Monday 8 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 501 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)















ఓసీ ! యోసి ! యిదేమి దుఃఖమె విచిత్రోదంత వాచాల !
ర్వాసుప్రాంగణముగ్ధదీపిక కదే యా బిడ్డ శ్రీరాముఁడా
శాసంపాదకుఁ డెల్ల జీవులకుఁ దీక్షాధర్మపారంపరీ
వ్యాసంగుం డతఁ డొండు రాజయిన నెగ్గా? నీకునున్ నాకునున్.


మాండవి కన్న జానకియె మన్ననసేయును నన్ను బిడ్డ రా
ముండును దల్లికంటె ననుఁ బూజలుపట్టును, దానిమాట
ట్లుండఁగనిమ్ము, రాముఁడొకయోగి మఱిన్  దితిజోగ్రవారి మా

ర్తాండుఁడు దానికై తనువుఁదాల్చె రహస్యముసుమ్ము మంథరా

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండములోని పద్యాలు, విశ్వనాథ, వాల్మీకి హృదయానుబంధిగా, కైక పాత్రను ఎంత మహోదాత్తంగా తీర్చిదిద్దారో అర్థమౌతుంది.

తన ప్రాణానికి ప్రాణమైన రాముడు పట్టాభిషేకం చేసుకొనడానికి అంగీకరించాడన్న వార్త విని ఆనందించిన కైక, మెడలోని హారాన్ని తీసి, మంథరకు బహుమానంగా ఇవ్వబోయింది. నివ్వెరబోయిన మంథర, దానిని కైక చేతుల నుండి లాక్కొని దూరంగా విసరివేసి, బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టిందిఅట్లా ఏడుస్తున్న మంథర మీద కొంత  ప్రసన్నత వహించిన కైక ఇలా అన్నది.

" ఓసి మంథరా ! ఇదేం దుఃఖమే? నువ్వు చెప్పేదంతా  విచిత్రంగాను, నోటి దురుసుతనంగాను ఉందే ! సర్వ జీవుల ప్రాణాలనే ముంగిలిలో వెలుగొందే దివ్యజ్యోతి  కదే శ్రీరాముడుసర్వ జీవుల ఆశలను తీర్చేవాడు కదే ! ధర్మ పరంపరను దీక్షగా కొనసాగించేవాడు కదే ! అటువంటివాడు రాజైతే నీకు కష్ట మేమిటి, నాకు నష్ట మేమిటి

ఇంకొక విషయం తెలుసా నీకు? నా కోడలు మాండవి కన్న ఎక్కువగా సీత నాకు మర్యాద ఇస్తుంది. ఇక బిడ్డ రాముడు సరేసరి. తల్లి కంటె ఎక్కువగా నాకు సపర్యలు చేస్తాడుదాని మాటకేం గానీ, అదట్లా ఉండనీ. రాముడు ఒక యోగి. దైత్యులనే మహాసముద్రాన్ని ఇంకింపజేసే సూర్యుడుఅసలు దాని కోసమే అవతారమెత్తాడు మంథరా ! ఇది రహస్యం సుమా ! "

పద్యాలు చదువుతుంటే, కైకేయి పాత్ర యెడల జనబాహుళ్యంలో ఉన్న అపవాదు మంచులా కరిగిపోయి, ఆమె ఉదాత్త భావాలతో హృదయం ప్రక్షాళనమై, కరుణరసం పొంగులువారుతుంది.  

విశ్వనాథ ఋషీ ! తెలుగునేలకు రామాయణమనే స్వర్లోక కల్పవృక్షాన్ని తీసుకువచ్చావు.   జాతి నీకెంతో  ఋణపడి ఉంది.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like