Tuesday 10 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 166 (తిక్కన భారతము: కర్ణపర్వము: ప్రథమాశ్వాసము)

అది యొక్క డేల? కౌరవ చయంబు జయాశ యడంగి ప్రోవ బె
ట్టిదు డగు భీమసేనుడు గడింది మగంటిమి దుస్ససేను దు
ర్మద మడగించి పేరురము వ్రచ్చి మహోగ్రత ద్రావె నెత్తు  
య్యది దుది నింత పుట్టునని యాప్తజనంబులు మున్న చెప్పరే?

సంజయుడు దుఃఖాతిశయంతో కర్ణుని మరణం గురించి ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు.

" కౌరవులకు గెలుపు మీద ఆశ నశించడానికి కర్ణుని మరణం ఒక్కటే కారణం అని అనుకోవడం దేనికి? మహోగ్రరూపం దాల్చిన భీమసేనుడు, దుశ్శాసనుని పొగరణగించి, అతని  ఱొమ్ము చీల్చి జుగుప్సాకరంగా నెత్తురు త్రాగడం కూడ ఒక కారణంఇటువంటి ఆపద ముంచుకు వస్తుందని ఆప్తులు చెప్పనే చెప్పారు కదా! "

పద్యంలో దేహ దీపళీ న్యాయంగా, ముందు వెనుక వాక్యాలకన్వయించేటట్లువాక్యాలను వాక్యాంశాలను ప్రయోగించడం తిక్కనగారి రచనా శిల్పానికి ఒక చక్కని ఉదాహరణదేహ దీపళీ న్యాయమంటే, రెండు గదుల మధ్య గడప మీద పెట్టిన దీపం, రెండు గదుల లోనికి వెలుతురును ప్రసరింపజేస్తుందిఅదేవిధంగా, రెండు వాక్యాలు, వాక్యాంశాల మధ్య వాడిన వాక్యాలు, రెండు వాక్యాలను, వాక్యాంశాలను ప్రభావితం చేస్తాయిఇటువంటి ప్రయోగం, పద్యంలో రెండు చోట్ల చేయబడ్డది.

పద్యం మొదటి పాదంలో, " కౌరవ చయంబు జయాశ యడంగి ప్రోవ " అనే వాక్యం ప్రయోగించారు తిక్కనగారు. కౌరవుల జయాశ నశించడానికి, కర్ణుని మరణం ఒక్కటే కారణం అని అనుకొనడమెందుకు అని, మహోగ్రరూపం దాల్చిన భీమసేనుడు, దుశ్శాసనుని ఱొమ్ము చీల్చి నెత్తురు త్రాగడం కూడా కారణం అని అన్వయించుకోవచ్చును.

రెండవది, " అయ్యది " అనే ప్రయోగందీనిని నెత్తురు అనే పదానికి అన్వయించుకుంటే, ద్రౌపదిని పరాభవించే మదం కలిగిన నెత్తురిని అని చెప్పుకొనవచ్చును. అట్లా కాకుండా, అయ్య+ది అని విడదీస్తే, యువరాజు దుశ్శాసనునిదైన (అయ్యదైన) నెత్తురు అని చెప్పుకొనవచ్చునుశ్రీనాథ కవిసార్వభౌముడు కూడా " సోమరిపోతులు కొందరయ్యలు " అని ప్రయోగం చేశారుకావున, ద్రౌపదిని పరాభవించిన అయ్యది అనీ, ఆప్తులు చెప్పిన హితవాక్యాలను పెడచెవినిబెట్టిన అయ్యది అనీ అన్వయించవచ్చును.


తిక్కన భారతము కర్ణపర్వము ప్రథమాశ్వాసము నందలి యీ పద్య విశేషాంశాలన్నీ బ్రహ్మశ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారు అందించిన వ్యాఖ్యాన సారాంశమని, దానిని మీతో పంచుకొనడమే నేను చేసినదని, సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like