Tuesday 7 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 598 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అవతార ఖండము)











నీ యుపకారమున్ మఱువనే మఱి యో జననీ ! యెవండుగా
నీ యొకసత్కృతిన్ సలుప నీవగు దింకొక రౌదు రెవ్వరో
చేయకయే సహాయపడి చేయఁగ రాదును దత్ఫలంబు రాఁ
జేయగరాదు లోకమున సేమము త్వాదృశులందు నిల్చెడున్.

జననీ ! యే మహనీయులైన నుపదేశం బిచ్చినన్ దానిభా
వనయున్ భావనగాఁగ నిల్చిన ఫలంబా ! దేవతామూర్తి ని 
న్నునుబోలెం జనుదెంచి యాచరణమందుం జొన్ పకున్నన్ నినున్
నిను మన్నింతు నహల్యకన్నను హిమానీసత్కృపారాశిగన్.

వరయుగ్మ మీ వడిగి తే వరయుగ్మము రా జొసంగె నే
నా వరయుగ్మపాలనకృతార్థజనుష్కుఁడ నైతినేని నా
యా వరపాలనాత్త సుకృతాఖిలదివ్యత యందుఁ దల్లి ! శ్రీ 
దేవత వీవు, నన్ననుమతింపుము నీదు పదార్చకుండుగా

మూడు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.

కైక రామునికి తాను దశరథుని వద్ద నుండి పొందిన వరాలను గురించి చెప్పింది.   ఒక ప్రసంగంలాగా, దుఃఖాన్ని బయటకు కనపడనీయకుండా, ఉద్విగ్నతతో కూడిన గొంతుతో మాట్లాడుతున్న పినతల్లి కైకను కనుకొలకుల్లో నుంచి చూసిన రాముడు, మృదువైన కంఠస్వరంతో ఇలా అన్నాడు.

" అమ్మా ! నీ ఉపకారాన్ని నేనెలా మరువగలనుఎవరైనా ఒక మంచి పని చేశారంటే, అది నీ వంటి వారి వల్లనే అవుతుంది. ఎవరో ఒకరు సహాయం చేయకుండా సత్ఫలాన్ని ఎట్లా పొందగలములోకకళ్యాణమనేది నీ వంటి వారిలోనే స్థిరంగా ఉంది.

అమ్మా! ఎవరైనా మహనీయులు చేసిన ఉపదేశం భావనారూపంలోనే నిలిచిపోయి, నీ వంటి దేవతామూర్తి దాన్ని ఆచరణలో పెట్టకుండా ఉంటే, ఇక దాని ఉపయోగమేమిటిఅందుచేత, నిన్ను నేను అహల్యాదేవి కంటె అధికంగా, కృపారాశి పరమేశ్వరిగా భావిస్తాను.

నీవేవైతే వరాలు రాజు నడిగావో, రెండు వరాలు రాజు నీకిచ్చాడు. నే నా వరాలను పాలించి కృతార్థుడినైతే, సత్యవాక్పరిపాలన అనే పుణ్యఫలం పొందటమనే దివ్యత్వం కలిగించిన దేవతవు నీవే అవుతావుఅటువంటి పరమేశ్వరి పదార్చకుడిగా, నన్ను వరాలను అమలుచేయటానికి అనుమతించు. "

విశ్వనాథ వలె కైక పాత్రను సహృదయంతో అర్థం చేసుకొన్న వారు, రామాయణ భాష్యకారులెవరూ లేరుఅందుచేతనే కైక అడిగిన వరాలకు, రామావతార లక్ష్యానికి ఒక చక్కని హేతువును కైకేయి  పాత్రచిత్రణలో కనబరిచారు విశ్వనాథ

ఖండంలో కైకకు రామునికి మధ్య జరిగిన సంభాషణలు నేరుగా పాఠకుల హృదయాల లోనికి చొచ్చుకుపోయి, కైక పాత్రను వాల్మీకి మహర్షి విధంగా భావించారో, దానిని భాష్యకారునిగా ఋష్యాత్మయైన విశ్వనాథ విధంగా వ్యాఖ్యానించారో అవగతమౌతుంది.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like