Wednesday 19 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 727 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)





ముసలి గురుండు రాజు పిత, పుట్టిన కోపమొ మోదమో యెదో
మసలిన భావమైన తన మాటను జేయుమనంగఁ బుత్రుడై
నస నస పోవువాడు మనినన్ మనకున్నను నొక్కడే సుమీ
 కుసులు జనించు ధర్మ మనుకొన్న పథంబొక డాశ్రయింపమిన్.

జనకు నాన నేను జవదాటగా లేను 
భర్త యొకడె సతికిఁ బరమ గతియు
భూమిభర్త బ్రాణముల తోడ నుండగాఁ
దల్లి నాదువెంట దరలుటెట్లు?

నీ కన్నుల యెదుటన యి
ట్లే కాంతారమున కేగి యరుదెంచెదనే
నాకున్ ధర్మాచరణ ప్రాకట
ఫల మబ్బ నేమి ప్రతిబంధకమో

తొలి ధర్మమ్మును చేయనెంచడును బుత్రుం డెవ్వడుం గానీ యా
తొలి ధర్మమ్మును చేయబూనుకొనగాఁ దూలింతురే! తల్లి
మ్ములు రాజ్యం బొక కారణంబుఁ గొని యీ పున్నెంబు వెన్ద్రోయగా
దలపన్ జూచుచుఁ జూచుచున్ మఱి మహాధర్మంబు మ్రగ్గింతునో.

రాజ్యాన్ని వదలుకొని, అరణ్యవాసానికి పోవటానికి  సిద్ధమౌతున్న శ్రీరాముడిని చూసి, కన్నీటి పర్యంతమైన లక్ష్మణుడుదీని కంతటికి మూలకారణం తండ్రి అని భావించి, ఆయనపై    కోపించాడు. లక్ష్మణుని మాటలు విన్న రాముడు, తమ్మునికి ధర్మం యొక్క స్వరూపాన్ని గురించి తెలియజెప్పి, హితాన్ని ఉపదేశించాడు.

" గురువు, రాజు అయినటువంటి తండ్రి వృద్ధుడైనాడు. మరి ఆయనకు నా మీద కోపం వచ్చిందో, అనుగ్రహం కలిగిందోకారణ మేమైతేనేమి, నన్నొక కోరిక కోరితే, అది నెరవేర్చకుండా తప్పించుకు పోయేవాడు, బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. లక్ష్మాణా! ధర్మమార్గమని అనుకొన్న దానిని ఆచరింపకపోతే చాలా దుఃఖం కలుగుతుంది సుమా

తండ్రి మాటను నేను జవదాటలేను. ఇక, అమ్మ సంగతంటావా, భార్యకు భర్త అనేవాడే సర్వస్వం. అయినా రాజు బ్రతికి ఉండగా, తల్లి నాతో వస్తాననటం న్యాయం కాదు. " 

తరువాత, తల్లి కౌసల్యతో విధంగా చెప్పాడు.

" అమ్మా ! (ఎందుకు బాధపడతావు?) ఇదిగో ! నీ కళ్ళెదుట ఉన్నవాడిని ఉన్నట్లుగావనవాసానికి వెళ్ళి తిరిగొస్తానునాకు ధర్మాచరణ చేసే గొప్ప ఫలం లభిస్తుంటే, దానిని అడ్డుకోవటం తగునా?

పితృవాక్య పరిపాలన (సత్యవాక్పరిపాలన) చేయాలని, మనోవాక్కాయ కర్మలా, అనుకోవటం కొడుక్కయినా అంత సులభం కాదుఅటువంటిది, తండ్రి మాటను పాలించే అవకాశం నాకొస్తే, దానిని  చెడగొడతారేమిటి? తల్లి బాధ పడుతున్నదని, తమ్ముళ్ళను వదిలిపెట్టి పోవలసి వస్తున్నదని, రాజ్యం చేజారిపోతున్నదని, ఏదో ఒక కారణం చూపించి పుణ్యాన్ని వెనక్కి తోయాలని చూడటం, ఒక మహాధర్మాన్ని మంటగలపటం కాదా ! " 

తండ్రి యీ దేహాన్నిచ్చినవాడు. దేహమనేది ఉంటేనే ధర్మాచరణ సాధ్యం. అందువలన, పితృవాక్య పరిపాలన మానవుని ప్రథమ ధర్మం.

" రామో విగ్రహవాన్ ధర్మః ".  శ్రీరాముడు ధర్మాన్ని, తనకు తానుగా ఆచరించి, మార్గంలోనే మానవజీవితానికి సాఫల్యం, సార్థకత అని లోకానికి చాటిచెప్పడానికి, మానవునిగా దిగివచ్చిన అవతారమూర్తి

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండం లోనివి











No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like