Monday 8 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 503 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)














నలువుగ నమ్ము మచ్చముగ నా పనులం బొనరించుకొంట కే
సలుపుఁగలేదు నీ దయిన సఖ్యము నీదగు సఖ్యమన్నచోఁ 
డెలియనివాడఁగా నదియు దేవతలైనను బొందలేరు నా
తొలుతటిజన్మలన్ ఫలముతోఁచుట యియ్యది లక్ష్మణాగ్రజా !

నా రఘురామ ! నా యెడల నమ్మకముండిన మైత్రి సాగ ని
మ్మూరక వట్టిమాటలని యుల్లమునందునఁ దోచెనేనియున్
నీ రమణీ గవేషణము నీవును దమ్ముఁడు చేసికొండు నా
వైరము తీర్చిపెట్టుటకు వచ్చితివా ! యటవీప్రదేశముల్.

అనిన రాముడు చాలులేవయ్య సఖుడ
మన ప్రతిజ్ఞలు నా కష్టమునకు నీవు
నేను నీ కష్టమునకు నీ వెఱుఁగవు
నతని నే నెఱుంగ  నన్న నర్థమేమి.

నీకేమొ మంచిదినములు
రాకుండగఁ జేసిపెట్టు రా ముందర నీ
నా కార్య మనువు నెవ్వఁడ 
యా కోరెడు నిన్ను నిట్టి ప్రాంచితశీలున్.

సీతాపహరణం చేసిందెవరో చెబితే, వాడి శరీరంలోని మాంసఖండాలు పెకిలించి, రక్తం జల్లించి, బాణాలతో తూట్లుతూట్లుగా చేస్తానని రాముడు సుగ్రీవుడితో అన్నాడుఅప్పుడు సుగ్రీవుడు దీనంగా ముఖం పెట్టి, వాడెవడో తెలియదన్నాడుసీతను ఎవడు అపహరించాడో, ఎక్కడ దాచాడో తనకు తెలియదని, సరియైన సమయంలో వానరసైన్యాన్ని పంపించి, సీతను వెదికించి, రాముడికి అప్పగించకపోతే, తనను సుగ్రీవుడని పేరుతో పిలువ వద్దన్నాడుసుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు.

" రామా ! నన్ను నమ్ము. నా పనులను చేయించుకోవటానికి నీతో స్నేహం చేయలేదు. నేను నీ స్నేహం విలువ తెలియని వాడినేమీ కాదునీ వంటివాని స్నేహం దేవతలైనా పొందలేరునా పూర్వజన్మల పుణ్యఫలం వల్ల యిది సాఫల్యమైంది

నా మిత్రమా, రఘురామా ! నా మీద నమ్మకముంటే యీ స్నేహాన్ని కొనసాగిద్దాము. నావి వట్టి మాటలని నీ కనిపిస్తే, సీతాన్వేషణ, నీవు, నీ తమ్ముడు చేసుకొనండి.   నా వైరాన్ని తీర్చటానికి మీరు వనవాసానికి రాలేదు కదా ! "

మాటలు విన్న రాముడు, సుగ్రీవుడు మనసులో నొచ్చుకున్నాడన్న సంగతి గ్రహించి, ఇలా అనునయించాడు.

" చాల్లేవయ్యా మిత్రుడా ! మనంమన ప్రతిజ్ఞలును. నా కష్టానికి నువ్వు, నీ కష్టానికి నేను, ఒకరికొకరం తోడు. సీతను ఎత్తుకుపోయిన వాడెవడో, నీకు గానీ నాకు గానీ తెలియదంటే, అది విధిప్రేరితంగా జరిగిందని అర్థం.

ఇంకొక సంగతి. నీ కష్టాలు తీరి, నీకు మంచిరోజులు రాకుండా, " రావయ్యా  ! ముందు నా పని చేసిపెట్టమని, నీవంటి పూజార్హుడైన శీలవంతుడిని ఎవరు అడగ గలరయ్యా ! "

రామసుగ్రీవుల హృదయసౌశీల్యానికి పద్యాలు కొలమానాలువారి మధ్య మైత్రి దైవ నిర్ణయం వల్ల జరిగిందిఅందువల్ల, దానిలో వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత లేదుఅందువల్లనే, సుగ్రీవునికి మంచిరోజులు రాకుండానేజానకీగవేషణ చేయటం మిత్రధర్మ మనిపించుకోదని రాముని భావన.

పద్యాలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండములో ఉన్నాయి.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like