Sunday 21 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము: 546 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)











నీవేమొ మహాబలుండవట భూమ్యాకాశముల్  పట్టవం
టా నీరాకరమున్ హిమాద్రియును నిన్నాడంగ  నిన్ దీవ్రశృం
గానన్ దూయఁగ నూహచేసితిని నాకంటెన్  బలాఢ్యుండటం
చీ నేలం  గలఁడొక్కరుండనేదు  పల్కే నోర్వఁజుమ్మీ ! కపీ !

హిమశైలంబఁట తాను కాదఁట సరేలే ! యంచు నేనేగ
నా హిమశైలానికిఁ జీమునెత్తురులు లేవేమందు నిల్వేల్ల
క్తము లేనట్లుగఁ బాలిపోయె నిఁక నాకా ! వీనితోనా ! రుజా
శ్రమ తీర్పంగను శాంతులున్ వ్రతములున్ సంతర్పణల్ తీర్పఁగా.

మూలనున్న యట్టి ముసలమ్మఁ గొట్టెను
సాగి యాఱునెలలు సాముచేసి
యన్న యట్లుగాఁగననుకొంచు నుండంగ
నతఁడు నిన్ను జెప్పెనంతనంత.

హిమవంతుడు భయాన్ని నటిస్తూ, దుందుభిని వాలి మీదికి ఉసిగొల్పాడు. వాడు మూర్ఖుడు కదా, సరాసరి కిష్కింధాపురిలో, వాలి దగ్గర వాలాడు. రోజు పున్నమి రాత్రి. వీడు అమావాస్య దాడిచేసినట్లు, కిష్కింధపురి కోటద్వారాన్ని కొమ్ములతో తాడించాడు. మహాధ్వనికి, తార అందిస్తున్న మధుపాత్ర జారి కాళ్ళపై ఒలికిందిదానితో, వాలికి కొత్త వేడి తలకెక్కిందివాలి ఒక్క ఉదుటున దుర్గద్వారానికి లంఘించి, అడ్డంగా ఉన్న రాయిని తొలిగించి, ఎవడురా అంటూ, పెద్దగా కేకపెట్టాడు. ఎదురుగా ఆవులించిన దక్షిణ దిక్కులాగా, అగ్నిశిఖల వంటి జుట్టుతో, నల్లని దున్నపోతు ఆకారంలో ఉన్నాడు దుందుభివంద కాగడాల వెలుతురులో, అంతటి తెల్లని వెన్నెలా ఎఱ్ఱగా మారిందిఅలా వికృత భయంకరాకారుడై నిలుచున్న దుందుభి వాలితో ఇలా అన్నాడు

" నువ్వేమో మహాబలుడివట. నీ పరాక్రమానికి భూమ్యాకాశాలు పట్టవని సముద్రుడు, హిమవంతుడు చెబితే, నిన్ను నా వాడి కొమ్ములతో పొడిపొడి చేద్దామని వచ్చాను. నాకంటె ఇంకొకడు బలాఢ్యుడు ఉన్నాడనే మాటే నాకు పడదు సుమా !

నేనా సముద్రుడి మీదికి వెళ్ళి హుంకరించే సరికి, వాడు గజగజ వణికిపోయాడు. నేనేమో దుస్సహమైనటువంటి నా శౌర్యానికి గుర్తుగా తెల్లని భూభాగాన్ని చాళ్ళుచాళ్ళుగా దున్నిపారేశాను. అప్పుడు ప్రాంతమంతా ఉప్పుమళ్ళుగా మారి  సముద్రుడు పాదాక్రాంతుడయ్యాడుసముద్రుడు నాకు సమ ఉజ్జీ కాదనిహిమవంతుడి పేరు చెప్పాడు.

ఇక హిమవంతుడి సంగతి సరేసరి. వాడికి చీమునెత్తురు లేవు. అసలు ఒంట్లో రక్తం లేనట్లు నిలువునా పాలిపోయినట్లున్నాడు. ఇక వాడితోనా నేను యుద్ధం చేసేది? ఔషధాలయంలో (హిమవత్పర్వతం ఔషధ మూలికలకు నిలయం) శాంతులు, వ్రతాలు, సంతర్పణలు చక్కగా చేసుకోవచ్చు. "

హిమవంతుడితో యుద్ధం అంటే, ఆరు నెలలు బాగా సాము చేసి, చివరికి మూల నున్న ముసలమ్మను కొట్టినట్లుగా ఉంటుందని అనుకుంటుండగా, హిమవంతుడు నిన్ను గురించి చెప్పాడు. "

వాలి మహాబలశాలి. కార్త్రవీర్యార్జునుడిని, రావణుడిని మూడు చెరువుల నీళ్ళు తాగించినవాడుదుందుభి అటువంటి వాలిని కవ్విస్తున్నాడంటే, వాడెంత దున్నపోతో అర్థమౌతుంది. సముద్రుడు గంభీరమైనవాడు, లోతైనవాడు. హిమవంతుడు ఉన్నతుడువాళ్ళు తగ్గి మాట్లాడారంటే, అది వాడిని ఏడిపించటానికి, మూర్ఖులతో మన కెందుకులే అన్నది ఒక కారణమైతే, ఎటూ వాలి వాడి పీచ మణుస్తాడన్నది ఇంకొకటి.

రసవత్తర ఘట్టం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనిది.








No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like