Friday 19 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 543 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: ఇష్టి ఖండము)











ఒనర బోర్కాడించి యుయ్యెలతొట్టెలోఁ బండఁబెట్టిన పసిపాపవోలె
వీధులంబడి తిరిగి బూదియ మైఁజల్లుకొని పర్వులంబెట్టు కుఱ్ఱవోలె
నన్నమ్ముఁదించు మోమంతయుఁ  బెరుఁగన్నమును జేసికొన్నట్టి బొట్టివోలెఁ
జిట్టి ! తలంటిపోసెద నన్న నందక తొలఁగి పర్వులు వెట్టు నులిపివోలె

వెల్ల దుస్తులు కట్టించి వీధులన్ షి
కారు పంపిన రాజకుమారువోలె
మింట నడుచక్కి జాబిల్లి మేదినీశు
నేత్రములకును జలువఁ బండించి పోసె.

కావ్యాలలో, ముఖ్యంగా ప్రబంధాలలో, చంద్రోదయ వర్ణన ప్రసిద్ధంగా కనిపిస్తుందిఅయితే, శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథ, చంద్రుడిని వర్ణించే తీరులో, విశిష్టత కనబరిచారు.

పుత్రసంతానప్రాప్తి కోసం దశరథునికి అశ్వమేథ యాగం చేయాలన్న భావన కలిగినప్పటి నుండి, యాగ సన్నాహాలు ఎంత వరకు వచ్చినాయో, దాశరథుల జననం, వారు పెరిగి పెద్దవారవుతున్నంతవరకు, చంద్రుడు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు, వివిధ దశలలో అద్భుతమైన వర్ణన చేశారు విశ్వనాథ

ప్రస్తుతాంశానికి వస్తే, శాంత ఋష్యశృంగుల వివాహం జరిగిందివారికి పుత్రసంతానం కూడా కలిగిందిఋష్యశృంగుని అధ్వర్యంలో అశ్వమేథ యాగం జరిగి, తేజోవంతులైన నలుగురు కుమారులు దశరథునికి కలుగుతారన్న విషయాన్ని దేవయుగంలో సనత్కుమారుడు ఋషులకు చెబుతుండగా తాను విన్నాననిఋష్యశృంగుని కథను చెప్పి, యాగం చేయడానికి ముందే ఋష్యశృంగుడిని అయోధ్యకు తీసుకు రావాలని, సుమంత్రుడు దశరథునికి చెప్పాడు సందర్భంలో విశ్వనాథ చేసిన చంద్రవర్ణన  సీసపద్యం భావందశరథుడు ఆకాశం వంక చూసినప్పుడు చంద్రుడు ఇలా కనిపించాడు.

" చక్కగా స్నానం చేయించి, ఉయ్యాలతొట్టెలో పడుకోబెట్టిన పసిపాపలాగా, వీధులలో పడి ఆడుకొంటూ వంటికి బూడిద వంటి తెల్లని మట్టి పూసుకొని పరుగెత్తే పిల్లవాడిలాగాఅమ్మ అన్నం తినిపిస్తుంటే, పెరుగన్నం మొహానికి పూసుకొన్న కొడుకు లాగా, " చిట్టితండ్రీ ! తలంటి పోస్తా రామ్మా ! " అంటే అందకుండా పారిపోయే అల్లరిపిల్లవాడిలాగా, తెల్లని దుస్తులు తొడిగించి, రాచవీధుల్లో షికారుకు పంపించిన రాజకుమారుడిలాగా, ఆకాశంలోని  చంద్రుడు దశరథుడి కళ్ళకు చల్లదనాన్ని కురిపించాడు. " 

" మదికి నుదాత్త కల్పనల మక్కువ గల్గిన, విశ్వనాథ శారద బహుళార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ ! "  అన్న ఋషివాక్కు అక్షరసత్యం.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like