Tuesday 9 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 510 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)










అరుదగు కొండవోని మహిషాకృతి రిక్తవసాత్వగస్థి పం
జర మిది ముగ్ధపత్రక కిసాలయ సూన మనోజ్ఞతా జలా
కరమగు ఋష్యమూక గిరికాననలక్ష్మి శరీరమందునం
బురిపిడికాయనా వెగటు పుట్టఁగజేసెడు చూచుకంటికిన్.


ఎంతటి బ్రహ్మనిష్ఠుఁడొ మహేశ్వరుఁడా ముని యంత భావుకుం
డింత యసహ్యమైనయది యిచ్చట నెట్టుల నోర్వగల్గె నీ
ప్రాంత ధరిత్రి శోభకపవాదిది తా శ్రమణిన్ మదర్థమై 

యింతటనుంచిపోయిన మునీశ్వరు ప్రీతియొనర్తు నిచ్చటన్.

సుగ్రీవుడు, తన మంత్రులు , రామలక్ష్మణులతో కలిసి, ప్రభాత సమయంలో, ఋష్యమూక పర్వతం మీదకు వెళ్ళారు. అక్కడ, చెడి పనికి రాకుండా పోయిన చంద్రుని యొక్క పెద్ద కిరణాలుపాత దూలాలు గుట్టగా పోశారన్నట్లున్న, , కొండంత అస్థిపంజరాన్ని చూశారు. మతంగ మహర్షి ప్రశాంతంగా తపస్సు చేసుకొనే ఋష్యమూక పర్వతం మీద దుర్గంధభూయిష్టమైన అస్థిపంజరం ఉండటానికి కారణ మేమిటని అడిగాడు. అప్పుడు, సుగ్రీవుడు దుందుభి కథను చెప్పటం ఆరంభించాడువాలిసుగ్రీవుల వైరానికి, వాలి వధకు, దుందుభి కథ పూర్వరంగం.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము నందలి చిన్న కథలలో దుందుభి కథ కూడా ఒక రసవత్తరమైన కథ.  

" మిత్రమా ! అందమైన చిగురుటాకులు, పత్రపుష్పాలు, సరోవరాలతో మనోజ్ఞంగా విలసిల్లే యీ ఋష్యమూక పర్వతము మీద, దున్నపోతు ఆకారంలో, బాగా ఎండిపోయిన అస్థిపంజరం కొండలాగా పడివుండి, సుందరమైన శరీరంలో పురిపిడి కాయలాగా చూడటానికి వెగటు పుట్టిస్తున్నది

మహేశ్వర స్వరూపుడైన మతంగ మహర్షి ఎంతటి బ్రహ్మనిష్ఠుడో, అంతటి భావుకుడు కూడాఅటువంటివాడు, ఇంత అసహ్యమైన, దుర్గంధాన్ని విరజిమ్ముతున్న, అస్థిపంజరం పడి ఉండటాన్ని ఎలా ఓర్చుకోగల్గుతున్నాడు ఋష్యమూక పర్వతప్రాంత శోభకు ఇది అపవాదు కలిగిస్తున్నది. నిందలను భరిస్తూ, నాకు సహాయం చేయటానికి నాతో మైత్రి వహించిన సుగ్రీవుడికి, పర్వతాన్ని  నివాసప్రాంతంగా చేసిన మునీశ్వరునికి ప్రీతి కలిగిస్తాను.  " 

అని శ్రీ రామచంద్రుడు కాలి బొట్టనవ్రేలితో కళేబరాన్ని ఆకాశంలో విసిరివేశాడుఅది హిమగిరి శిఖరంలా ఎగిరి, దూరంగా ఎక్కడో పడిందిసుగ్రీవుడి మంత్రులు  చూసి వచ్చి, అది పది ఆమడల దూరంలో పడిందని చెప్పారు

కళేబరం అక్కడ ఉండటం మునిరాజుకు ఇష్టం లేదు కాబట్టే, తాను అక్కడ ఉండగలుతున్నానని సుగ్రీవుడు శ్రీరాముడికి చెప్పాడు.

వృత్తాతం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండంలో ఉంది.







No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like