాడా అని, యీ రామునికి సీతకు మధ్య శివుడు రాయబారం నెరపడానికి వచ్చాడా అనిరావణుని మదిని తొలుస్తున్న యీ భావాలన్నీ మనం తరువాత పద్యాలలో చూస్తాము. ప్రస్తుతానికి , పద్యం యొక్క అందాన్ని చూద్దాము.

రాజహంస ఎట్లా ఉన్నదివిశాలమైన ఫాలభాగం మీద, గంగానది ఒడ్డున ఉన్న యెఱ్ఱ ఒండ్రుమట్టిని బొట్టుగా పెట్టుకొని, స్నానం చేసి వచ్చి, ఒడ్డున అటూ ఇటూ తిరుగుతూ, జరీ అంచుల ధోవతి కొంగులు పుచ్చుకొని, గాలికి ఆరబెట్టే గొప్ప బ్రాహ్మణుడి వలె ఉందిద్విజుడు అంటే పక్షిజాతికి చెందినది, బ్రాహ్మణుడని రెండు అర్థాలు

హంస తెల్లగా ఉంటుంది. ఱెక్కలు బంగారం రంగులో, ముక్కు యెఱ్ఱగా ఉంటాయి.
ఱెక్కలు విప్పుకొని అటూ ఇటూ తిరుగుతున్న హంస, ముఖాన బొట్టు పెట్టుకొని, జరీ అంచుల ధోవతి కొంగులను పుచ్చుకొని, ఆరబెడుతున్న బ్రాహ్మణుడిలా వర్ణించడం ఎంతో ఔచిత్యభరితంగా ఉందివేలుపువాహిని, అనగా, స్వర్లోకగంగఎంతో పవిత్రమైనదివేలుపువాహినిలో స్నానం చేసి వచ్చిన బ్రాహ్మణుడు పవిత్రత పొందినవాడు.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like