Thursday 18 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 540 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)











ఐనను వెట్టపుట్టునటు లాడుము యాపయి నీ అదృష్ట మీ
వై నను పోయి వార్ధిని హిమాద్రినిఁ జూచుఫలంబు పండు రే
లైనను నుండు మేల్కనియె యాతఁడు శీధురసోగ్రపాయి, యా
పానము తూలనాడుము విపత్తును  నెత్తికిఁ దెచ్చికొంటివే.

అనిన నతఁడంతవాఁడా యటంచు నసుర
వానిపేరును చెప్పినవాఁడ వేమొ 
కావనఁగ నవ్వుచును  హిమగ్రావరాజు
వాలి, కిష్కింధపురి నేలు వానరుఁ డనె

 నిన్నొక్కటి యర్థించెద
నిన్నాతఁడు కొమ్ములూని నింగిని విసరున్
ననుం జెప్పకు కోపము
నన్నా మీఁదికిని విసరినన్ విసరుఁజుమీ.


సముద్రుడు చెప్పిన మీదట, దుందుభి హిమవంతుడి దగ్గరకు వెళ్ళాడుకాలి గిట్టలతో, కొమ్ములతో హిమవత్పర్వత ధాత్రిని దున్నసాగాడు . దానితో హిమవంతుడికి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొన్నట్లయింది. దుందుభి దున్నపోతు కదా ! వాడికేమో హిమవంతుడి కండలు చెక్కుతున్నట్లుగా అనిపించింది. హిమవంతుడు వాడిని ఎవరని అడిగాడు. దానితో వాడు  

తన పేరు చెప్పి, సముద్రుడు చెప్పినదంతా చెప్పి, తనతో యుద్ధానికి రమ్మని కవ్వించాడు. దుందుభి పరమమూర్ఖుడని హిమవంతుడికి అర్థమైపోయింది. అయినా ఏడిపించటానికి, " సముద్రుడు ఎట్లా నా పేరు చెప్పాడో కానీ, నాకసలు యుద్ధమే రాదు. ఎప్పుడూ, ఋషులు, వచ్చే అతిథులు, పోయే అతిథులు. ఇదంతా ఒక గోడులే ! " అన్నాడుదాంతో దుందుభి పక పకా నవ్వి, " ఓరి ! చూస్తేనేమో కొండంత ఒళ్ళూ, దాన్లో నలుసంత మనసా? అది సరే గాని, నాతో యుద్ధంలో చేయగల సమ ఉజ్జీ ఎవరన్నా నీ ఎరుకలో ఉంటే చెప్పు. " అని అడిగాడు

" ఎరుగున్నావా? అంటే ఎరుగున్నాననే అనుకుంటాను. ఆయన ఇదివరకు బాగా యుద్ధాలు చేసేవాడు. ఇప్పుడు వాటి జోలికి పోవట్లేదు. ఎప్పుడూ తప్పతాగి, అడవాళ్ళ కౌగిళ్ళలో ఉంటాడు. వెళ్ళి, ఆయన్ని  తాగుబోతని బాగా తిట్టుఆయనకు బాగా కోప మొచ్చేటట్లు మాట్లాడు. దాంతో ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. ఇక తరువాత నీ అదృష్టం. " అని హిమవంతుడు ఎక్కడలేని వినయాన్ని నటిస్తూ చెప్పాడు

" అబ్బో ! అంతవాడా? ఇంతకీ వాడి పేరు చెప్పావు కాదే? " అని అడిగాడు దుందుభి.

ఏదో రహస్యం చెబుతున్నట్లు, " ఆయన పేరు వాలి, కిష్కింధాపురి నేలే వానర రాజులే ! " అన్నాడు

దుందుభి వెకిలిగా నవ్వుతూ, దక్షిణదిక్కుగా వెళ్తుంటే, వాడిని కొంచెం సేపు ఆపి, " నాయనా ! పొరపాటున నా పేరు గాని చెప్పేవు? కోపంలో, ఆయన నిన్ను నా మీదికి విసిరినా విసురుతాడు. " అని బతిమాలుతున్నట్లు నటిస్తూ, బాగా ఉసిగొల్పాడు.


శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోని యీ సన్నివేశం, సముద్రుడికి దుందుభికి మధ్య జరిగిన ఆసక్తికర ఉదంతం లాగానే, దుందుభి మూర్ఖత్వాన్ని మరింతగా తెలియజేస్తున్నది.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like