Sunday 14 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 527 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)





వీఁడొక రాక్షసుం డితనిపేరును దుందుభి దుందుభిస్వన
క్ష్వేడుఁడు వేయియేనుగుల చేవగలాఁడు జగద్భయంకర
క్రీడుఁడు దిఖ్ఖురాంచల వికీర్ణ వియద్గత మృత్పయోధర 
క్రోడవిలాస విష్ణుపద కుత్సిత కాలకభావుఁ డుగ్రుఁడై.

బలమని యున్నచోనొడల వాఁడునుగాని స్వభావదుష్టుఁడై
వెలసిన వాని నొంచెదను వీని గలంచెదనంచుఁ గారణం 
బులకయి సర్వదా వెదకుఁ బొందని గారణముల్ ఘటించు గొం
దలపడు నవ్యవస్థితమనస్కుఁడు వానికి సౌఖ్యమున్నదే.

" మొండివాడు రాజుకన్నా బలవంతు " డని సామెత రూపంలో చెప్పినా, " కోరి మూర్ఖుల మనసు రంజింపరాదు " అని పద్య పాదంగా చెప్పినా, అది దుందుభి వంటి దున్నపోతుల గురించే

శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో చాలా చిన్న కథ లున్నాయి. దేని కదే ఒక రసరమ్య కావ్యంఅందులో కిష్కింధా కాండము లోని దుందుభి కథ ఒకటి.

విశ్వనాథ కథలు చెప్పే తీరులో ఒక విశిష్టత ఉందిచెప్పబోయే కథకు పూర్వరంగంగా ఒక హేతువును కల్పించటం అదిఋష్యమూకగిరికాననలక్ష్మి శరీరం మీద పురిపిడికాయ లాగా ఉన్న అస్థిపంజరాన్ని చూపించి, సుగ్రీవుని చేత దుందుభి కథను చెప్పించటానికి పుర్వరంగాన్ని సిద్ధం చేశారు విశ్వనాథ. అంతేగాక, కథ ఎత్తుకోవటమే " వీడొక రాక్షసుండు " అని చెప్పి, అతడి దుష్టస్వభావ వర్ణనకు నాంది పలికారుఇప్పుడు, విశ్వనాథ దుందుభిని వర్ణించిన తీరును చూద్దాము.

" దుందుభి అనే పేరు కల రాక్షసుడు వీడువీడి గొంతు భేరీనాదంలాగా ఉంటుంది. వీడు వేయి ఏనుగుల బలం కలవాడు. ప్రపంచాన్ని భయపెట్టడం వీడికి ఒక ఆటవీడు కాలిగిట్టలతో ఆకాశంలోని మేఘాలను, మట్టిని ఎగజిమ్మినట్లు వెదజల్లుతూ, కొమ్ములతో కుమ్ముతూ, విష్ణువును నిందిస్తూ, కోపంతో కాలయముడిలాగా నాలుగు దిక్కులా సంచరిస్తుంటాడు

ఎవడైనా బలవంతుడై, దానికి తోడు దుష్టస్వభావం కనుక ఉంటే, అటువంటివాడు, " వాడిని ఓడిస్తాను, వీడిని క్రుంగదీస్తానుఅంటూ, లేనిపోని కారణాల కోసం వెతుకుతుంటాడులేని కారణాలని సృష్టించుకుంటాడుబాగా కలత చెందుతాడు. అటువంటి, పద్ధతి లేని మూర్ఖుడికి  సుఖ మేముంటుంది. " 

దుందుభి ఒక దున్నపోతు ఆకారం కల రాక్షసుడు. వాడి ఆకారమే కాదు, స్వభావం కూడా దున్నపోతు స్వభావమే. ఎవరిమీద పడితే వాళ్ళమీద కాలు దువ్వటంతనంతటివాడు విశ్వంలో లేడని విర్రవీగడం వాడి సహజప్రవృత్తిమిడిసిపడేవాడు ఎప్పటికైనా మడిసిపోక తప్పదు కదాదుందుభి వథకు మూలకారణమైన మితిమీరిన మూర్ఖత్వాన్ని విశ్వనాథ పద్యాలలో అద్భుతంగా చిత్రించారు







No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like