Thursday 18 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 541 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)






నా యీ పర్వతమంత మేను గని నానాదైత్యులున్ వీఁ డెవ,
డో యంచచ్చెరువంది చూచెదరు తీవ్రోద్యోగ నైష్ఫల్యమై 
నా యణ్వేషణ  సాగదం చపఘనాంతత్వమున్  సంవృతిం
గా  యాదృచ్చిక మల్పరూపమునఁ బోఁగాఁజొచ్చె నామేరకున్.

బురుజుల నిల్చి నిచ్చలును బోయెడు వచ్చెడు శత్రుచారమున్ 
గరికొని చూఁడగాఁదగిన కౌణపరాజభటుల్ ప్రమత్తులై
గరువముచేత వార్థిపయిఁగాంచరు మారుతి వచ్చుటే యెఱుం
గరు పరిగుప్తయాత్రుఁడు ప్రకంపనసూనుఁడు చేరునంతకున్.

కొంచెము సేపు వానరము, కొంచెము సేపు మృగేంద్రమున్, మఱిం
గొంచెము సేపు గృధమును క్రోడము  కొంచెము సేపు  చూడగా 
గొంచెముకాల  మశ్వమును గుజ్జగు రూపము లంది యేగుచున్ 
వంచనచేసెఁ జూపఱను బావని పావనమూర్తి ధృష్ణుడై.

హనుమలంకాపట్టణ సమీప ప్రాంతానికి వచ్చాడుకనుచూపు మేరలో ఉన్న పుష్పఫల సంభరితమైన అడవులను చూసి సంతృప్తి చెందాడు. ఆక్కడనుండి, తాను వచ్చిన పని గుర్తుకువచ్చి ఇలా అనుకొన్నాడు.

" పర్వతాకారంలో ఉన్న నా శరీరాన్ని చూసి వీడెవడో అని రాక్షసులందరూ నా వంక ఆశ్చర్యంగా చూస్తారుదానితో నా పనికి  తీవ్రమైన ఆటకం కలిగి అన్వేషణ సాగదు. " అనుకొని, హనుమ తన శరీరాన్ని ఇష్టమొచ్చిన రీతిలో కుదించుకొని ముందుకు  పోసాగాడు.

కోట బురుజుల మీద నిల్చొని కాపలా కాస్తున్న ఆయుధధారులైన రాజభటులు, ఏమరపాటుతో, గర్వంతో, ఉండటం వల్ల, వారికి వాయునందనుడు అల్పదేహంతో సముద్రము పైనుండి వచ్చి త్రికూటగిరిని చేరేంతవరకు, సంగతి తెలియనే తెలియదు.

ఇక హనుమ కూడా, వారికి అనుమానం కలుగకుండా, కొంచెంసేపు వానరరూపంలో, కొంచెంసేపు సింహంగా, మరింకొంచెం సేపు పక్షిలాగా, కాసేపు వరాహంగా, చూస్తుండగానే అశ్వరూపంలో, అల్పరూపాలు ధరిస్తూ, చూసేవారి కన్నుగప్పుతూపావనమూర్తి వాయుపుత్రుడు ధైర్యంగా ముందుకు పోసాగాడు. "

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోని యీ పద్యాలలో హనుమ యొక్క బుద్ధిసూక్ష్మత మరొకసారి ఋజువయిందికార్యసాఫల్యాన్ని కోరేవాడు పరిసరాలను జాగ్రత్తగా చూసుకొంటాడు. తన ఉగ్రరూపంతో వెళ్తే, అసలు పనికి మోసం వస్తుందని గ్రహించిన హనుమ, తన ఇచ్చవచ్చిన రీతిలో రూపాలను మార్చుకొంటూ, అల్పదేహంతో త్రికూటగిరి సమీప అరణ్యప్రాంతంలో జంతు, పక్షి రూపంలో  సంచరింపసాగాడు.

చివరి పద్యంలో పంచముఖాంజనేయ స్వరూప దర్శనం గమనార్హం.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like