Sunday 9 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 72 (శ్రీనాథుని హరవిలాసము)

రారా వణిగ్వంశ వారాశిహిమధామ!
          రారా వికస్వరాంభోరుహాక్ష!
రారా మహాఘోర వీరశైవాచార!
          రారా ఘనౌదార్య రాజరాజి!
రారా కుమార కంఠీరవేంద్ర కిశోర!
          రారా సమగ్ర ధీరౌహిణేయ!
రారా మనోభవాకార రూపవిలాస!
          రారా అసార సంసార దూర!

రారా నా వన్నెవడుగ! రారా తనూజ!
రార సిరియాల! రార నా ప్రాణ ప్రదమ
రార నా కుఱ్ఱ! రార నా జియ్య! రార యనుచు
జీరు గారాపు గొడుకు రాజీవ నయన.

అత్తన్వంగి సమస్త దిక్కులను పర్యాయ క్రమం బొప్పగా
నొత్తె జిన్నికుమార రార యని అత్యుచ్ఛైశ్శృతిం జీరినన్
జిత్తంబుబ్బగ వచ్చె బాలుడు మహా శీఘ్ర ప్రచారంబునన్
దత్తద్వ్యంజన పాకగంధ్యవయవ స్థాన ప్రతానంబుతోన్.

రెండు పద్యములు శ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము కావ్యములోని చిరుతొండనంబి వృత్తాంతము నందలివి.

చిరుతొండనంబి వీరశైవమునకు చెందిన మహాశివభక్తుడు. ఆయన భార్య తిరువెంగనాంచిచిరుతొడనంబికి ప్రతిరోజు ఒక అతిథికి భోజనము పెట్టకుండ భోజనము చేయరాదను నియమము కలదుఅతని వ్రతదీక్షను పరీక్షింప దలచి, శివుడు కపటయోగి వేషంలో, చిరుతొండనంబి అభ్యర్థన మీద అతని ఇంటికి వచ్చాడుఅయితే ఒక షరతు పెట్టాడు. అతడు ఏడాదిగా నిరాహారుడుగా వ్రతం చేస్తున్నాడని, వ్రతంలో భాగంగా, ఆతిథ్యమిస్తున్న గృహస్థు, పిన్నవయస్కుడైన అతని కొడుకు మాంసమును వండి వడ్డించగా, గృహస్థు, అతని కొడుకు సహపంక్తిలో కూర్చుండగా, వ్రతాన్ని పూర్తిచేస్తానన్నాడుఅందుకు అంగీకరించి, కొడుకు సిరియాలుని మాంసాన్ని వండి, అరటి ఆకులో వడ్డించిన, తిరువెంగనాంచిని చూసి, తన ప్రక్కన కూర్చొని భోజనం చేయడానికికొడుకును పిలువమని అడిగాడు కపటయోగిబాలుడు ఎక్కడో ఆడుకుంటున్నాడని, అందువలన ఆతిథ్యము స్వీకరించమని చెప్పిన, తిరువెంగనాంచిని ఉద్దేశించి చెప్పినవి యీ పద్యాలు.

ఇక ఇక్కడ నుండి, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు " కావ్య పరీమళము " అనే వ్యాఖ్యాన గ్రంథములో వివరించిన అమూల్యమైన విశేషాంశాలను వారి మాటల్లోనే, పొందుపరుస్తున్నానుమహాకవుల అద్భుతమైన వ్యాఖ్యానానికి నా స్వంత పైత్యము అనవసరము.

" కథలో నున్న పట్టంతయు నీ రెండు పద్యములలో నున్నది. చచ్చినవాడు, కూరలుగా వండబడిన మాంసము కలవాడు, బ్రతికి వచ్చుట యెట్లుఇది యసంభవము కదా!

అగస్త్య మహర్షి వాతాపియను రాక్షసుని చంపెనుఇల్వలుడు వానిని గొఱ్ఱెను  చేసి యా మాంసము నగస్త్యునకు వండిపెట్టెను. అగస్త్యుడు తిన్నంతసేపు " వాతాపి జీర్ణం-వాతాపి జీర్ణం " అనుచు తినెనుతరువాత నిల్వలుడు వాతాపిని పిలువగా వాడు రాలేదుజీర్ణమై పోయెనుఅనగా, జీర్ణమైనచో మరల బ్రదుకుట సంభావము కాదుగాని, జీర్ణముకానిచో బ్రతుక వచ్చునన్నమాట!

బ్రతుకుట యనగా నేమి శరీరావయవములు సంతన పడగా ప్రాణములు వచ్చి యందులో చేరుట.

సంతన పడుట యెట్లుఎంత ప్రకృతిశాస్త్ర మహావిజ్ఞానమైనను మనుష్యులను సృష్టించుట లేదుగదా!

దైవము యొక్క విలాసము చేత సృష్టి కలుగుచున్నది. పెరుగుచున్నదికొంతకాలము పట్టుచున్నదికాలము కూడ భగవంతుడేవాడు తలచినచో కాలము కూడ నక్కఱ లేదు.

అసలీశరీరము నిర్మింపబడవలసిన అవసరమేమిజీవుడు తన కర్మ ఫలము ననుభవించుటకు శరీరముండుటతోడనే దీనిలోనికి ప్రాణములు వచ్చి చేరుచున్నవిఅవి యెచ్చటనుంచి వచ్చుచున్నవి?

నానా దిక్కులనుండి వచ్చుచున్నవి. అనగా సర్వదిశలును ప్రాణభరితములని యర్థముపంచభూతములయందు ప్రాణములున్నవని యర్థముజీవుడుగా కావలసిన ప్రాణముల లక్షణములు వేఱుఅది భగవంతునికే తెలియును.

ఇవి యతీంద్రియ విషయములు. అతీంద్రియ విషయములు వేదములే చెప్పగలవు

సామాన్యులు మరణింతురు. యోగులు సిద్ధులు మరణింతురువారికి పునర్జన్మ లేదుకర్మబద్ధులైన జీవులకు ప్రాణసంపుటి చెడదుసిద్ధులకు యోగులకు ప్రాణసంపుటి చెడిపోవును.

మహా విషయము ఇంధ బ్రాహ్మణములో కలదుఅది బృహదారణ్యకములోని చతుర్థాధ్యాయములోని ద్వితీయ బ్రాహ్మణముఅచ్చట నిట్లున్నది.

                                తస్య ప్రాచీదిక్ ప్రాంచః ప్రాణాః
                                దక్షిణాదిక్ దక్షిణే ప్రాణాః
                                ప్రతీచీదిక్ ప్రత్యంచః ప్రాణాః

మొదలుగా దిక్కు ప్రాణములాదిక్కునకు పోవునుఅప్పుడు బ్రహ్మ పదార్థము మిగులును.

మహారహస్యమును శ్రీనాథుడీ కథ చివరగా ననుసంధించెను.

సిరియాలుడు బ్రతికెను. బ్రతుకుట యెట్లో శ్రీనాథుడు వేదముయొక్క సాక్ష్యమును చూపించెను.

రెండవ పద్యములో నాల్గవ చరణములోని యర్థము, కవితాగుణముతో కూడియున్నదిఅనగా కల్పనా చమత్కార సహితముగా నున్నది.

అనగా నా పిల్లవాని యవయవములు పెట్టిన పోపులవాసనలు వేయుచున్నవట.

అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యెనువరములిచ్చెను.  "




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like