Monday 1 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 479 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాలకాండము: ఇష్టి ఖండము)












క్రతుయత్న మెంతదూరము వచ్చెనో చూడ వెల్లేన్గు వజ్రి పంపించెనొక్కొ
యజ్ఞాగతునకు నారాయణునకు మున్గదలి పాంచజన్యంబు తరలెనొక్కొ
యాగఫలంబైన యమృతకుంభము మింటఁ దెరలి ప్రాగ్దిశ బయల్దేరెనొక్కొ
మైత్రావరుణి ప్రేమమంజులాశీర్వాద వల్లిక తలపూవు వదలెనొక్కొ

యష్టతనువుల హోత్రి యైనట్టి తనువు 
తోడి రుద్రసంరంభవిధూతి చెదరి
ముందునకుఁ దూఁగెనో యన నిందుబింబ
మల్లఁబ్రాచి బారెఁడు పైనిహౌసులొలికె.

దశరథుని అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేస్తున్నారు.   యాగం చేయవలసిన స్థల నిర్ణయం జరిగిందియజ్ఞశాలను నిర్మించారు. అతిథులు ఉండటానికి గృహాలు, భోజన వసతులు, అన్ని వర్ణాల వారికీ కల్పించారుఇక్కడ విశ్వనాథ  అందమైన సీసంలో ఒక అద్భుతమైన కల్పన చేశారుఅదేమిటంటే, శ్రీమహావిష్ణువు రామునిగా జన్మించి రావణ సంహారం చేస్తానని మాట ఇచ్చాడు కదాఅందుకని, యాగం ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు రాముడు పుడతాడా అని దేవతలందరూ ఎదురు చూస్తున్నారుఆకాశంలో విహరించే చంద్రుడికి కూడా ఎంతో ఉబలాటంగా ఉందియాగం పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దామని వచ్చాడా అన్నట్లు, పూర్ణచంద్రుడు ఆకాశంలో అందాలొలికించాడట.

" దశరథుని యాగం పనులు ఎంత వరకు వచ్చాయో కనుక్కోవటానికి ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని పంపించాడా అన్నట్లుయజ్ఞాగతుడైన శ్రీమన్నారాయణుని కంటే ముందే అతని శంఖం పాంచజన్యం కదలివచ్చిందా అన్నట్లు, యజ్ఞఫలమైన అమృతకలశం ఆకాశంలో తూర్పు దిక్కున  బయలుదేరిందా  అన్నట్లు, మైత్రావరుణి  (అగస్త్యుడుప్రేమతో తన చల్లని  ఆశీర్వాదచిహ్నంగా, తల మీద పువ్వును వదలాడా అన్నట్లు, శివుని అష్టతనువులలో ఒక తనువైన ఋత్విక్కు  రుద్రసంరంభంతో (ప్రమథగణాలతోచెదిరిపోయి  కదిలి ముందుకు దూకాడా అన్నట్లు, చంద్రబింబం తూర్పుదిక్కున బారెడు పైన ఒయ్యారాలు ఒలికించాడు. "

ఐరావతం, పాంచజన్యం, అమృతకుంభం మొదలైనవి తెల్లనైనవి, తెల్లని పాలసముద్రం చిలికినప్పుడు ఉద్భవించినవి.

శ్రీమద్రామాయణ కల్పవృక్షములో చంద్రవర్ణనాన్ని ప్రధాన కథకు అనుసంధానం చేసి విశ్వనాథ సందర్భోచితంగా పలు తావుల్లో ఉపయోగించుకున్నారుఉదాహరణకు, క్రతుయత్నాన్ని చూడటానికి వచ్చినట్లు చేసిన వర్ణన వలె, దాశరథుల జననాన్ని, శైశవాన్ని చూడటానికి వచ్చాడా అన్నట్లు కూడా విశ్వనాథ, తన కల్పనాచమత్కృతిని జోడించి వర్ణనలు చేశారు.

వర్ణన శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండములో ఉంది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like