Wednesday 17 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 538 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)











    లీనాంతర్వ్యధ మందుఁదిన్న పులివోలెన్ గైక లోలోన లో
లోనన్ గుడుసుళ్ళు పందుచు మనోలోభంబొ, ధాత్రీవచో
దానక్లేశమొ, తోఁచరానిది యెదో దైవత్యమౌ ప్రేరణ
గ్లానిన్ గన్నులు చింతనిప్పుగఁ దనూకంపంబు సంధిల్లగన్.

మా పనులెల్లనుం జెడుసుమా ! రఘునాయక ! యభ్ధిమేఖలా
వ్యాపృతబుద్ధివైన నని యాడిరఁటా సుర, లంతె  కావలెన్
గోపన నన్నుఁగాని కయికోఁడటె ఱేఁడటులైనఁగాని  యేలా
లా పతి జ్యోతిషాంపతి కులంబున మాటను వీటిఁబుచ్చెడున్

   ఓహో ! కైకయి ! నీ ప్రయోగము విధివ్యూహప్రభేదక్రియా
బాహాటంబగుఁబో సుధాంధసులునై పాలింత్రుపో నీ మతి
వ్యాహారంబులు, రామభద్రుని వనీపర్యంతముం జూచికా
నీ ! హా ! హా! పినతల్లి కైకయి మఱిన్ నిద్రించ దే నాటికిన్.

   రామాయణంలో కైకేయి పాత్ర విలక్షణమైనది. లోకంలో, రాముడిని అడవులకు పంపిన దానిగా అపకీర్తి తెచ్చుకొన్న స్త్రీఅయితే, కైకేయి రాముడిని వనవాసానికి పంపకుండా ఉంటే, సీతాపహరణం, తదనంతర, రావణ కుంభకర్ణాదుల వధ జరిగేవా? , రాముడు వేలయేండ్లు రాజ్యమేలితే, అవతార లక్ష్యం నెరవేరుతుందా? అన్న పలు నిగూఢమైన ప్రశ్నలకు వ్యాఖ్యానమే శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని కైకేయి పాత్ర చిత్రణం.

   రాముడిని అడవులకు పంపి, భరతుడిని రాజును చేయాలన్న మంథర ప్రతిపాదనను మొదట వినీ విన నట్లున్నది కైకతరువాత అర్ధతిరస్కృతి మందహాసం చేసింది. మంథర దీర్ఘోపన్యాసానికి ప్రతివాద శూన్య అయి నవ్వింది. చివరకు, మంథర ఉరి పోసుకొనటానికి ప్రయత్నించటంతో, తన మనస్సహజ దౌర్బల్యానికి వశురాలయింది. తనకు ఇష్టం లేని పని చేయిస్తున్నందుకు, కైక మనస్సులో కలిగిన వివిధ పరిణామ దశ లివి.

  మందు తిన్న పులి  లోపల చెప్పలేని  బాధ ననుభవిస్తున్నట్లు, కైక లోపల గుడుసుళ్ళు పడుతున్నదిదానికి కారణం భరతుడిని రాజును చేయాలన్న తన స్వార్థమో, దాది మంథర కిచ్చిన మాట వల్ల కలిగిన దుఃఖమో, ఇవన్నీ కాక దేవతల ప్రేరణ చేత కలిగిన దౌర్బల్యమో, ఏది ఏమైనా కానీ, కైక కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. శరీరం వణకటం మొదలుపెట్టింది.

  కొంచెంసేపు శిలాప్రతిమలా నిలబడి, ఒక్కసారి పెద్దగా, వికృతంగా నవ్వి, ఇలా అన్నది

" దేవతలందరూ వెళ్ళి , రాముడు కనుక రాజ్యాన్ని ఏలుతూ కూర్చుంటే, వాళ్ళ పనులన్నీ చెడిపోతాయని అన్నారటఅంతే కావాలి. ఇక, నేను కోపిస్తే గాని రాజు నా మాట వినడటసూర్యవంశంలో పుట్టిన నా భర్త, నాకిచ్చిన మాట తప్పుతాడా?

! కైకేయి ! రాముడిని వనవాసానికి పంపాలన్న నీ ప్రయోగం, చివరికి సృష్టికర్త బ్రహ్మ  వ్యూహాన్నికూడా తలకిందులు చేసిందినీ బుద్ధివిశేషాన్ని దేవతలు తప్పకుండా మెచ్చుకుంటారురాముడిని అడవులకు పంపించేటంతవరకు, పినతల్లి కైక నిద్రపోదు. "

విధంగా మనోవ్యాకులత చెందిన కైక, నగలన్నీ  తీసివేసి, కోపగృహంలో ఒక సన్నని దుప్పటి కప్పుకొని, మలిసంజలో పొదమాటున దాగిన ఆడపులిలాగా వేడి నిట్టూర్పులు విడవసాగింది.

రావణుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుండి దాదాపు చావు లేకుండా వరాలు పొందాడుకైక రాముడిని వనవాసానికి పంపటం ద్వారా, రావణవధకు, బీజం నాటినట్లై, విధి వ్యూహానికి, ప్రతివ్యూహం పన్ని నట్లయిందిఅందువల్ల, కైక చేసిన పని దేవతలు మెచ్చేటటువంటిదిలోకందృష్టిలో మాత్రం, కొడుకును రాజును చేయాలని సవతితల్లి పన్నిన ఎత్తుగడ.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like