Monday 15 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 533 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)











దారికి దారి చూపితివి, తల్లిగ నెంచితి భూమిజాత, నిన్
మారణ మాచరించెదను మామకమై చను క్షత్రియత్వ మే
దారిదియో కటా! సహజతం గనె దంచునుగాక నీ గళాం
భోరుహ మిట్లు త్రొక్కుటయుఁ బుట్టునె నాకు దయాదిలోకముల్.

ఓయీ ! సీతఁ ద్యజింపడాయసుర, యేదో దివ్యబాణంబుచే
మాయంజేసి ధరాత్మజాతఁ గొనలేమా ! వాని మ్రందించు టే
లా ! యీ చంపుటయో కసాయిపని మేలన్నట్లుగా నున్న
య్యో ! యా కత్తులఁ గ్రుమ్ము పేషణము  ప్రాణోత్క్రాంతి దుర్భాష్యమౌ.

ఊహకు నందదే, బ్రదికియుండినవానిని బూడ్చి పెట్టినా
 మే ! హరి ! వానినేమొ వధియించినయట్లగునా యిఁకొక్క
న్నాహముచేతఁ దద్వధమనన్ ఘటియిల్లదు, చంపవద్దునా
నో హరిసాహరిన్ దినుచునుండె ఋషీంద్రుల దైత్యుఁడాతడై.

తనపూర్వంబగు జన్మలో గలుగు వృత్తాంతంబు తానే యెఱుం
గును, దుష్టాచరణంబు నేపగిదిఁ గైకొన్నాఁడు నన్ గాంచినం
తన పూర్వస్మృతి కల్గెనా ! వెదకుచుం దా వచ్చెనన్నాఁడుగా
ననుఁ బైశాచిక దేహమే బలమొ గంధర్వత్వ భావానకున్.

తనను గోతిలో పూడ్చిపెట్టి శాపవిముక్తి కలిగించమని రాముడిని విరాధుడు వేడుకొన్నాడుఅప్పుడు శ్రీరామచంద్రుడు విరాధుని గొంతు మీద కాలుపెట్టి, ఇలా అన్నాడు.

" ఓయీ ! శరభంగముని ఆశ్రమానికి వెళ్ళే దారి చూపించావుసీతను తల్లిగా భావించావుఅటువంటి నిన్ను చంపుతున్నాను. ఇక నా  క్షత్రియత్వం దారిలో పోతున్నదోనీ సహజమైన రూపం నీకు ప్రసాదించటానికి నీ గొంతు మీద కాలు వేసి తొక్కితే నాకు పుణ్యలోకాలు దక్కుతాయా? " 

ఇట్లా అని, అన్నదమ్ము లిద్దరూ విరాధుడిని కత్తులతో క్రుమ్మి, గోతిలో పూడ్చి పెట్టి, రాళ్ళతో కప్పిపెట్టారు. విరాధుడు చెప్పినట్లుగా శరభంగాశ్రమం వైపు నడచి కొంతదూరం వెళ్ళిన తరువాత, రాముడు తమ్ముడి వైపు తిరిగి, కలత చెందిన మనస్సుతో, ఇలా అన్నాడు.

" లక్ష్మణా ! విరాధుడు సీతను వదిలిపెట్టలేదుఅయితే, ఏదో ఒక దివ్యబాణంతో, వాడిని మాయజేసి సీతను దక్కించుకొనలేమాఅతడిని యీ రకంగా చంపట మెందుకు చంపటం కూడా కసాయిపని మేలన్నట్లుగా ఉంది. అయ్యో ! కత్తులతో క్రుమ్మి, సజీవుడిని పూడ్చిపెట్టడం, ప్రాణోత్క్రమణానికి దుర్భాష్యం చెప్పినట్లవుతున్నదే !

ఊహకు అందనంతఘోరంగా, బ్రతికి ఉన్నవాడిని పూడ్చిపెట్టామే ! దీనిని వధించటం  అంటారా? కానీ, ఇంకొక విధంగా అతడిని చంపటం కుదరదు. పోనీ, చంపకుండా వదలిపెడదామంటే, రాక్షసుడిగా అతడు మునులను చంపి తింటున్నాడు కదా

విరాధుడికి తన పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసు. అంతా తెలిసి, దుర్మార్గపు పనులు ఎలా చేస్తున్నాడునన్ను చూడగానే, పూర్వజన్మ స్మృతి వచ్చిందా? నన్ను వెతుక్కొంటూ వచ్చానన్నాడుగా? గంధర్వ భావానికి, పిశాచదేహమే బలమా? "

శ్రీమద్రామాయణ కల్పవృక్షములో పలుతావుల్లో శ్రీరాముడు నిర్వేదాన్ని పొందటం గమనార్హంతాటక వధ తరువాత కూడా, రాముడు ఇదే విధమైన నిర్వేదానికి గురయ్యాడు. రామావతార విశిష్టత అదేమానవుడిగా జన్మించిన రాముడు, క్షత్రియధర్మంగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ, వారందరూ తెలిసి తెలిసి హింసకు పాల్పడుతూ, తనచేతిలో వధింపబడితున్నారని, మానవీయ కోణంలో నిర్వేదం పొందటం, మానవప్రవృత్తికి చాలా దగ్గరగా ఉంది..













No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like