Wednesday 24 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 554 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)












వీరుడవే ! బలే బెదురు పెట్టితి చెట్టకు మంచుగుట్టకున్
నేరక నిన్నుఁజెప్పినది నీకును నెక్కడఁ జెప్పిపోదునో 
వారక నేనటంచతఁడు పడ్డ భయంబునును జిట్టలయ్యె నా
సార భుజాబలంబునకు సాటిగఁ జెప్పుటయున్ విచిత్రమై.

త్రావినవానికిన్ స్మృతిపథంబునయందునఁ గోఁతులాడుఁ నా
త్రావుట కోఁతియైనయెడఁ ద్రావినవానికిఁ దేలు కుట్టి
నట్లై వెడబుద్ధియై యతఁడు నెంచడు తల్లినిఁ దోడుఁ జూడ లే
దా ! విబుధుల్ సురారిపులయినంతట దైత్యుల వెళ్ళఁబుచ్చుటల్.

 త్రాగని మీరు దానవులు త్రావినవారె నయంబనన్  గృధా
భోగులు  మీరు చేయవలె భూమికి ధర్మవినిర్ణయంబు మీ
చేగయుఁ దెల్వి యెంతయినఁ జెప్పవలెన్ మఱి దున్నపోతవై
యీగతి వచ్చుటే తెలుపు నేమిర ! త్రావుటగూడఁ దప్పురా?

కొంచె మాలోచనము చేసికొమ్ము నీదు 
తెలివి స్పష్టమ్ముగా నీకె తెలియఁగలదు
ఎచట ఘోరాంబురాశి నీవెచట నెచట
హిమగిరీంద్రంబు నాప ! నీ వెచట చూడు.

 వట్టి వెఱిపప్ప క్రిందం
గట్టిరి నిన్నంచుఁ దార కై కైకొనిపో
నట్టె మగుడ దుందుభి యేను 
గిట్టలతో మన్ను చిమ్మి కీశేశుపయిన్.

హిమవంతుడు చెప్పిన మీదట, దుందుభి కిష్కింధాపురికి వెళ్ళి, దుర్గద్వారం దగ్గర వికృతాట్టహాసం చేశాడుమధుపాన మత్తుడై ఉన్న వాలికి చిర్రెత్తుకొచ్చిందిద్వారం దగ్గరకు వెళ్ళి చూస్తే, గడ్డిపరకల్ని పళ్ళ మధ్యలో ఇరికించుకొని నములుతున్న పశువులాగా,నిల్చొని ఉన్న దుందుభిని ఎదురుగా చూసాడు. వాలిని కవ్విస్తూ, వాడిలా అన్నాడు.

" మంచి వీరుడివేలే ! బలే భయపెట్టావుగా ! మంచుగుట్ట హిమవంతుడు నీ గురించి చెప్పిన మాటను ఎక్కడ నీకు చెబుతానో అని వాడు పడ్డ భయం అంతాఇంత కాదుగా ! నా భుజపరాక్రమానికి సాటివాడివి నువ్వని హిమవంతుడు చెప్పాడు చూడు, అది ఇంకా విచిత్రంతప్పత్రాగినవాడి మనసులో కోతులాడుతుంటాయిమరి తాగింది, కోతి అయి, దానికి తేలు కుడితే, ఇక గంగవెర్రులెత్తిపోతాడుఅటువంటి  అల్పబుద్ధి కలవాడికి తల్లీతోడు వంటివి ఉండవు. దేవతలు సురాపానానికి అలవాటుపడి రాక్షసులని వెళ్ళగొట్టడం చూడలేదా

దుందుభి విధంగా మాట్లాడేటప్పటికి, వాలికి చిరాకు వేసి, వాడితో ఇలా అన్నాడు.

" త్రాగని రాక్షసుల కంటె త్రాగినవారే నయమన్నట్లుగా, క్రోధంతో భోగాలనుభవించే మీరు భూమి మీద ధర్మనిర్ణేతలయ్యారంటే, మీ చేవ, తెలివి ఎంతగా ఉన్నాయో చెప్పితీరాలిసరేలే ! దున్నపోతుగా నువ్విట్లా రావటమే చెబుతున్నది నువ్వేంటోత్రాగటం కూడా తప్పురా నీకు?

కొంచెం బుర్ర ఉపయోగిస్తే, నీ తెలివేంటో నీకు తెలుస్తుంది. ఓరి నాప ! ఎక్కడ మహాసముద్రం, హిమవత్పర్వతం, ఎక్కడ నువ్వు ! నిన్ను వెర్రి వెంగళప్ప క్రింద జమకట్టారురా ! సరిగా చూసుకో ! " అని వాలి ఇలా వాడి తలతిక్క వదిలిస్తుండగానే, తార అతడి చేయి పట్టుకొని తీసుకువెళ్ళిందిదుందుభి మళ్ళీ తన గిట్టల్తో భూమినంతా దున్ని, వానరరాజు వాలి మీద కాలు దువ్వాడు.

దుందుభి మూర్ఖత్వాన్ని తెలియజేసే పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనివి.


















No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like