Saturday 11 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 601 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)












ఎవ్వఁడుర నీ వటన్నట్టి యిట్టలంపు
టెగచునదలింపు విని తలయెత్తి చూచె
నరఁటి పూ బొమ్మలకు పైని దొరలవోని 
డిప్పలైనట్టి వగు కనుఱెప్పలార్చి.

కడు గుప్త్యర్థము మేను కుంచుకొనియున్ గద్దింపుమాటల్  వినం
బడి రెట్టింపుగ నయ్యె మారుతి పురః పైశాచమూర్తిన్ గనం
బడెఁ దా నొక్కతె చెట్ట రాక్షసి సుధూమ్రంబైన మైచాయతోఁ
గడలం జాచినబాహువుల్ భ్రుకుటిలగ్న క్లిష్టధూమ్యాకృతిన్

రక్కసి వానరేశ్వరుని ప్రౌఢియుశౌర్యము గుర్తుపట్టి యా
తక్కువరూపు గోపన పథంబునఁ జేసిన తెచ్చి కోలుగా 
నిక్క మెఱింగి  మోము హసనీయుగ సంగ్రసనంబు గాఁగఁదా
గ్రక్కెడు కోప ఖండములుగాఁ బరుషోగ్రవచస్సు లాడుచున్

టక్కరికోఁతి! యూరక హఠాత్తుగ విన్న విరోధిమాటకున్ 
బొక్కు స్వభావమై తెలియఁబోకయ యింతకు నింతయైతివే
యెక్కడికోఁతి వీ చనుట యెక్కడి కేరియనుజ్ఞచేసి యీ
దిక్కున వచ్చినావు ప్రసృతి ప్రణిమీలన చాతురీచణా!

హనుమంతుడు లంకాపట్టణం లోని దుర్గం యొక్క ప్రథమద్వారం దాటాడు. పట్టణం యొక్క కట్టుదిట్టంగా ఉన్న రక్షణ వ్యవస్థను చూసి, కుముదుడు, అంగదుడు, సుగ్రీవుడు, సుషేణుడు, మైందద్వివిదులు, కుశపర్వ కేతుమాలులు, అతడు తప్ప ఇంకొకరు దుర్గం  లోనికి ప్రవేశించటం సాధ్యపడదని అనుకొన్నాడు. ప్రథమ ప్రాకారం లోపల నున్నటువంటి ఇళ్ళను వెదకి, చింతాక్రాంతుడై ఒకచోట అల్పదేహంతో కూర్చున్నాడు

ఇంతలో ' ఏవడురా నువ్వు? ' అనే అదలిస్తున్న మాట విని, అరటిపువ్వు బొమ్మల పైన దొరల వంటి  డిప్పలైనట్టి కనురెప్పలను ఆర్పుతూతలయెత్తి చూశాడు.

గద్దింపు మాటలు వినపడేటప్పటికి, రహస్య సంచారం కోసం కుదించుకొన్న తన దేహం అమాంతంగా రెండింతలయిందిహనుమకు ఎదురుగా నగర రక్షణ చేస్తున్న ఒక పిశాచాకారం కనపడిందిఅది ఎఱ్ఱదనాన్ని మించిన నలుపు రంగులో ఉందిదాని చేతులెంత పొడ్గున్నాయంటే, అవి సముద్రపు అలల్ని తాకుతున్నాయి రాక్షసి  కౌటిల్యమంతా       కేంద్రీకరించుకొని  దట్టమైన పొగ  ఆకారంలో ఉంది.

రాక్షసి, హనుమంతుడి దేహదారుఢ్యాన్ని, శౌర్యాన్ని అంచనా వేసింది అల్పదేహం, రహస్యంగా సంచరించటం కోసం తెచ్చిపెట్టుకొన్న దేహమన్న యదార్థాన్ని గ్రహించిందిఅగ్నికుండం వంటి పెద్ద నోటిని తెరిచి, నిప్పు కణికలను కక్కుతున్నట్లుగాపరుషమైన మాటలను మాట్లాడింది.  

" నువ్వు టక్కరి కోతివిఊరకే హఠాత్తుగా విన్న శత్రువుల అలికిడికి భయపడే స్వభావం ఉన్నదానివి, నీకు తెలియకుండానే ఇంతకు ఇంత పెరిగి పొయ్యావుటే? నువ్వెక్కడి కోతివిఎక్కడికి పోతున్నావు? ఎవరు పంపిస్తే ఇక్కడకొచ్చావు? " 

హనుమంతుడు ఎలాగైతే బుద్ధివిశేషం కలవాడో, అలాగే నిత్యజాగృతుడు. అందుచేతనే, కాపలా కాస్తున్న రాక్షసి అదలింపు మాటలు వినపడగానే, తన దేహాన్ని పెంచి, రాక్షసిని ఎదుర్కొనటానికి సిద్ధపడ్డాడు

రాక్షసి, హనుమంతుడిని ' టక్కరి కోతి ' అని సంబోధించి, ' ప్రసృతి ప్రణిమీలన చాతురీచణా ! ' అనే సంబోధనతో ముగించిందిఅంటే, చారెడు దేహంగా కుదించుకొన గలిగిన చాతుర్యం కలవాడని అర్థం.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like