Saturday 6 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 493 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: ఇష్టి ఖండము)















 తండ్రికన్నను ముందుఁ దానె మేల్కని యగ్నిహోత్రమ్ము సరిచూచి యుముకఁబెట్టుఁ
దండ్రికన్నను సముద్యద్ఘోష మేపార నర్థర్చలును ఋక్కులనువదించుఁ
దండ్రికన్నను సమాహిత శ్రద్ధమై యుషర్బుధున కర్చాహవిర్బుధ్నము లిడుఁ
దండ్రికన్నను నిశ్చితజ్ఞానదృఢబుద్ధి బితృసమర్చాధురాప్రీతిఁ గాంచు

నతఁడు పుంరూప బ్రహ్మచర్యంబు శ్రద్ధ
ప్రోవు నెల్ల ప్రాయశ్చిత్తరూపమతఁడు
వాని నాషాఢమేఘమువోని వాని
నిటకు దెచ్చితివే ననావృష్టి తొలఁగు


శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టి ఖండములో ఋష్యశృంగుని కథ, విశ్వనాథ కథాకథన చాతుర్యానికి ఒక మంచి ఉదాహరణ.

దుర్భిక్షం పాలయిన అంగదేశాన్ని మరల సస్యశ్యామలం చేయగలిగినవాడు ఒక్క ఋష్యశృంగుడేనని రోమపాదుని మంత్రులు, పురోహితులు చెప్పారు.

సీసపద్యంలో, ఋష్యశృంగుని యొక్క నిత్యానుష్ఠాన, అగ్నిహోత్ర విధులను అతడు యెంత శ్రద్ధతో నిర్వర్తిస్తున్నాడో, విశ్వనాథ చక్కగా చిత్రించారు.

ఋష్యశృంగుడిని స్త్రీపురుష భేదం తెలియకుండా పెంచాడు తండ్రి విభాండకుడుబ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, అహ్నిహోత్ర విధులను నిర్వహించడమే అతని పని

" తండ్రి కంటె ముందే నిద్రలేచిఅగ్నిహోత్రం నిరంతరాయంగా వెలగటానికి, సమిధలు మొదలైనవి సమకూరుస్తాడుతండ్రి కంటె చక్కగా, మంచి స్వరంతో స్తోత్రాలు, ఋక్కులు చదువుతాడుతండ్రి కంటె ఎంతో శ్రద్ధగా అగ్నిహోత్రునికి అర్చనావిధులను, హవిస్సును అందజేస్తాడుతండ్రి కంటె నిశ్చితమైన జ్ఞానంతో, దృఢబుద్ధితో, తండ్రికి ప్రీతి కలిగించే రీతిలో అర్చనలు చేస్తాడుఋష్యశృంగుడు పురుషరూపంలో ఉన్న బ్రహ్మచర్య దీక్ష, శ్రద్ధ, సర్వ ప్రాయశ్చిత్తాలకు మార్గంఆషాఢమేఘం వంటి అతడిని ఇక్కడకు తీసుకువస్తే, అనావృష్టి తొలిగిపోయి, మళ్ళీ దేశం సుభిక్షమౌతుంది. "

ఋష్యశృంగుడు ఆషాఢమేఘం వంటివాడుఆషాఢమాసంలో మేఘాలు సమృద్ధిగా వర్షిస్తాయిఋష్యశృంగుడు ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది.

ఇక పద్యంలో " తండ్రి కంటెను " అన్న మాటలు పునరావృతం అవటం వల్ల, ఋష్యశృంగుని నిత్యానుష్ఠానము, అగ్నిహోత్ర విధి, అర్చన, అధ్యయనాలు, మరింత నిష్ఠగా, శ్రద్దగా, తండ్రికి ప్రీతి కలిగించే విధంగా కొనసాగుతున్నాయని తెల్లమౌతున్నది.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like