Sunday 19 April 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 319 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధకాండము: సంశయఖండము)

విప్పెసలారు మోముపయి వేలుపువాహిని యెఱ్ఱయొండు బొ
ట్టొప్పగ స్నానమున్ సలిపి యొడ్డున నట్టిటు తిర్గుచున్ జరీ
కుప్పడమంచు ధోవతిని గొంగులువారగ నారబట్టు నే
గొప్ప ద్విజుండ వొక్కొ యిటకుం జనుదెంచితి మత్సఖుండవై.

లంకలో, సముద్రతీరాన, సాయంకాల సంధ్యోపాసనానంతరం ఒక రాతిపై కూర్చున్న    శ్రీరామచంద్రునికి , సముద్రపు అలలపై నుండి ఒక హంస తనవైపు రావటం కనిపించింది హంస కొంచెంసేపు ఆకాశంలోకి ఎగురుతూ, కొంచెంసేపు రామునికి సమీపంలో రెక్కలాడిస్తూ, కొంతసేపు, సముద్రతరంగాలను కాళ్ళతో విదిలిస్తూ తిరుగుతున్నదిహంసను చూసిన రామునికి, తన విరహవేదనను సీతకు తెలియచేయడనికి శివుడే రూపంలో వచ్చాడనిపిస్తుందిఇంకా, మనస్సు పలువిధాల ఆలోచనలతో నిండిపోతుందిహంస, తన వియోగభావనాజనిత వాంఛాస్వరూపమనీ, తన కన్ను చెదిరిందనీ, తాను చూసింది నిజమైన హంసనేననీ, తలపోస్తూ, ఏమీ తెలియని స్థితిలో, తెలియకపోవటంలో ఒక విలక్షణమైన అనుభవపు ఊగిసలాటకు లోనయ్యాడు రకమైన ఒక అనుభూతిని వర్ణించేదే పద్యం.

" హంసరాజమా  ! విశాలమైన ముఖానికి గంగానది యెఱ్ఱ ఒండ్రు మట్టిని బొట్టుగా పెట్టుకొని, స్నానం చేసివచ్చి, నది ఒడ్డున అటూ ఇటూ తిరుగుతూ, జరీఅంచుల ధోవతి కుచ్చెళ్ళుగా పట్టుకొని, ఆరబెట్టుకొంటున్న ఒక బ్రాహ్మణశ్రేష్టుడిలాగా కనిపిస్తున్నావు నాకునా ప్రియమిత్రుడిలాగా కనిపిస్తున్నావు. "

శ్రీరామునికి హంసను  గురించి ఆలోచించేటప్పుడు తనకు పరమశివుడే జ్ఞప్తికి వస్తున్నాడుహంస " మీనాంక హరానలోజ్జ్వల శిఖాహంకార సౌందర్యం రేఖాంశమై " కనిపిస్తున్నది

ముఖంపై యెఱ్ఱటి బొట్టుతో, స్నానం చేసివచ్చి, తడిసిన ధోవతి జరీ అంచులను కుచ్చెళ్ళుగా పట్టుకొని, గాలికి ఆరబెట్టుకొంటున్న ద్విజుని వలె హంస కనబడటం ఎంతో ఔచిత్యంతో కూడుకొని ఉందిఎందుకంటే, హంస ముక్కు ఎఱ్ఱగా, శరీరం తెల్లగా, రెక్కల అంచులు బంగారు రంగుతో మెరిసిపోతుంటాయి.   ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, పక్షి.


శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, సంశయ ఖండము నందలి యీ పద్యం చదవగానే చప్పున " తల పక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు " అన్న ఆముక్తమాల్యదలోని పద్యం స్ఫురణకు వస్తుంది. రాయలవారి పద్యం, వారి కల్పనాచమత్కృతికి నిదర్శనమైతే, విశ్వనాథవారి యీ పద్యం, వారి ఉదాత్తకల్పనకు తార్కాణం. ఉదాత్త కల్పన అని ఎందుకన్నానంటే, పక్షికులంలో హంస, మానవులలో బ్రాహ్మణుడు, స్వచ్ఛతకు, పవిత్రతకు స్థానాలుగా పెద్దలు పేర్కొంటారు.  

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like