Monday 1 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 480 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)
















చెడుకల వచ్చె నాకు నభిషేకము వద్దనినట్లు రాముఁడి
ప్పుడు తెలిసెన్ సమస్తశుభమూర్తికి రామున కేమి లోపమే?
నడు నడు ! సర్వభూషణసనాథత నూతననూతనాకృతిన్
వడివడిఁ బోయి బాలుని శుభంబుఁ గనుల్  తెరదీయఁ జూచెదన్.


శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండంలో, విశ్వనాథ కైకేయి పాత్రను తీర్చిన తీరు ఎంతచెప్పినా తనివితీరదు.

రాముని అభిషేక వార్త విన్న మంథరకు పాము విషం తలకెక్కినట్లయిందిఎకాయెకిన కైకేయి దగ్గరకు వచ్చి, అర్థనిద్రలో ఉన్న కైకను లేపి, " అవునె దౌర్భాగ్య మాకారమైన దాన ! నీకు నిద్దుర యెటుపట్టునే దరిద్రురాల ! " అని నిలదీసింది. క్రితం రోజు వరకు అభిషేకం ఊసే లేదు, మరుసటి రోజే అభిషేకమని ముహూర్తం పెట్టేటంత తొందరేమొచ్చిందని, భరతుడు మేనమామ ఇంటికి వెళ్ళినపుడు, ఇంత దొంగచాటుగా యీ పని చేయవలసిన అవసరం మేమొచ్చిందని సూటిగా అడిగిందికైకకు నెత్తిమీద పెద్దమ్మ వచ్చి కూచున్నట్లుంది, అందుకనే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది అని ఆడిపోసిందిరాముడు రాజైతే, మంథరకే కాదు కైకకు కూడా స్వతంత్రంగా తినటానికింత కూడైనా ఉండదని, ఇక ఎప్పటివో పాతకక్షలనీ తవ్వి తీస్తాడని నూరిపోసింది.

రకంగా చెబుతున్న దాది మాటలు వినీవినకుండా, అర్థనిద్రలో నుంచి మేలుకొని, సంతోషంతో విప్పారిన ముఖంతో, " అమ్మయ్య ! రాముడు అభిషేకానికి ఒప్పుకున్నాడు కదా ! " అని అడిగింది సంతోషంలో కైక ఇంకా ఇలా అన్నది.

" మంథరా ! రాముడు అభిషేకం వద్దన్నట్లు నాకొక పీడకల వచ్చిందినువ్విప్పుడు అభిషేకం సంగతి చెప్పగానే, నాకు తెలిసింది. సర్వలక్షణసంపన్నుడు రాముని కేమి లోపమే? పద పద. తొందరగా వెళ్ళి, సర్వాలంకారభూషితుడైన రాముని సుందరాకృతిని కనులారా  చూడాలి. "

చెవిలో ఇల్లు కట్టుకొని  ఇంత చెప్పినా, కైకేయి మనస్సుకు మంథర మాటలు ఎక్కలేదుఅందుకనే, ఆమె వినీవిననట్లుగా ఉంది.  " ఇంత హడవుడిగా రేపు ప్రొద్దునే రాముని అభిషేకానికి అంత తొందరేమిటి? " అని మంథర అడిగిన ప్రశ్నలో నుండి, రాముడు అభిషేకానికి అంగీకరించాడన్న సమాధానపూర్వకమైన అంశమే ఆమెకు అమితానందాన్ని కలిగించింది.


అయోధ్యా కాండములో, విశ్వనాథ కైకేయి పాత్రను పొరలు పొరలుగా పాఠకుని ముందుంచి, ఆమె ఉదాత్తతను హృదయానికి హత్తుకొనేటట్లుగా పతాకస్థాయికి తీసుకువెళ్ళారు.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like