Friday 7 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 65 (శ్రీనాథుని హరవిలాసము)

కమలాక్షి యిది యేమిగా దలంచితి  విప్పు
          డర్థ దేహంబు నీయదియ కాదె
హృదయంబు పొరువున హృదయ ముండుట లేదె
          యేకీభవించిన యిరువురకును
నే భావమైన నీ హృదయంబునకు దాప 
          నే భంగి వచ్చి నా హృదయమునకు
నపరాధశంక యావంత యైనను లేదు
          నీ చిత్తమున కెక్క నిక్కువంబు

తప్పు  లేకుండ నేల నెత్తమ్మి మొగడ
విసరి వక్షఃప్రదేశంబు వ్రేటుకొంటి
కేసరంబులరజము పుష్పాసవంబు
నెఱసె నిది చూడు కన్నుల నీరు గ్రమ్మె.

నంది తిమ్మన గారి పారిజాతాపహరణము కావ్యములో, కోపగృహంలో నున్న సత్యభామ, అనునయించడానికి వచ్చిన కృష్ణుని, ఆమె వామపాదంతో తొలగద్రోయడము చదివాముశ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము, చిఱుతొండనంబి కథలో, ఇంకొక చక్కని సన్నివేశాన్ని మనము చూస్తాము.

చిఱుతొండనంబి గొప్ప శివభక్తుడుఅతని ఇంటికి అతిథిగా వచ్చిన జంగము, శివాభిషేకము కోసం తూమెడు చెఱకురసము తెమ్మంటాడుతూమెడు చెఱకుగడలు కొని, మోపును పైకెత్తటానికి కష్టపడుతున్న చిఱుతొండనంబికి శివుడు మారువేషంలో వచ్చి సహాయపడతాడు. కానీ, అదే సమయంలో, కైలాసంలో అప్సరసల నాట్యం తిలకిస్తున్న శివుని మేను చెమర్చడము చూసింది పార్వతిఈర్ష్యతో  ఆమె, తన చేతిలో నున్న తామర పువ్వుతో శివుని మొత్తుతుంది. శివుని కంటిలో తామరపువ్వు పుప్పొడి పడి కంట్లో నీరు వస్తుందిఇదీ సన్నివేశం.

సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని, అర్థనారీశ్వరుడైన శివుడు యీ విధంగా చెబుతున్నాడు.

" పార్వతీ! ఇది ఏమి తప్పు అని నీవు తలుస్తున్నావు? నా శరీరంలో సగభాగం నీవే కదా! అందువల్ల, నా హృదయం ప్రక్కనే నీ హృదయముండి, ఏకత్వము వహించిన మన ఇద్దరకు, నీ హృదయంలో కలిగిన భావమైనా, నా హృదయాన్ని తాకుతుందికావున, ఆవగింజంత అపరాధ భావమైనా నీ హృదయంలో నుండనక్కర లేదుతప్పు చేయని, నన్ను వక్షఃప్రదేశంలో యెట్లాకొట్టావో చూడునా కళ్ళలో పుప్పొడి పడి నీళ్ళు కూడా వచ్చాయి. "

ఇది  ఆదిదంపతుల మధ్య జరిగిన  చమత్కారమైన సంభాషణ. లోకంలో యిది చాలా సహజముఅందువల్లనే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు " రసము పుట్టింపగ వ్యవహారము నెఱుంగ/ జనును లోకమ్ము వీడి రసమ్ము లేదు. " అన్నారు.


ఏమి చేసినా, లోకవ్యవహారాన్ని తెలిసి చేస్తారు మహాకవులు. కవిసార్వభౌములు అదే చేశారు యీ సన్నివేశంలో.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like