Monday 29 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 568 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: ఇష్టి ఖండము)











ఎన్నన్ నీవు జటాయువా? సఖుడ ! రా ! యెన్నాళ్ళ కెన్నాళ్ళకీ
నన్నున్  లోనఁ దలంచినావు, కబు రందం జేసిరా నీకునున్
మిన్నున్ డిగ్గుము నీవు వచ్చితివి  నా మేధంబు సాఫల్య మం 
దు న్నీకున్ గబురంపుటన్ దగు సుమంత్రుండున్  సుమంత్రుండుగా.

నే నొక పక్షిమాత్రుఁడను నీ వఖిలేశుఁడ  విట్లు నన్నుఁ బ్రే
మానత బుద్ధిఁ గాంతువు ధరాధిప ! నీ వన నాదు మైత్రికిన్ 
గానను హద్దు నీవిటుల గౌరవమాడినయంతఁ బొంగి నా
లోనన నేను గ్రొమ్మనసులోఁ బులకించుచు నుంటి మిత్రమా

 ఈ మిషవెట్టి వచ్చితిని యెంతటి కెంతటి కెంత దూర మీ
భూమి నినున్ గనుంగొనఁగఁ బుత్రులు గల్గుదురయ్య నీకు
నే నా ముని కూనలన్ గనుదునా? కనుఁగొన్నను గుర్తుపట్టువా

రే ! మఱి నీ కుమారులని యించుక చంచువు వాల్చి నవ్వుచున్.

  తన పక్షాంచలమారుత
మున ఱేనికి వీవఁ, జాలుపో ! నీవా? నా
కును వీతు వంచు దశరథ 
మనుజేశ్వరుఁడతని వీచె మలువసనమునన్.

  ఉండుమని యెంతబలవంతమో పొనర్చె
రాజు మీ మానవులకు నా రాక యొకఁడె
వ్రేఁగు, నిలుచుట కాదని వెడలె నతఁడు
రాజునకును గన్నీళ్ళపర్యంతమయ్యె.


దశరథుడు, తాను తలపెట్టిన అశ్వమేధ యాగానికి ఋషులను, బంధువులను, మిత్రుల నందరినీ ఆహ్వానించాడుఅలావుండగా ఒకనాడు, భూమి మీద  పక్షిరాజు జాడను తెలిపే నీడను చూసి, ఆకాశంలోకి  తలయెత్తి చూసాడు దశరథుడుఅలా  చూసిన దశరథుడు మిత్రుణ్ణి ఇలా కుశలప్రశ్న లడిగాడు..

" ఎవరు ? నువ్వు జటాయువేగా ! రా ! రా ! ఎన్నాళ్ళకు నీకు గుర్తుకొచ్చాను. నీకు కూడా  కబురంద జేసారు కదా ! రా ! క్రిందికి దిగు. నువ్వొచ్చావు, నా యాగం సఫలమైనట్లేనీకు కబురుపెట్టిన సుమంత్రుడు నిజంగా సరియైన మంత్రి. " 

స్నేహితుడి ఆత్మీయతను చూసిన జటాయువు చలించిపోయి, దశరథునికి ఇలా సమాధానమిచ్చాడు.

" నేనొక మామూలు పక్షిజాతికి చెందినవాడిని. మరి, నీవో సమస్త భూమికి ప్రభువువినన్ను విధంగా ప్రేమతో గౌరవిస్తున్నావు. నీతో స్నేహానికి హద్దులు లేవు. నీవు చూపిన యీ గౌరవానికి, నేను లోపల లోపల మనస్సులో పొంగిపోతున్నాను మిత్రమా !

ఏదో నువ్వు యాగం చేస్తున్నావనే కారణం పెట్టుకొని వచ్చాను గాని, నీవుండే అయోధ్యానగర మేమన్నా దగ్గరా దాపాగుర్తుపట్టి రావటం మామూలు మాటలా?    అది సరే మిత్రమా ! నీకు తప్పకుండా పుత్రసంతానం కలుగుతుందిఏమో ! మళ్ళీ ఎప్పటి మాటో పసికూనలను చూడగలుగుతానంటావా? ఒకవేళ చూసినా, నీ కొడుకులు నన్ను గుర్తుపడతారా ఏమిటి? " అని ముక్కు కొంచెం క్రిందకు వాల్చి ముసి ముసి నవ్వులు నవ్వాడు జటాయువు. "

ఇలా మాట్లాడుతూ, జటాయువు తన రెక్కల చివరలతో దశరథునికి వీచటం మొదలుపెట్టాడు. స్నేహితుడిని మధ్యలో అడ్డుకొని దశరథుడు, " చాలు చాల్లేనువ్వా నాకు వీచేది? " అంటూ, తన ఉత్తరీయం కొంగుతో జటాయువుకు వీచసాగాడు.

విధంగా మిత్రులిరువరూ పరస్పరం స్నేహభావాన్ని పంచుకొన్న తరువాత, జటాయువు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఉండమని రాజు ఎంత బలవంతం చేసినా, మానవుల మధ్యలో ఉండటం మంచిది కాదని వెళ్ళిపోయాడు జటాయువురాజు కళ్ళనీళ్ళపర్యంత మయ్యాడు. "

దశరథుడు జటాయువు మధ్య జరిగిన సంభాషణ ఎంతో సహజంగా చిత్రించారు విశ్వనాథమూలానికి భిన్నంగా, జటాయువును యాగ సమయంలో ప్రవేశపెట్టటం వల్ల విశ్వనాథ ఒక ప్రయోజనాన్ని సాధించారుజాటాయువు దశరథునికి చిరకాల మిత్రునిగా చిత్రించటం వల్లదశరథునికి ఉత్తరకర్మలు నిర్వహించ లేకపోయిన రాముడు, పితృసమానుడైన జటాయువుకు ఉత్తరకర్మలు జరిపి ఉపశమనం పొందటానికి హేతువు ఏర్పడినట్లయింది.

మిత్రుల మధ్య ఆత్మీయతా భావాన్ని పెంపొందించే సన్నివేశం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనిది.












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like