Sunday 31 May 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 477 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధరంగంలో కాండము: సంశయ ఖండము)















నలువుగఁ బైడికఱ్ఱుగల నాఁగలి వెండిది పూని సన్న మి
న్నుల నువుచేను దున్నుకొనునో నును వెన్నెలకాఁపునాగ, ము 
క్కలుగను నేలగడ్డ విఱుగన్ దెలిమన్ను వెలారినట్లు
బ్బులపొర లొప్పఁగా గగనభూమిని హంస చరింపనయ్యెడన్.

మునుకొని యాకసంబనెడి బూడిదగుమ్మడిపాదు దిక్కులం
దునఁ గొనసాగి పూ వదలెనో పువురేక తుదళ్ళఁ దేంట్లు నె
ఱ్ఱని  మధువల్ల ఱెక్కలను బ్రామడ వ్రాలి చరించుచుండగా
ననఁగను హంస మింటనడయాడగ దైత్యమహేంద్రుఁ డుగ్రతన్.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము , సంశయ ఖండంలో " హంస దౌత్యం " ఘట్టం విశ్వనాథోపజ్ఞకం.   ఆకాశాన విహరిస్తున్న హంసను విశ్వనాథ ప్రబంథరీతిలో తనివితీరా వర్ణించారు

" ఆకాశంలో హంస విహరిస్తూ ఉంటేచక్కగా అమర్చిన బంగారపు కఱ్ఱు గల వెండి నాగలితోసన్నని వెన్నెల కాంతిలోఆకాశమనే నువ్వుచేనును దున్నుతున్నట్లుగా ఉంది. ఇక ఆకాశంలోని మబ్బుపొరలు, సన్నని వెన్నెలలో, దున్నిన నేల ముక్కలు ముక్కలుగా విరిగి, తెల్లని మట్టిని పైకి లేపుతున్నట్లుగాకనబడుతున్నాయి.

ఆకాశమనే బుడిదగుమ్మడిపాదు అన్ని దిక్కులకు పాకి, పువ్వులను వదిలిందా అన్నట్లు, పూరేకల చివరలో తుమ్మెద, ఎర్రని తేనె అంటుకొన్న రెక్కలతో వాలి తిరుగుతున్నదా అన్నట్లు, హంస ఆకాశంలో విహరిస్తూ  ఉందిరావణుడు కోపంగా దాని వంక చూసాడు. "

అవతారికలో, విశ్వనాథ పదిమంది ప్రాచీనాంధ్ర మహాకవులను గురుస్థానంలో ఉంచారు. వారిలో, పెద్దన, కృష్ణదేవరాయల వంటి ప్రబంధకవు లున్నారువారి మార్గంలో, స్వీయప్రతిభను జోడించి, సందర్భోచితంగా, ప్రబంథ రీతిలో హంసదౌత్యములో విశ్వనాథ హంసను అత్యద్భుతంగా వర్ణించారు










సువర్ణ సుమన సుజ్ఞేయము - 476 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: పూర్వరాత్ర ఖండము)













మంగళరూప ! యయ్య! హరిమర్కటమర్కట ! పంచవక్త్ర !
ట్వాంగ మహాసిఖేట కుధరామృతకుంభ సృణి ప్రదీపితో
త్తుంగ కరాంబుజాత ! నవతోయదమూర్తి ! త్రిపంచనేత్ర !
ర్పాంగదకంఠహార ! యసురావళిమర్దనబాహు ! మారుతీ

ప్రాసంగ్యోత్థ కకుద్భుజావనత ! సర్వజ్ఞా ! సమీచీన బా
హా సంపాదిత రామకార్య ! దితిసూహా ! నిత్యతృప్తా ! స్వతం
త్రా ! సింహానన ! వైనతేయ ! చటులాస్యా ! యగ్నిగర్భా ! మహా 
త్మా ! సర్వగ్రహభీనివారణ ! సముద్రాంభో మహాపత్తరీ

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములోని రెండు పద్యాలు ఆంజనేయుని వర్ణనకు సంబంధించినవిఆకాశమార్గంలో, సముద్రాన్ని దాటి లంక దిక్కు గా పయనిస్తున్న ఆంజనేయుని దివ్యవిగ్రహాన్ని చూసి, భావనాసమాధిస్థితుడై శచీపురందర ఋషి చేసిన స్తుతి ఇది. పద్యాలలో ప్రసన్నాంజనేయ స్తుతితో పాటు పంచమూఖాంజనేయ స్తుతి కూడా ఉన్నదిఅన్నిటికంటె ముఖ్యంగా, రామకార్యార్థియై వెళ్తున్న హనుమంతునికి కార్యసాఫల్యం కలగాలంటే, మహానుభావుడికి స్వస్వరూపజ్ఞానం కలగాలి.   స్వస్వరూపసంధానం కలిగించటానికి నాంది కిష్కింధా కాండం చివరలోనే జరిగిందిసర్వ దేవతలు, సిద్ధులు, సాధ్యులు, ఋషులు భావనాసమాధిస్థితిలో హనుమ స్వస్వరూపసంధానం పొందడానికి ధ్యానం చేశారువిశ్వనాథ అక్కడ మొదటిసారి పద్యాలను వాడారు. ఇది అద్భుతమైన శిల్పరచనఎప్పుడైతే ఆంజనేయునికి తన బల మేమిటో తెలిసిందో, అప్పుడు ' త్రుటిలో లాంగూల మాభీల జిహ్మగ పుచ్ఛోగ్ర విచాలనాద్భుత రవవ్యాదీర్ణ రోదోంతరంగంబుగ సంతాడన ' మాచరించాడు. మహేంద్రగిరి నెక్కాడు. అప్పుడు

" కెవ్వున గీపెట్టె క్షితిధరం బంతఁ బం
చాస్యంబు మదకుంభిఁ చఱచినట్లు "

అదీ ఆంజనేయుని యొక్క మహాద్భుతమైన శక్తి...

రెండు పద్యాలలో, విశ్వనాథవారు తమ ఉపాసనాబలంతో, పంచముఖాంజనేయ మంత్రాలను  నిబంధించారని  పెద్దలు చెప్పగా విన్నాను. పద్యముల లోతైన మంత్రార్థాలను మహాపండితులు, ఉపాసకులు చెప్పవలసిందే కానీ, నా వంటి వారికి సాధ్యం కాదు. అయినప్పటికీ, ఆంజనేయ ప్రార్థనలో నేను  చదువుకొనే ప్రసిద్ధ పద్యాలకు, కనీసం నావంటి అల్పజ్ఞుల అవగాహన కొరకు, పద్యాల అర్థాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తున్నాను.

" వాయునందనా ! నీవు శుభప్రదమైన రూపము గలవాడివి. గౌరవింపదగినవాడివిహరిమర్కటమర్కట మంత్రస్వరూపుడవుపంచముఖాంజనేయమూర్తివి. ఖట్వాంగము అనే శివాస్త్రము,   పదునైన ఖడ్గము, కుధరము (డాలు), అమృతకుంభముఅంకుశము మొదలుగా గల ఆయుధాలను ధరించినవాడివి. తెలిమబ్బుల ఛాయ కలవాడివి. ఒక్కొక్క ముఖమునందు త్రినేత్రములు కలిగిన శివస్వరూపుడవు. సర్పములను కంఠమునందు, దేహము నందు ఆభరణములుగా ధరించిన పరమేశ్వరస్వరూపుడవు. దైత్యులను మర్దించే ఘనమైన బాహువులు కలిగినవాడవు

ప్రసంగ సమయంలో కొద్దిగా వంగిన బుజములు కలిగినవాడివి. సర్వజ్ఞుడివిరామకార్యదీక్షాపరతంత్రుడవుదైత్యమర్దనుడవు. నిత్యతృప్తుడవు, మహాయోగివి. స్వతంత్రుడవు. నారసింహస్వరూపుడవు. గరుత్మంతుని స్వరూపుడవు. అగ్నిముఖుడవు, అగ్నిగర్భుడవు.   గొప్ప ఆత్మవిదుడవుగ్రహపీడను తొలిగించేవాడివి. సముద్రమనే మహాకాశాన్ని దాటుతున్నవాడివి. "

అని విధంగా, శచీపురందర ఋషి, సర్వదేవతలు. సర్వ ఋషులు, భావనాసమాధిస్థితులై, ఆంజనేయుని కార్యసాఫల్యం కోసం ధ్యానం చేసారుఇదేవిధంగా, సీతాన్వేషణ కాలంలో, ఎప్పుడెప్పుడు హనుమ తీవ్రమైన మానసికాందోళనకు గురయ్యాడో, అప్పుడు, శచీపురందరమునితో సహా, సర్వదేవతలు, ఋషులు, హనుమకు కార్య సాఫల్యం కలగాలని ధ్యాననిమగ్నులై ఉండటం గమనిస్తాముఆంజనేయుని అద్భుతమైన విరాట్ దర్శనం పుర్వరాత్ర ఖండంలో ఒక ముఖ్యమైన ఘట్టం.



సువర్ణ సుమన సుజ్ఞేయము - 475 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా ఖాండము: నూపుర ఖండము)















తమ్ముఁడు నందెలే యెఱఁగుఁ దమ్ముఁడుఁ గాడొక దైవమీతఁడీ
క్రమ్మిన బాష్పరోధమునఁ గాంచఁగఁ జాలను భూషణచ్ఛవుల్
తమ్ములనిచ్చె నాకు మఱి దైవము జానకి నిచ్చె నాకు నీ
తమ్ములు దేవతాసములు తన్వియు దైవత లోకరత్నమై.

భూసుత స్త్రీజగత్తునకు భూషణ మాయమ భూషణంబులన్
భాసురముల్ కనుంగొనెడు  భాగ్యము కంటెను భాగ్యమున్నదే
యీ సొబగైన భూషణము లెవ్వఁడు చూపెను వాఁడె మిత్రమా
నీ సొబగైన భూషణము నెవ్వఁడు గుర్తిడె వాఁడె తమ్ముఁడౌ.

రామసుగ్రీవుల మైత్రీబంధం ఏర్పడిన తరువాత, ఋష్యమూకం మీద సీత జారవిడిచిన నగలను సుగ్రీవుడు చూపించాడు. చీరకొంగు చింపి కట్టిన నగలమూటను చూడగానే రామునికి దుఃఖం పొంగుకొచ్చిందిఅందువల్ల, నగలను సరిగా పోల్చుకోలేకపోయాడు. లక్ష్మణుడు ఉభయసంధ్యలలోను సీతమ్మ పాదాలకు నమస్కరిస్తాడు కాబట్టి, తల్లి కాలి అందెలను గుర్తుపట్టాడు. దృశ్యాన్ని చూసిన రామునికి, సోదరుల యొక్క, జానకి యొక్క సౌశీల్యం ఒక్కసారిగా మనసులో మెదిలి, ఇలా అన్నాడు.

" తమ్ముడు లక్ష్మణుడికి ఒక్క కాలి అందెలే తెలుసులక్ష్మణుడు నాకు తమ్ముడే కాదు, దైవసమానం. కళ్ళలో నీరు క్రమ్ముకోవటం వల్ల, ఆభరణాలు సరిగా చూడలేకపోయాను. ఇటువంటి దేవతాసమానులైన తమ్ముళ్ళను, దైవతలోక రత్నమైన భార్యను, దైవం నాకు ప్రసాదించాడు

సీత స్త్రీలోకానికి ఆభరణం వంటిది. అటువంటి సీత ఆభరణాలను చూసే భాగ్యం కంటె వేరొక భాగ్యం ఉందా అందమైన ( మంగళప్రదమైన) ఆభరణాలను ఎవడైతే చూపాడో, వాడే నిజమైన మిత్రుడు, ఇంతటి అందమైన (పూజార్హమైన) కాలి అందెలను ఎవడైతే గుర్తుపట్టాడో, వాడే తమ్ముడు. "

పై పద్యాలు శ్రీరామచంద్రుని   భావోద్వేగాన్ని తెలియజేస్తున్నాయి. సీతారాముల దాంపత్యం ఒక విడదీయరాని, విడదీయలేని తత్వంఅందువల్ల, తత్త్వస్వరూపిణియైన సీత ఆభరణాలకు శ్రీరాముడు అంత ప్రాధాన్యాన్ని ఆపాదించాడుఆమె ఆభరణాలు ఆమె ఉనికికి గుర్తు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనివి.




ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like