Monday 1 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 481 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)















జటలున్ వల్కలముల్ పృషత్కములునుం జాపంబు లీ సంధిదు
ర్ఘటవేషంబుల నేరి మోసపఱుపంగాఁ గూర్చు టష్టాపద
చ్ఛట దేహామలకాంతి  రత్నమయభూషాహేమచీరాదు లొ
ప్పుట నంతఃపురయోగ్య నాగరకురా ల్పూబోఁడి తానీమెయున్.

 ఏ యంతఃపుర మీరు కొల్లయిడి యిష్టేచ్ఛామహాభోగలీ
లాయత్తం బువుబోఁడి దొంగిలితి రేలా వచ్చుటో రాక రాకీ
యుర్వీస్థలి యొక్కడే దొరకెనా? యెచ్చో విరాధుండు మౌ
న్యాయుర్దక్షిణ దిఙ్మహేశ్వరుడు సంహారాభూతుం డుండెనో.

నా మూఁపుంబడి యిన్పయీటె యిదికన్నారే మిముం గ్రుచ్చఁగా
నేమూలౌ మఱి యేదొ త్రోవఁ జనకిట్లే రాకయున్ మేలె, తా
నీ మందాక్షదృశాంత కావలయు నా కిల్లాలుగా, మీరనన్ 
మీ మాసంబు భుజిక్రియాంత రసనా మృష్టంబగున్ నంజుకో.

నడుమన్ దపస్విజన మెవ్వరు రారిట పూఁటపూఁట బ్రా
చీనము నేన్గుపచ్చియెఱచిన్ దినఁజాలక మొత్తిపోయె నో
హో నరమాంసఖాది పులియున్ రుచి, యచ్చమనుష్యమాంస మెం
తైన రుచో వచింపనగునా ! మఱి స్నానము చేసి రండిఁకన్.


సీతారాముల మధ్య వచ్చిన చిన్న మాట పట్టింపు వల్ల, వారిద్దరూ ఎడమొగం, పెడమొగంగా, దూర దూరంగా నడిచి వెళ్తున్నారు. ఇంతలో, విరాధుడనే రాక్షసుడు సీతను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. విముఖుడై వెళ్తున్న రాముడువిరాధుని వికటాట్టహాసం విని వెనక్కి తిరిగి చూసాడు. భయంకరమైన ఆకారం గల ఒక రాక్షసుడు సీతను హఠాత్తుగా పట్టుకొన్నాడన్నది రామలక్ష్మణులను నిశ్చేష్టులను చేసింది హఠాత్పరిణామం నుంచి తేరుకొని, రాముడు రాక్షసుడిని మాటలలోకి దించి, వాడెవరని అడిగాడు. దానికి వాడు వికవికా నవ్వివిరాధుని  పేరే వినలేదా అని గద్దించి, వారితో ఇలా అన్నాడు.

" జీబురుగా ఉన్న మీ జడలు, కట్టుకున్న నారచీరలు, బుజాలకు వ్రేలాడుతున్న ,
ధనుర్బాణాలు - అటు బ్రాహ్మణులా లేక క్షత్రియులా అని పోల్చుకోవటం కష్టమయ్యే  వేషమంతా ఎవరిని మోసం చేయటానికి? మీరేమో మేలిమి బంగారం రంగులో  మెరిసిపోతున్నారు, ఇక ఈమెను చూస్తే రత్నమయమైన సువర్ణాభరణాలు పెట్టుకొని, అంతఃపురంలో ఉండే నాగరికురాలులాగా కనపడుతున్నది అంతఃపురం కొల్లగొట్టి హాయిగా భోగాలనుభవించటానికి యీ సుకుమారిని దొంగతనంగా ఎత్తుకొచ్చారువచ్చారు సరే ! ప్రాంతంలోనైతే  మునుల ప్రాణాలను యీ విరాధుడు, దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యముడి లాగా హరిస్తూ ఉన్నాడో, ప్రాంతమే మీకు కావలసివచ్చిందా? నా వీపున వ్రేలాడుతున్న యీ ఇనుప ఈటెను చూడండి. దానికి  గుచ్చితే, మీరు దాని ఒక మూలకు కూడా రారు. ఏదో ఇంకొక దారిలో పోకుండా, ఇట్లా రావటం మీకు హానికరం కదాఅది సరే సిగ్గులమొగ్గ నాకు ఇల్లాలు కావాలి. ఇక మీ సంగతంటారామీ మాంసం, భోజనం చివరలో నంజుకోవటానికి బలే బాగుంటుందిఏమిటో ! నాకు భయపడి మునులెవ్వరూ మధ్య ఇటువైపు రావటం లేదుప్రతిరోజు ఏనుగు పచ్చిమాంసం తిని మొహం మొత్తిందిఅబ్బ ! నరమాoసం  తినేటటువంటి పులి యొక్క మాంసం బాగా రుచిగా ఉంటుందిఇక అచ్చంగా నరమాంసం సంగతి వేరే చెప్పాలా? ఇక మాత్రం ఆలస్యం చేయకుండా స్నానం చేసి రండి. "

విరాధుని మాటల్లో రెండు జీవలక్షణాలు కనిపిస్తాయిఅతడు శాపగ్రస్తుడైన గంధర్వుడు. అందువల్ల, గంధర్వుని జీవలక్షణం అంతర్నిహితమై ఉండగా, బాహ్యంగా పైశాచిక జీవలక్షణం కనపడుతుందిఅతనిలో దాగి ఉన్న గంధర్వ లక్షణం, అతని చేత  " అష్టాపదచ్ఛటదేహామలకాంతి, రత్నమయభూషాహేమచీరాదు లొప్పుట నంతఃపురయోగ్య నాగరికురా ల్పూబోడి తా నీమెయున్. " అన్న మాటలను చాలా సంస్కారవంతంగా పలికించాయి. అయితే, అతడు శాపావసానం కోసం ఎదురుచూస్తున్న వాడే కాక, రాక్షసుని దేహాన్ని దాల్చినవాడుదేహధర్మంగా, రాక్షస ప్రవృత్తి అతనికి సహజంకాబట్టి దేహసంబంధమైన మాటలు కూడా  అతని నుండి వినిపిస్తాయి. రెంటినీ సమన్వయం చేస్తూ, విరాధుని పాత్రను తీర్చిదిద్దటమే విశ్వనాథ గాఢప్రతిభకు నిదర్శనంవిరాధుని జీవసంపుటిలో గత  జన్మ యొక్క ఆత్మను మాత్రమే ప్రతిబింబింప జేస్తే, అది అసహజమై, ప్రస్తుత రాక్షస ప్రవృత్తికి విరుద్ధంగా ఉంటుంది. ఒక్క రాక్షసప్రవృత్తిని మాత్రం చిత్రిస్తే, అది విరాధుని శాపావసానానికి ప్రతిబంధకమౌతుందివిరాధుని పాత్రచిత్రణలో ప్రస్తుత రాక్షస ప్రవృత్తి అనుభవనీయమౌతూనే, గతజన్మ స్పృహనీయం కావాలి.  

అదే మహాకవి విశ్వనాథ చేసింది.

రామాయణ కల్పవృక్షగత విరాధుని పాత్రను అర్థం చేసుకొనటంలో కీర్తిశేషులు కేతవరపు రామకోటిశాస్త్రిగారి " విశ్వనాథ వైఖరి " అనే విమర్శన గ్రంథంలోని వారి " విరాధ వధ " వ్యాసం ఎంతో ఉపకరించింది. భావాలన్నీ వారివే, వట్టి భాష మాత్రమే నాది.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.


పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like