Saturday 29 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము- 735 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము)




దైవంబులు వచ్చి సాయపడగా నే నిప్పుడర్థింతు నా
నా దైవంబులు మూటకట్టికొని యైనాడా మహాస్వామి 
పెంపేదం బౌరుష మాశ్రయించి చనగా నేమౌను శ్రీరాఘవుం
గోదండోగ్రుని ముందు నిల్చుటకు నీకున్ సాధ్యమా చెప్పుమా.

ఏనొక్కండు వచింతు నిశ్చితముగా నేర్పాటుగా శౌర్యపా 
రీణంబైనది వచ్చి పిల్చినది సుగ్రీవుండె యా వెన్క నే
డో నారాచనిగూఢుడుండికద యా యూతంబడిన్ వచ్చె దా
గానన్ వాని నెదుర్చు మూతను పరిష్కారంబుగా సర్వమున్.

  ఇవి రెండే తుదకున్ వినిశ్చితములై యేపారు సుగ్రీవునిన్ 
యువరాజుం బొనరించి శత్రుతకు స్వస్త్యుత్క్రాంతులం జెప్పుటో
ప్రవిభక్తంబగు శౌర్యదీపనముగా రామున్ ఘనశ్యాము నా
హవ రంగము నందెదుర్చుటయొ వీరానీక సంశ్లాఘ్యమై.

అదియున్ నీకును రామచంద్రునకు బ్రత్యక్షంబు వైరంబు లే
దెదురై పోరడు దాన రాము డటులే యీవున్, మఱే చెట్టునో 
మదుగై నిన్ను వధించు దాని కదియున్ మర్యాదయై పొల్చు తా
నదియే హేతువుగాగ నీవతనిమాఱై పోరవచ్చుం జుమీ.

మాటలు సుగ్రీవుని
తో మాట్లాడుము బహిర్గతుండగు నతడున్
రాముండేమనునో సు
త్రామసుతా ! యిట్లు పోవఁదగ దెవ్వరికిన్.

వాలి భార్య తార ఎంతో వివేకం, విచక్షణాజ్ఞానం కలిగిన స్త్రీమూర్తి. అందుచేత, సుగ్రీవుడు యుద్ధానికి పిలవగానే, పలుమార్లు తన భర్త చేతిలో దెబ్బలు తిన్న సుగ్రీవుడి ఔద్ధత్యానికి  వెనుక నున్నట్టి కారణాన్ని గ్రహించి, వాలిని తొందరపడవద్దని హితవు పలికింది. పైపెచ్చు, ధర్మపరులు, ధర్మ పరిరక్షకులైన ఇక్ష్వాకువంశానికి చెందిన రాముని మహత్వాన్ని ఆమె సంపూర్ణంగా ఆకళింపు చేసుకొన్నదిఆమె వాలితో ఇంకా ఇలా అంటున్నది.

" ఓయి ఇంద్రతనయుడా ! ఇప్పుడు దైవాన్ని వచ్చి నిన్ను కాపాడమని నేను ప్రార్థించాలి. ఎందుకంటే, మహనీయుడేమో సర్వదేవతా స్వరూపం. నీవేమో పురుషత్వాన్ని మాత్రమే నమ్ముకొని ఆయనతో యుద్ధానికి వెళ్తే ఏమౌతుంది కోదండరాముని ముందు నిలవటం నీకు సాధ్యమా

నేనొక విషయం మాత్రం గట్టిగా చెప్పగలనుయుద్ధానికి రమ్మని వచ్చి పిలిచింది సుగ్రీవుడే అయినాఆయన వెనుక ఎవరో గొప్ప ధానుష్కుడు ఉండటం వల్ల కదా అతడు దానిని ఊతంగా చేసుకొని వచ్చాడు. అందుచేత, ఎవరి ఊతంతో అతడు నిన్ను ఎదుర్కొంటున్నాడో, ఊతాన్నే యీ సమస్య మొత్తానికి పరిష్కారంగా భావించి, నీవు కూడా సుగ్రీవుడిని  ఎదుర్కోవాలి.

అందువల్ల, నాకు రెండే రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, సుగ్రీవుడిని యువరాజును చేసి శత్రుత్వానికి ముగింపు అయినా పలకాలిలేకపోతే, నీ శౌర్యపరాక్రమాలకు తగ్గట్లుగా, వీరులు మెచ్చుకొనేటట్లు, శ్రీరాముడిని యుద్ధరంగంలో ఎదుర్కోనైనా ఎదుర్కోవాలి.

ఇక అందులో కూడా, నీకు రాముడికి ప్రత్యక్షంగా విరోధం లేదు. అందువల్ల, ఆయన నీతో ప్రత్యక్ష యుద్ధం చేయడు. నువ్వు కూడా అంతే. ఏదో ఒక చెట్టు చాటు నుంచి ఆయననిన్ను చంపుతాడు. దానికది ధర్మబద్ధంగానే కనిపిస్తుంది. నీవు కూడా యీ అంశాన్నే ఆధారంగా చేసుకొని, నీకు మారుగా  ఇంకొకరు సుగ్రీవునితో యుద్ధం చేయవచ్చు.

మాటలు సుగ్రీవుడితో చెప్పు. అప్పుడతడి మనసులో మాట కూడా బయటపడుతుందిరాముడు కూడా ఏమంటాడో తెలుస్తుంది. అంతేకానీ, తొందరపడి యీ రకంగా యుద్ధానికి పోవటం ఎవరికీ మంచిదికాదు. "

పద్యాలు చదివితే, తార ఎంత రాజనీతి తెలిసిన స్త్రీయో, ఎంతటి ఆలోచనాపరురాలో, ఎంతటి దూరదృష్టి కలదో అర్థమౌతుందిఅటువంటి తార పాత్రను అత్యద్భుతంగా మలిచిన విశ్వనాథ ఎంతటి మహాశిల్పియో చెప్పనక్కరలేదు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.















No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like