Friday 21 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము- 732 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అవతార ఖండము)




ఒక్కసారిగాగ నుభయసంధ్యలు దక్షి
ణోత్తరముల యందు నొదిగియున్న 
నీలినీడలొప్పు నింగివోలిక నల్వు
రన్నదమ్ములాడు నవనితోచు.

తానో ' లాములు ' తండ్రి పేరెవరయా ' దాచాతమాలాలు ' ' నౌ
లే నా పే ' రన ' నమ్మగాల ' నగ నోలిందల్లి కౌసల్య తం
డ్రీ ' నాగా ననబోయి రాక కనులన్ నీర్వెట్టఁ ' గౌసల్య నౌ
గానే కానులె యమ్మనే ' యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్.

బాలురైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆరుబయట సాయంత్రం పూట ఆడుకొంటున్నారు. సుర్యాస్తమయమౌతున్నదిఇక్కడ విశ్వనాథ అద్భుతమైన వర్ణన చేశారు.

నలుగురూ ఆడుకొంటూ ఉంటే, వాళ్ళాడుకొంటున్న నేల, తూర్పుపడమరలు  దక్షిణోత్తర దిశలలో ఒదిగిపోయిన ఆకాశంలాగా ఉందట.

సూర్యుడస్తమించటం, చంద్రుడుదయించటం ఒక్కసారిగా జరిగేది పున్నమినాడు. అప్పుడు తూర్పుపడమర దిక్కుల వైపు ఎఱ్ఱగానూ, దక్షిణోత్తర  దిశాముఖాలు, నీలినీడలతో నిండి ఉన్నట్లు కనిపిస్తాయి. అరుణవర్ణంతో కూడిన రెండు దిక్కులు, నీలవర్ణచ్ఛాయలతో కూడిన యీ రెండు దిక్కులలో ఒదిగిపోయి ఎఱుపు, నీలి రంగుల శోభతో ఆకాశం శోభాయమానంగా ఉంటుంది.

రామభరతులు నీలవర్ణదేహులు. లక్ష్మణశత్రుఘ్నులు అరుణవర్ణదేహులు. అందరూ కలిసిఆడుకొంటుంటే, ఆకాశంలోని వర్ణసమ్మిళిత శోభ భూమికి దిగివచ్చిందా అన్నట్లుంది. ఎంత చక్కని ఊహ ! ఎంతటి ఉదాత్త కల్పన !

ఇక రెండవ పద్యం ముద్దు మాటలు పలికే రాముడిని గురించి చెప్పిన పద్యం.

కౌసల్య రాముడిని " నాన్నా! నీ పేరేంటో చెప్పు? " అని అడిగితే రాముడు " లాములు " అని బుంగమూతి పెట్టుకొని చెబుతాడు. మరి ' మీ నాన్నగారి పేరో? ' ' దాచాత మాలాలు ' అని, ' సరేలే గాని, నా పేరు చెప్పు " అని అడిగితే " అమ్మగాలు " అని అనగానే, " కౌసల్య నాన్నా ! " అని అనబోయి, " కాదులే, అమ్మగాలే " అంటూ రాముడిపై ముద్దుల వర్షం కురిపిస్తుంది.

పద్యం పాఠకులకు ఒక్కసారిగా తల్లి ప్రేమను గుర్తు చేసి, బాల్యంలో వారి ముద్దుమురిపాల వైపుకు తీసుకువెళ్తుంది. వచ్చీరాని మాటలతో ముద్దులు మూటగట్టే పసిపిల్లవాడి మనస్సుకి అచ్చ తెలుగుదనాన్ని జోడించి, దానిని ఛందోబద్ధం చేసి, రాముని పసి(మి)తనాన్ని, తల్లి కౌసల్య మిసిమితనాన్ని కళ్ళెదుట సాక్షాత్కరింపజేసిన విశ్వనాథ శిల్పచాతుర్యానికి మరొక్కసారి ముగ్ధులవక తప్పదు.

పసిమి = బంగారు రంగు (స్వచ్ఛమైన, అమాయకపు)
మినిమి = వెన్న (మెత్తని)

రెండు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనివి.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like