Saturday 6 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 492 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అవతారిక)















అచ్చమైన యమృత మమరులు త్రావినా
రోయి ! దాని కే నసూయపడను
పరమమౌనియైన వాల్మీకికృత రామ
సత్కథా సుధారసంబుఁ ద్రావి 

సర్వకావ్యవాక్కు జనియించె నే ముని
వదన సీమనుండి వానిఁ దలఁతు
సర్వశిల్పభూమి సర్వలక్షణలక్ష్య
నవ విధాతృభూతు నాకుజాతు

సంసార మిదెన్ని జన్మలకు నేనీ మౌనివాల్మీకి భా
షాసంక్రాంతఋణంబుఁ దీర్పఁగలదాసత్కావ్యనిర్మాణ రే
ఖాసామాగ్రి ఋణంబుఁ దీర్పఁగలదా? కాకుత్స్థుఁడౌ స్వామి గా
థాసంపన్నము భక్తిఁ దీర్చినను ద్వైతాద్వైతమార్గంబులన్.

 ఒక్క వాల్మీకి కాక వేఱొక్కఁ డెవఁడు 
సుకవిశబ్దవాచ్యుం డిఁకఁ గుకవినింద
అప్రశస్తపథంబుగా నవుటఁ జేసి
మునిఋణముఁ దీర్ప నీ కావ్యమును రచింతు


అచ్చమైన అమృతం దేవతలు త్రాగారు. దానికి  తెలుగువారెవరూ అసూయపడరుకారణం, రామాయణ కల్పవృక్షాన్ని విశ్వనాథ తెలుగు జాతికి ప్రసాదించారు కనుకకల్పవృక్షంలోని ప్రతి పద్యం రసరమ్యం కాగా, అందులోని అవతారిక చాలా అందమైనది, ఆలోచనామృతాన్ని కురిపించేది.  

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలోని పద్యాలను ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. " శ్రీ మంజూషిక " అయిన పరమేశ్వరుని స్తుతితో ప్రారంభమైన అవతారిక " బంధుర రీతి వేరయిన భావములున్  బ్రతుకుల్ మహాదయాసింధువు " లయినవారితో  ముగుస్తుంది అవతారికలో ఇష్టదేవతాప్రార్థన దగ్గరినుంచి, మరల రామాయణం వ్రాయవలసిన అవసరం, రామాయణం వ్రాసేందుకు ప్రేరణ, పితృభక్తి, భాతృప్రేమ, గురుప్రశస్తి, మిత్రవాత్సల్యం, ప్రాచీనాంధ్ర మహాకవుల కవితా రీతులు, స్వీయకవిత్వ ధోరణి, సంస్కృతకవులకు నివాళి, కవిత్త్వతత్త్వవిచారణ, చివరగా మానవ సంబంధాల స్పర్శతో.....ఎన్ని.....ఎన్నెన్ని అంశాలు స్పృశించారు. ప్రతిదీ, హృదయానికి హత్తుకొనేటట్లు, ప్రమాణపూర్వకంగా, మనస్సన్యాసిగా, అద్దంలో చూపించినట్లు వ్రాశారు.

ప్రస్తుత విషయం, వాల్మీకి మహర్షి స్తుతి. ఆదికవి వాల్మీకి మహర్షికి ఇంత సుగంధభరితమైన నీరాజన మెవరివ్వగలరువిశ్వనాథ అంటున్నారు:

" అచ్చమైన అమృతాన్ని దేవతలు త్రాగారు. దానికి నేను అసూయపడను. ఎందువల్లనంటే, మహర్షి వాల్మీకిచే రచింపబడిన రామాయణసుధను తనివితీరా త్రాగాను కనుకసమస్త కవితా ప్రపంచం ముని ముఖం నుండి వెలువడిందో , అన్ని శిల్పరహస్యాలు, అన్ని లక్షణలక్ష్యాలకు ఎవరు  ఆద్యుడో, కవితాబ్రహ్మకు, పుట్టమునికి నేను నమస్కరిస్తున్నాను.  

కాకుత్స్థ వంశస్థుడైన రామచంద్రుని కథను భక్తితో, ద్వైత, అద్వైత మార్గాల్లో ఎన్నివిధాలుగా, ఎందరు తీర్చిదిద్దినావాల్మీకి మహర్షి దేవభాష అయిన సంస్కృతానికి వన్నె తీసుకు వచ్చినందుకు భాషాఋణాన్ని , సత్కావ్య నిర్మాణానికి కావలసిన సాధనసామాగ్రిని  సమకూర్చిపెట్టిన  ఋణాన్ని, కావ్యప్రపంచం తీర్చుకోగలదా

సుకవి శబ్దానికి  ఒక్క వాల్మీకి మహర్షి మాత్రమే అర్హుడు కనుకకుకవి నిందకు ఇక్కడ తావులేదుఇక నేను, మునిఋణం తీర్చుకొనేందుకు రామాయణాన్ని వ్రాస్తున్నాను. "

అన్ని భాషలకు తల్లి సంస్కృతం. అటువంటి సంస్కృతభాషలో ఆదికావ్యం రామాయణంఆదికవి వాల్మీకి. అందువల్లనే, మహానుభవుని ఋణం తీర్చుకోలేనిదికుకవి నింద చేయటం అనేది కావ్యరచనలో సంప్రదాయం కుకవి నిందను, ఇంత వినయపూర్వకంగా చేసి, మునిఋణం తీర్చటానికి తాను రామాయణాన్ని వ్రాస్తున్నాననడం, గాఢప్రతిభుడైన విశ్వనాథకే చెల్లింది.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like