Monday 9 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 161 (ఎఱ్ఱన భారతము: అరణ్యపర్వము: చతుర్థాశ్వాసము)

ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మట్లౌట నె
క్కాలంబుం బటుమృత్యురోగభయశంకం బొంద మే మెన్నడున్.

పూర్వం హైహయవంశానికి చెందిన దుందుమారుడనే రాజకుమారుడు జింకచర్మాన్ని ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ, పొదలమాటున ఉన్న ఒక బ్రాహ్మణ బాలుడిని, జింకగా తలచి, బాణం వేసి చంపాడు. తరువాత పొరపాటు తెలుసుకొని విషయం పెద్దవారికి చెప్పాడు. దీనికి చాల బాధపడ్డ వృద్ధహైహయులు సమీపంలో ఉన్న తార్క్ష్యుని ఆశ్రమానికి వెళ్ళారు. వారందరినీ చూసి, అతిథి మర్యాద సలపడనికి సన్నాహం చేస్తున్న మహర్షిని చూసి, తామందుకు తగినవారము కామని, జరిగినదంతా సవిస్తరంగా చెప్పారు. అంతా విన్న తార్క్ష్యుడు మరణించాడని వారనుకొంటున్న బ్రాహ్మణ బాలుడిని వారికి చూపించాడుఆశ్చర్యచకితులైన వారందరికీ, ఆశ్రమవాసులకు భయం, రోగం, చావు, చెరలో ఉంచబడటం వంటి బాధలు ఉండవని, దానికి కారణాలను వివరించాడు.

ఆశ్రమంలో వారెన్నడూ సమయాన్ని దుర్వినియోగం చేయరు. పరిశుభ్రమైన ఆహారం భుజిస్తారు. అతిథి, అభ్యాగతులను పూజిస్తారు. సత్యవాక్పరిపాలన చేస్తారుశాంతి, బ్రహ్మచర్యం అనుష్ఠానం చేస్తారు. నియమాలన్నీ పాటించడం వల్ల, ఆశ్రమవాసులకు, మృత్యు, వ్యాధి భయాలు లేవు. అందువల్ల, వారికి ఎటువంటి భయాందోళనలు లేవు.

పూర్వకాలం, భారతదేశంలో పాటించబడిన యీ నియమాలు వర్తమాన సమాజంలో అందరూ పాటిస్తే, సంతోషానికి, ఆనందానికి నిలయమైన నవభారతదేశం నిర్మాణమౌతుంది.


ఎఱ్ఱన భారతము అరణ్యపర్వశేషం లోని యీ పద్యం అందరూ మననం చేసి, అందులోని నియమాలను ఆచరణలో పెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like