Sunday 28 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 563 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: ఇష్టి ఖండము)



ఇపుడె గుండిగ దింపి యిగుర బెట్టితిఁ  బొడి పొళ్ళాడు నీ యన్నమును దినుండు
పూర్ణమ్ము లేకుండఁ బునుకులుగా వేసితిమి కరకరలాడు తినుఁడు వీని
గాలుచు నున్నది కాఁబోలు క్షీరాన్న మిదె దొన్నెలను దెచ్చియిత్తు నుండుఁ
    డిది గడ్డపెరుఁగు మీరింకఁ గొంచెము వేసి కొనవలెఁ జలువ చేయును గదండి

యనుచు బతిమాలి బతిమాలి యవనినాథ 
సూదకులు కొల్లలుగఁదెచ్చి చూఱయీయ
నన్నమును నాదరంబునఁ దిన్న కడుపు

లెన్న నెఁడదలు నుబ్బిపోయెదరు జనులు.

అన్నంపురాసులు చిన్న తోమాలెలకై సన్నజాజులు పోసినట్లు
సన్నఖర్జూరపుఁ జాపలపై సూపరాసులు గంధమ్ము తీసినట్లు
ఎఱ్ఱవాగుగను వేయించి నప్పడములు పునుఁగు కుంకుమ కుప్పవోసినట్లు
వంగపండుల పేళ్ళ వరుగు చోష్యపు గుబాళింపు లత్తరులు నొల్కించినట్లు

      రాఘవుల యిలవేల్పు శ్రీ రంగనాథ
ప్రభువు పవళింపు సేవకై భద్రపఱచి
నట్టి సంభార మనఁగ  మహాసనంబు
ద్రవ్యములు పొల్చె దశరథక్రతువు వేళ.

దశరథ మహారాజు పుత్రసంతానం కోసం అశ్వమేధ యాగ సన్నాహాలు చేస్తున్నాడు. బంధువులకు, మిత్రులకు, ఋషిసంఘాలకు, అతిథులకు ఆహ్వానాలు పంపించాడు. వారి విడిది దగ్గర నుంచి, యాగం చూడటానికి వచ్చేవారి కోసం భోజనాల ఏర్పాట్లు చేశాడు. ఇక అయోధ్యావాసుల సంగతి సరేసరి. వారంతా యజ్ఞశాల దగ్గరే కొలువుతీరి ఉన్నారు

శ్రీమద్రామాయణ కల్పవృక్షం, బాల కాండము, ఇష్టి ఖండము లోని యీ రెండు సీసపద్యాలలో, తెలుగువారి ఇండ్లలో జరిగినట్లుగా, దశరథ మహారాజు చేసిన ఏర్పాట్ల నన్నిటినీ వర్ణించారుయజ్ఞం చూడటానికి వచ్చిన అతిథులు, పురజనులకు  వంటవాళ్ళు  కొసరి వడ్డించటం, వారి అతిథి మర్యాదకు అద్దం పడుతుంది.

" ఇప్పుడే గుండిగ దించి, ఇగురబెట్టాము. అన్నం పొడిపొడిలాడుతూ ఉంది అన్నం పెట్టించుకోండిపూర్ణాలు మాదిరిగా కాకుండా, కరకరలాడేటట్లు పునుగులుగా వేశాము. ఇవి తినండిఅయ్యో ! పాయసం బాగా వేడిగా ఉన్నట్లుంది, ఉండండి దొన్నెలను తెస్తున్నాంగడ్డపెరగండి బాబూ ! చలువ జేస్తుంది కొంచెం వేసుకోండిఅని విధంగా అంటూ, దశరథ మహారాజు సేవకులు కొసరి కొసరి వడ్డించారు. భోజనం చేసిన జనాల హృదయాలు సంతోషంతో ఉబ్బిపోయాయి. "

ఇక విశ్వనాథ, వంటలను వర్ణించిన తీరులో, తెలుగుదనం ఉట్టిపడుతున్నది.

" తోమాలెలలో (అన్నం వడ్డించే గిన్నెలు) నింపిన అన్నం సన్నజాజులు పోసినట్లుగా ఉందిరాసులుగా ఖర్జూరపు చాపలపై పోసిన పప్పు, గంధం తీసినట్లుగా ఉందిదోర ఎరుపు రంగులో వేయించిన అప్పడాలు, పునుగు కుంకుమ కుప్పపోసినట్లుగా ఉందిపండిన వంకాయల వరుగుతో చేసిన చోష్యం అత్తరుల వాసన గుబాళిస్తున్నది విధంగా వండిన పదార్థాలు, రఘువంశ రాజుల ఇలవేల్పు రంగనాథస్వామి పవళింపు సేవ  కోసం సమకూర్చిన సంభారాల లాగా దశరథ మహారాజు   వంటశాల కనిపించింది. " 

రెండు సీసపద్యాలలో విశ్వనాథ ఒక ప్రక్కన దశరథుని అతిథి మర్యాదలను వర్ణిస్తూనే, తెలుగువారి వంటలను కూడా రుచి చూపించారు.

రెండు సీసపద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనివి.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like