Monday 8 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 499 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అవతారిక)











ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్
సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేక మబ్బినన్
మదికి నుదాత్త కల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శా
రద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ !

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి బృహత్కావ్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము అవతారిక లోని పద్యం చాల ప్రసిద్ధమైనది

విశ్వనాథవారి రచనలు అంత తొందరగా కొరుకుడు పడవనో, ఆయన ప్రతిభ చూసి కించిత్ అసూయతోనో, లేక వారి మీద ప్రేమ పొంగులువారి ముద్దుగానో, " అక్షరానేక బ్రహ్మాండసృష్టికర్తను " పాషాణపాక ప్రభు " వని పిలుస్తారు.

మహాకవుల రచనలు మహాగిరి శిఖరాలనుండి ఉద్ధృతితో ప్రవహించే జీవనదుల వంటివివాటిని అర్థం చేసుకోవాలంటే, పాండిత్యం కంటే, పాఠకుని జీవలక్షణంలో వాటిని గురించి తపన, పూర్వజన్మ సంస్కారం  ఉండాలని నాకనిపిస్తుంది

విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్య రసాస్వాదన చేయాలంటే, సహృదయుడైన పాఠకునికి కావలసిన  కొన్ని లక్షణాలను పద్యంలో ఉదహరించారు.

" నీ హృదయానికి  పూర్వాంధ్ర సంస్కృత మహాకవుల కావ్యాల ప్రకాశం కలిగితే, నీ నిర్మలమైన బుద్ధికి అనేకమైన శాస్త్రరహస్యాలు తెలుసుకోవాలనే వివేకం కలిగితే, నీ మనస్సుకు ఉదాత్తమైన కల్పనల మీద ఆసక్తి కలిగితే, అప్పుడు, వివిధార్థాలను ప్రతిపాదించే, చతుర్విధ పురుషార్థాలను కల్గించే, స్వర్గలోకపు కల్పవృక్షం వంటి విశ్వనాథకృత శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని భక్తితో దరిచేరు. "

శ్రీమద్రామాయణ కల్పవృక్షము విశ్వనాథ తపఃఫలము కావ్యాన్ని చదవాలంటే, చదివి అర్థం చేసుకోవాలాంటే, పఠితల జీవసంపుటిలో పైన చెప్పిన అర్హత లుండాలి. కావ్యం చదవాలని తపించాలిఅన్నిటికి తోడు గుర్వనుగ్రహం ఉండాలివిశ్వనాథ గురువులకు గురువు. ఇది స్వీయానుభవం.












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like