Thursday 6 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 692 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: సంశయ ఖండము)





నే నొక మ్రొక్కు మ్రొక్కెదన, యెవ్వరునెప్పుడుగాని మ్రొక్క
నట్టిది యిది, నేను సామి పొగటెక్కము పెన్దుముదారు సాకిరై
పొదలఁగఁ బెండ్లియాడితిమి, మోహన రూపుఁడు రాఘవుండు నా
పద యిది దాఁటినన్ ద్రిదశవంద్యున కాహుతి నౌదు నగ్నికిన్.

హ్రద రూపంబున నేర్పరించి చితి నే నగ్ని ప్రవేశంబు సే
సెద, నీ  మ్రొక్కును మ్రొక్కెదన్ హుతవహా ! శ్రీరామచంద్రుండు నా 
యెదలో నుండిన దీపమారమికి నీ వీ కోర్కి పాలించినన్
మదకుంభీనస మూర్తి లక్ష్మణునకున్ మన్నించినం బ్రాణముల్.

ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగపాశబద్ధులను చేశాడుకుమారుని నోట యీ వార్త విన్న రావణుడు, సీత వద్దకు వెళ్ళి, రామలక్ష్మణులు అసువులు బాశారని, అందువల్ల వారిని మరచిపొమ్మని చెప్పాడు. కావాలంటే, సీత పక్షాన మాట్లాడే త్రిజటను పంపి తెలుసుకొనమన్నాడుసంఘటనాస్థలానికి వెళ్ళి తిరిగివచ్చిన త్రిజట, రామలక్ష్మణులు స్పృహ లేకుండా పడివున్నారని, కానీ, వారి ముఖాలు మాత్రం పున్నమి నాటి చంద్రబింబం లాగా   వెలిగిపోతున్నాయని చెప్పింది. త్రిజట మాటలతో ఊరడిల్లిన సీత, ఆమెతో యీ విధంగా అన్నది.

" ఇంతవరకు ఎవరూ మ్రొక్కని మ్రొక్కు మ్రొక్కుకుంటాను. నేను, స్వామి అగ్నిసాక్షిగా పెండ్లి చేసుకొన్నాముమోహనరూపుడైన రామచంద్రుడు యీ ఆపద నుంచి గట్టెక్కితే, నేను  దేవతల చేత సహితం పూజింపబడే అగ్నికి ఆహుతి అవుతాను.

అగ్నిదేవా ! నీటిమడుగు లాగా వెడల్పుగా చితి నేర్పాటుచేసి నేను అగ్ని ప్రవేశం చేస్తానని మ్రొక్కుకుంటున్నానునా హృదయం లోని దీపమైన శ్రీరామచంద్రుడికి, కోపంతో అగ్నిజ్వాలలు కురిపించే మహసర్పము వంటి  లక్ష్మణుడికి ఆపద కలుగకుండా కాపాడితేనేను చెప్పిన మ్రొక్కు చెల్లించుకుంటాను. "

శ్రీరామచంద్రుడు సీతకే కాదు, " సర్వాసు ప్రాంగణ ముగ్ధదీపిక " అని పినతల్లి కైకేయి మాటఇక లక్ష్మణుడు సాక్షాత్తు ఆదిశేషువు అవతారం.

వాల్మీకి రామాయణంలో ఎన్నో చిక్కుముడు లున్నాయి. వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకొన్న విశ్వనాథ వంటి రామాయణ భాష్యకారులు చిక్కుముడులకు సహేతుకతను కల్పించారు. అటువంటిదే, సీత త్రిజటతో చెప్పిన యీ మ్రొక్కు సంగతి. రావణ వధానంతరం అగ్ని ప్రవేశం చేసిన సీత చర్యకు ఒక చక్కని హేతువును కల్పించినది సీత మ్రొక్కుకు సంబంధించిన యీ సన్నివేశం.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like