Tuesday 17 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 201 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధాకాండము: నూపుర ఖండము)

దర్శనమాత్ర తర్పిత హృదంతర భావుడు సాధుమూర్తి యా
దర్శగతాత్మబింబ కలితంబుగ  నక్కపిరాజు జూపెడున్
స్పర్శముచేత వాయుసుఖశైత్యము దీపితమెట్లొ భావనా
మర్శితవాక్కుచే నుభయ మంజులభావము దీప్తమయ్యెడున్

ఇంతటి చారుధీకు వినయేందిరు సాధుని వాక్ప్రతిష్ఠు నా
చెంతకు బంచినట్టి  కపిశేఖరు నౌచితి హృద్యమయ్యెడున్
జింత సురారి చెప్పినది చెప్పినయట్టుల గానిపించు దా
నింతటి మంత్రి నేలెడు కపీశ్వరు డెంతటివాడు కావలెన్.

సుగ్రీవుని ఆదేశం మేరకు భిక్షుకుని వేషంలో హనుమంతుడు శ్రీరాముని వద్దకు వచ్చాడుహనుమంతుని చూడగానే  శ్రీరాముని హృదయంలో మెదిలిన భావములకు అక్షర రూపమే యీ రెండు పద్యాలు.

" ఇతణ్ణి చూసినంత మాత్రం చేతనే, నా హృదయంలో ఏదో తెలియని తృప్తి కలుగుతున్నదిఇతడు సత్త్వగుణం ప్రధానంగా కలవాడిగా కనిపిస్తున్నాడుఅద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకొన్నట్లు, ఈయనను చూస్తే నన్ను నేనే చూసుకొన్నట్లుందిస్పర్శ చేత గాలిలో ఉన్న చల్లదనం యెట్లా తెలుస్తుందో, ఇతని మాటలో ఉన్న భావనా సంయమనము చేత, ఇతని వాక్కు, మనస్సు  రెండింటి యందు గల మృదుత్వం  తెలుస్తున్నాయి.

ఆహా! ఇంతటి బుద్ధినైశిత్యం, వినయం , మంచితనం, మాటనేర్పు కలవానిని నా వద్దకు పంపినట్టి వానరరాజు ఔచిత్యం హృదయాన్ని తాకుతున్నదికబంధుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగేటట్లున్నదిఇంత గొప్పవానిని మంత్రిగా పెట్టుకున్న వానరేశ్వరుడు ఎంత గొప్పవాడు అయిఉండాలి! " 

శ్రీమద్రామయణ కల్పవృక్షము, కిష్కింధాకాండము, నూపుర ఖండము లోని యీ రెండు పద్యాలు, హనుమంతుని, శ్రీరామచంద్రుని హృదయ నిర్మలత్వాన్ని, మంజులభావాన్ని తెలియజేస్తున్నాయి.


ఎదుటివాని హృదయ నిర్మలత్వం చూడాలంటే, చూసేవాని హృదయ మంజులభావం ఎంతటిదయి ఉండాలి?

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like