Thursday 13 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 94 (నన్నయ భారతము::ఆదిపర్వం :ప్రథమాశ్వాసం: (ఉదంకోపాఖ్యానము)

అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండగా
నురగుల నెల్ల గాచిన మహోరగనాయకు డానమత్సురా
సుర మకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకు బ్రసన్ను డయ్యెడున్.

నన్నయగారు ఆంధ్రీకరించిన మహాభారతము ఆదిపర్వములో ఉదంకోపాఖ్యానము చాల ప్రసిద్ధి చెందినదిఎందరో కవి పండిత విమర్శకులు దీనిపై వ్యాఖ్యానించారు. . 

మహాభారతము నందు యెన్నో ఉపాఖ్యానా లున్నాయికథ చెబుతున్నట్లు పైకి కనిపించి, అంతరాంతరమందు సూక్ష్మ సూక్ష్మ తరములైన బహ్వర్థములను సం యోజించడం, బహు జన్మ తపఃఫలం వల్ల గాని సాధ్యంగాదని, అట్టి పరిణత మనస్కుడైన మహాశిల్పి నన్నయగారని బ్రహ్మశ్రీ ధూళిపాళ శ్రీరారామమూర్తి గారన్నారు. ఇట్టి పరిణత శిల్పాన్ని పట్టియిచ్చే బహుకథలను కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తమ " నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి " అనే విమర్శన గ్రంథంలో వ్యాఖ్యానించి చూపారుఅందులో ఉదంకుని కథ ఒకటి.

గురువుగారైన సత్యనారాయణగారి అడుగుజాడల్లో నడుస్తూ, ఉదంకుని కథను " నన్నయగారి కథా శిల్పము " అనే సిద్ధాంతవ్యాసములో శ్రీరామమూర్తిగారు తరచి చూపారు

వారి వ్యాఖ్యానాన్ని, కథాసూత్రము కొంత వివరించిన తరువాత, మీ ముందుంచుతాను.

కుండలాలను అపహరించిన తక్షకుణ్ణి వెంబడిస్తూ నాగలోకానికి వెళ్ళిన ఉదంకుడు, నాగశ్రేష్ఠుడైన అనంతుడిని స్తుతించిన తరువాత, వాసుకిని గురించి స్తోత్రం చేస్తాడు. స్తోత్రములో వ్యంగ్యము ధ్వనిస్తుంది. ఏమిటా వ్యంగ్యముఇంటిలోని నలుగురు అన్నదమ్ములలో, పెద్దవాడు ఊరికి పెత్తందారు. అతడు ఆదిశేషుడుఇక రెండవ వాడు  వాసుకిఇల్లు చక్కదిద్దుకొనేవాడు.

ఇక ఇక్కడనుండ, బ్రహ్మశ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తిగారి వ్యాఖ్యానము చదువుదాము.  

" ఇల్లు దిద్దికొనిపోవు రెండవ వాడున్నాడుఅతనితో నేమందుము యింటికి సంబంధించిన తత్పూర్వపు సంఘటన మేదియో ప్రస్తావించి ఫలానా వాడు మీకపకారము చేసినప్పుడు నీవు వారిని రక్షించుకొనుట  కెన్ని  పాట్లు పడితివో గుర్తులేదామరి మీ పిల్లలితరుల కపకారము చేయుచున్నప్పు డూరకుందు వేమిఅందుము యనుట లోకములో వ్యంగ్యముగా నన వచ్చును, వాచ్యముగా నన వచ్చునుకవిత్వము నందు మాత్రము వ్యంగ్యముగానే యనవలయును. అందుచేత ' అరిది తపోవిభూతి  నమరారుల బాధలు వొందకుండగా నురగుల నెల్ల కాచిన మహోరగ నాయకు డన్నాడుమీ వారిని బాధల నుండి కాపాడుకొంటివిమీ వారు కూడ బాధలు చేయకుండ చూచు బాధ్యత  నీ యందున్నది అని వ్యంగ్యముమరి నీ వెట్టివాడవు?  ' అద్రినందనేశ్వరునకు భూషణమవు అద్రినందనేశ్వరు డెట్టివాడు?   ' నమత్సురాసుర మకుటాగ్ర రత్న  రుచి శోభిత పాదుడు. '. దేవరాక్షసుల  శిరోభూషణము లాయనకు పాద భూషణములైనను కావుఅట్టివానికి నీవు భూషణమవుమీ తమ్ముడు భూషణ మపహరించుటయేమినీ కెంత యప్రతిష్ఠయో చూడుమని వ్యంగ్యము. "

విధముగా యిందు ఆక్షేపణ వ్యంజ్యమానమై, పద్యమున కొక్క వ్యంగ్యార్థమును ప్రసాదించుచున్నది.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like