Tuesday 17 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 199 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్యకాండము: దశవర్ష ఖండము)

అదియేమే రఘురామచంద్రునకు బాలా! తుమ్మిపూ ల్మాలగా 
గుదిగ్రుచ్చన్ మదినెంతు రాము డటవీ గుంజాగళాంకుండు దా
రదకంఠుండు కిరాతరాజటె? గృహారామంబు కోరళ్ళు మొ
గ్గు దలల్ నిండగ గమ్మతావి ముసరౌ గోరింటపూలుండగన్.

శ్రీరామచంద్రుడు, సీతాసమేతుడై, లక్ష్మణునితో పాటు వనవాసానికి వస్తున్నాడని మున్యాశ్రమాలకు వార్త చేరిందిమున్యాశ్రమాల్లో అవతారమూర్తియైన రామునికి స్వాగతం పలకటానికి సన్నాహాలు జరుగుతున్నాయివృద్ధ మునికాంతలు, కన్యలకు చిన్న చిన్న పనులను అప్పగించారు. అందులో ఒకటి పూలమాలలు కట్టడం. కొంతసేపయిన తరువాత, కన్నెపిల్లలు  మాలలు యెట్లా కడుతున్నారో చూద్దామని మునికాంతలు అక్కడకు వచ్చారువారు చేస్తున్న పని చూసి వారు ఆశ్చర్యానికి లోనయ్యారుఇదీ యీ పద్యానికి నేపథ్యంమునికాంతల ఆశ్చర్య ప్రకటనే యీ పద్యం.

" అమ్మాయి! ఏమిటే నువ్వు తుమ్మి పూలతో మాల కడుతున్నావు? రాముడేమన్నా ఆటవికుడిలాగా మెడలో గురిగింజలు, పూసలు ధరించే వాడావిషాన్ని కంఠంలో దాచిన వాడాలేకపోతే కిరాతరాజాఅయ్యో! చుట్టుప్రక్కలంతా కమ్మని వాసనలు విరజిమ్ముతూ పసుపుపచ్చని గోరంట పూలుంటేనూ? "

తుమ్మిపూలు పొదల్లో, తుప్పల్లో, దారిప్రక్కన పూచే, చేతికి కూడా అందని చాలా చిన్న పూలు. వాటిని ఎవరూ పట్టించుకోరు, ఎవరికీ ఇష్టమైనవి కావు. ( ఒక్క శివునికి తప్ప).  అటువంటి పూలను సేకరించి, ఒకదాని తరువాత ఒకటి గ్రుచ్చడం పెద్ద పనిమరి, పిల్లలు పని చేస్తున్నారుతుమ్మిపూలు శివునికి ఇష్టమని విషయ పరిజ్ఞానమున్న మునికాంతలకు తెలుసునేమో? పూసలు మెడలో వేసుకున్నవాడు, విషాన్ని కంఠంలో దాల్చిన వాడు, కిరాతరాజు, శివుడని, తెలిస్తే తెలిసి ఉండవచ్చుగాని, తుమ్మిపూలు ఇష్టమైన వాడు శివుడని, మీకు కూడా తెలిసిపోయిందా, వచ్చే రాముడు, శివుడేననే రహస్యం, బహుజన్మల తపఃఫలంగా గాని తెలియని యీ మహార్థము మీకు కూడా తెలిసిపోయిందా? అనే భావం స్ఫురించేటట్లు, మునికాంతలు ఆశ్చర్యాన్ని ప్రకటించారు.

మునికాంతలు పెద్దవారు కనుక కొన్ని సూక్ష్మమైన రహస్యాలు తెలుసు. శివునికి తుమ్మిపూలు ఇష్టమని, రామునికి గోరంటపూలు ప్రీతికరమని, పల్లీయులకు, మునిపల్లెల్లో ఉన్న పెద్దవారికి తెలుసుబహుజన్మల తపఃఫలంగా లభ్యమయ్యే శివకేశవుల అభేదజ్ఞానం, రాముడే శివుడనే యెరుక, ఇంత చిన్న పిల్లలకు యెట్లా తెలుసా అన్నదే, మునికాంతల ఆశ్చర్యానికి కారణంఇదే, పద్యం లోని  ధ్వనిపూర్వక రహస్యార్థం.


శివకేశవుల అభేదాన్ని ధ్వనిపూర్వకంగా తెలియజేసిన ఇంత మంచి, యింత అందమైన పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్యకాండము, దశవర్ష ఖండములో ఉంది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like