Saturday 14 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 182 (ఎఱ్ఱన భారతము: అరణ్యపర్వము: చతుర్థాశ్వాసము)

' వినుతచరిత్రు డత్రి యను విప్రవరుండు తపం బొనర్ప గా
వనమున కేగుచుండి తన నాతి గొనుంగొని యిట్లనుం " దపం
బున కిదె యేను బూని  వనభూమికి బోవుచు నున్నవాడ, నో
వనరుహనేత్ర! నీవు నట వచ్చెదొ పుత్రుల యొద్ద నుండెదో. '

అనుటయు భార్య యిట్లనియె ' నక్కట! పుత్రులకుం గుటుంబభా
నియమవృత్తు లెల్లను దిరంబుగ జేయక యాశ్రమాంతరం 
బునకు మహాత్మ! నీకు నిటు వోవుట ధర్మువు గాదు; వైన్యభూ
జనపతి యిచ్చు నర్థులకు జాలగ; నర్థము వేడు మవ్విభున్. '

శ్రీమదాంధ్ర మహాభారతము అరణ్యపర్వము చతుర్థాశ్వాసంలో ఎఱ్ఱన రెండు పద్యాలలో సనాతన భారతీయ సంప్రదాయము నందున్న  నాలుగు ఆశ్రమాల యొక్క సమతుల్యతను పాటించడమనే సున్నితాంశాన్ని, భార్యాభర్తల మధ్య సంభాషణ రూపంలో చక్కగా తెలిపరచారు.

అత్రి ఆనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకొనడానికి వనభూమికి వెళ్ళదలచుకొన్నాడు. అదే విషయం భార్యకు చెప్పి, ఆమె తనతో వచ్చినా, లేదా, కొడుకుల వద్ద నున్నా అంగీకారమే నని చెప్పాడుఅది విన్న, అతని భార్య, కొడుకులకు కుటుంబాన్ని నిర్వహించవలసిన విధానాలను, కట్టుబాట్లను వివరించకుండా, కుటుంబ బాధ్యతలను అప్పగించకుండా, తపస్సు చేసుకొనడానికి అడవులకు వెళ్తాననడం భావ్యమా, అని ప్రశ్నించిందిఅంతటితో ఆగక, సహధర్మచారిణిగా కర్తవ్యాన్ని కూడా సూచించిందివైన్య మహారాజు గొప్ప దాత గనుక, అతనిని అర్థించి కుటుంబపోషణకు కావలసిన ధనాన్ని తీసుకు రావసిందిగా సలహా ఇచ్చింది.

సనాతన భారతీయ సంప్రదాయములో, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనే నాల్గు దశ లున్నాయిబ్రహ్మచర్యము విద్యార్థి దశగార్హస్థ్యము, వివాహం చేసుకొని, సత్సంతానాన్ని పొంది, కుటుంబ బాధ్యతలను నిర్వహించవలసిన దశకుటుంబ బాధ్యతలను నిర్వహించి, తరువాత తరానికి అప్పగించిన తరువాత చేపట్టవలసిన దశ వానప్రస్థమువానప్రస్థాన్ని భార్యతో కలిసి ఆచరింపవచ్చని మన ప్రాచీన ఋషులు చెప్పారుఅందువల్లనే, అత్రి, భార్యకు ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చాడుకానీ, కుటుంబ బాధ్యతలు తీరకుండా, తప్పించుకొని, ముక్కు మూసుకుని తపస్సు చేసుకొనాలనుకొనడం ధర్మం కాదని, అవివేకమని అత్రి భార్య భావించిందిఅదే విషయాన్ని భర్తకు చెప్పింది.  ' మహాత్మ ' అన్న సంబోధన ఆమెకు భర్తపై గౌరవం తగ్గలేదని తెలియజేస్తుందిఅందువల్లనే, మన సనాతన  భారతీయ  సంప్రదాయములో భార్యను " కరణేషు మంత్రి " అని వర్ణించింది.


మహాభారతము నందలి జరత్కారువు కథ గృహస్థాశ్రమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పిందిదీనినే మన పెద్దవారు వయసులో ముచ్చట వయసులో తీరాలి అని మూడు ముక్కల్లో చెప్పారు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like