Friday 7 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 64 (వసుచరిత్రము: తృతీయాశ్వాసము)

సకలాగమాంత వాసనలు గాంచి విముక్త కాంచనం బను మాధుకరకులంబు
వర్ణిత్వమున దృఢావ్యాప్తిసమ్యమములై శౌరి బేర్కొను శుకసంతతులును
గన్న పెంచినవారి గలయక మాధవార్పితసూక్తి మను వనప్రియచయంబు
పద్మాసనాభ్యాస పారవశ్యమున బ్రహ్మాధీనగతులైన హంసతతులు

పుష్పఫలపత్రజలమాత్రముల శరీరయాత్ర గడపుచు సన్మార్గ మధిగమించి
యెసగునివి యెల్ల నీ కేల యెగ్గొనర్చు వనిత యావంత యావంత వలదమ్మ.

వసుచరిత్రములో పద్యాన్ని తీసుకొన్నా వదల బుద్ధి గాదు. నా వంటి అపండితుడయినా, కొంచెము శ్రమించి, పెద్దలు వ్రాసిన టీకాతాత్పర్యసహిత వ్యాఖ్యలను అర్థం చేసుకొంటే, పద్య మాధుర్యానికి కట్టుబడిపోవలసినదేఅటువంటిదే యీ పద్యం కూడా.

మన్మథతాపంతో వనంలో వంటరిగా తిరుగుతున్న గిరికను పలువిధాలుగా  అనునయించారు చెలికత్తెలుభిక్షుకులు లేక సన్యాసులు/తుమ్మెదలు (మాధుకరకులంబు), అస్ఖలిత బ్రహ్మచారులు/చిలుకలు (శుకసంతతులు), వానప్రస్థులు/కోయిలలు (వనప్రియచయంబు), యోగులు/హంసలు (బ్రహ్మాధీనగతులు), సన్మార్గంలో చరించేవారు కావడం వల్ల, తమ ప్రియసఖికి ఆవగింజంత అపకారం చేయవని వారు చెబుతున్నారుదానిని అర్థద్వయంతో, రామరాజభూషణుడు యెంతో చక్కగా వర్ణించాడు.

ముందుగా వర్ణాశ్రమధర్మాలు పాలింపబడిన మానవసమాజం పరంగా అర్థం చెప్పుకుందాము.

సమస్త వేదాంత సారాన్ని వంటబట్టించుకొన్న భిక్షుకులు, ఇంద్రియ  సంయమము , దృఢమైన మనస్సు కలిగినశుకమహర్షి వంటి అస్ఖలిత బ్రహ్మచారులు, తల్లిదండ్రులు మొదలగువారికి దూరంగా, అడవిలో వాసుదేవుని స్మరణతో వానప్రస్థ జీవితం గడుపున్న వారు, పద్మాసనాభ్యాస పారవశ్యంతో బ్రహ్మాత్మ్యైక సంధానాన్ని పొందుతున్న యోగులు, తమ ప్రియసఖికి యే మాత్రం అపకారం చేయరని చెలికత్తెలు గిరికను ఓదారుస్తున్నారు.

ఇక మన్మథునిభృత్యుల పరంగా చెప్పిన రెండవ అర్థాన్ని పరిశీలిద్దాము.

అగమాంతమములు  అంటే లతాంతములు, పుష్పములువాటి సువాసనల్ని పొందేవి తుమ్మెదలు. కానీ, తుమ్మెదలు కాంచనము, అనగా, సంపంగి పువ్వు జోలికి వెళ్ళవు. అటువంటి విముక్తకాంచనం బగు మాధుకరకులంబు ( సంపంగి పూలను విడిచిపెట్టిన తుమ్మెదల గుంపుగిరిక జోలికి పోవుఅక్షరములను పలికే తీరుచేత, రామ రామ రామ అని (రాము రాము రాము) పలికే చిలుకల గుంపు (శుకసంతతులు) కూడా ఏమీ చేయవుతాము కన్న కోయిలలు, పెంచిన కాకులను కలవకుండా, వసంత ఋతువునకు (మాధవార్పితసూక్తి) తగిన మధురమైన కంఠస్వరంతో అడవిలో ఉంటున్న కోకిలలు (వనప్రియచయంబు) కూడా యేమీ చేయవుపద్మములలో కూర్చుండడం చేత  పరవశత్వం చెందుతున్న (పద్మాసనాభ్యాస పారవశ్యమునన్) బ్రహ్మకు వాహనమై మందగతులైన  (బ్రహ్మాధీనగతులైన), హంసలు కూడా ఏమీ చేయవు.

పై రెండు అర్థాలను సమన్వయం చేస్తూ, తేటగీతిలో " పుష్పఫలపత్రజలమాత్రముల శరీరయాత్ర గడపుచు " అనేదానిలో, క్రమాలంకారము ఉన్నదిఆందుచేత, భిక్షుకత్వాన్ని అవలంబిస్తూ సన్యాసులు ఉదరపోషణను, తుమ్మెదలు పూవుల సువాసనను మాత్రము, బ్రహ్మచారులు, చిలుకలు పండ్లను మాత్రము, వానప్రస్థులు, కోయిలలు, ఆకులను మాత్రము, పరమహంసలు, హంసలు, జలము మాత్రము, సేవిస్తూ, సన్మార్గంలో ఉన్నారుఅటువంటివారు/అటువంటివి, తమ ప్రియసఖికి ఆవగింజంత అపకారం చేయరని, అందువల్ల, విచారించవలసిన పనిలేదని చెలికత్తెలు గిరికను అనునయించారు.


వసుచరిత్రము తృతీయాశ్వాసములో నున్న యీ పద్యము వంటివి కావ్యం మొత్తంలో కొల్లలు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like