Wednesday 5 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 61 (శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక)

మఱల నిదేల రామాయణం బన్నచో నీ ప్రపంచకమెల్ల నెల్లవేళ
దినుచున్న యన్నమే  దినుచున్న దిన్నాళ్ళు తన రుచి  బ్రదుకులు తనవి గాన
చేసిన సంసారమే సేయుచున్నది తనదైన యనుభూతి తనది గాన 
తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావి గాన

కవి ప్రతిభలోన నుండును గావ్యగత
తాంశముల యందు దొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము  వేయి
రెట్లు గొప్పది నవాకథాదృతిని మించి.



శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో యీ పద్యము చాల ప్రసిద్ధమైనదిపండితుల దగ్గరనుండి పామరుల వరకు రామాయణము గురించి మాట్లాడేటప్పుడు, యీ పద్యమును ప్రస్తావించడము జరుగుతూ ఉంటుంది

తెలుగులో చాలామంది రామాయణాలు వ్రాసారు. భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, ద్విపద రామాయణము
  మొదలైనవి ఉన్నాయిమరి ఇప్పుడు ఇంకొక రామాయణాన్ని వ్రాయడమెందుకు అని పాఠకుల ప్రశ్నను, విశ్వనాథవారే వేసుకొని, ఒక చక్కని, హేతుబద్ధమైన సమాధానాన్ని ఇవ్వడమే గాక, ఒక సిద్ధాంత ప్రతిపాదన కూడా చేసారు

ప్రపంచములో, పుట్టిన ప్రతివారు రోజూ అన్నం తింటూనే ఉన్నారు.. కానీ, తిన్న ప్రతిసారి, దానిలో కొత్త రుచిని ఆస్వాదిస్తూనే ఉన్నారుసంసార సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతిసారీ, కొత్త అనుభూతిని పొందుతున్నారుఏంతోమంది రాముణ్ణి భక్తితో కొలుస్తూనే ఉన్నారు. కానీ, తన భక్తిభావము తనదే కావున, మరల రామాయణము వ్రాయుట తనకు ఇష్టము కనుక  వ్రాసున్నానన్నారు విశ్వనాథఇక్కడ, కీర్తిశేషులు జువ్వాడి గౌతమరావుగారు చెప్పిన ఒక మాట మీతో విన్నవించుకొనాలి.

" ఇది వరకెందరో రాసిన రామాయణమును మరల వ్రాయుట ఎందుకనగాఇది సమాధానము. ఇందులో రెండంశములున్నవిఒకటి నా ఇష్టమురెండవది దేహధారణమునకు భోజనమెంత అవసరమో, సంసారతరణమునకు భక్తి అంత అవసరము దేహమున్నంతవరకు మరల మరల తినుట యెట్లో సంసార మున్నంతవరకు, రామకథాస్ఫురణ అటువంటిదని స్ఫూర్తి కనుకనే. "
  
ఇక కావ్యమునకు సంబంధించి విశ్వనాథవారి సిద్ధాంత ప్రతిపాదన విధంగా ఉన్నదో చూద్దాము

కావ్యగతంగా ఉన్న, పది పాళ్ళ కథ, తొంబది పాళ్ళ కవి ప్రతిభతో కలసి, ఉత్తమోత్తమ కావ్యసృష్టి జరుగుతుంది. కారణం విచారిస్తే, కావ్యము నందు నవనవోన్మేషముగా చేయబడిన రసపోషణ వల్ల జరుగుతుందిఇక్కడ విశ్వనాథవారు ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశారుకావ్యగతంగా ఉన్న కథ కంటే, రసము  వేయిరెట్లు గొప్పదిసంస్కృతము లాగానే, తెలుగులో కూడా వేయి అనే సంఖ్యాపదానికి అనంతమైన అనే అర్థాన్ని అన్వయించుకొంటే, కథ కంటే కావ్యగతంగా ఉన్న రసము యెన్నో రెట్లు గొప్పది అని విశ్వనాథవారి సిద్ధాంతముఅప్పుడే, కావ్యము పది కాలాలపాటు  నిలుస్తుంది.   



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like