Thursday 13 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 725 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: కుంభకర్ణ ఖండము)




నరమాత్రుండటె కట్టినాడు కడలిన్ నాళీకపత్రేక్షణా
అరరే నమ్మఁగనేరనయ్యెదనుసూ, అస్మత్సుతుండింద్రజి
త్తురగ క్రూరశరప్రబంధకలిత వ్యూహంబు నిర్మింప
త్వరుఁడై దానిని విప్పికోఁగలిగెనే వారాశివీచీదృశా

నీవేమందు వనంగను,
మీ వైఖరి మీకె తెలియును మీరున్ మీరున్
రావణుఁడును రాముడు మా
కా విషయము తెలియదనిన నబ్జాక్షి నగన్.

నీ కిష్టమ్మిది కానియట్టెఱుగుదున్ నీరేజపత్రేక్షణా !
నీ కిష్టమ్మిట నెట్లుగాఁ గలుగునే నీరేజపత్రేక్షణా
నాకున్ రాముడు వార్థిదాఁటె ననినంతన్ గుండెలో బర్వుగాఁ
జేకొంటైనది భార మెక్కువగ దోచెన్ దీనితో నంగనా !

రామలక్ష్మణులు నాగపాశ బంధాలనుండి విముక్తులయ్యారు. రావణునిలో సంశయం మొదలయింది. మల్లగుల్లాలు పడుతున్నాడు. నిద్ర పట్టడం లేదు. పట్టమహిషి మండోదరి దగ్గరకు వచ్చి, తన గోడు చెప్పుకొంటున్నాడు.  

" పద్మపురేకుల వంటి కన్నులు గలిగిన మండోదరీ ! సముద్రానికి వారధి కట్టినవాడు మానవమాత్రు డంటావా? అరరే ! నమ్మ శక్యం కాకుండా ఉందే ! మన కుమారుడు ఇంద్రజిత్తు పన్నినటువంటి, క్రూరమైన బాణాలతో నిర్మింపబడిన నాగపాశాలను సత్వరమే  విడిపించుకోగలిగాడు. ఇదంతా చూస్తే నీ కేమనిపిస్తుంది? " అని మండోదరిని అడిగాడు.  

దానికి మండోదరి, " మీరు చేసే పనులు మీకే తెలియాలిఒకరేమో రావణుడు, ఇంకొకరు రాముడు. అందువలన విషయాలు మీకే తెలియాలి. " అని నవ్వింది.

మండోదరి మాటలు విన్న రావణుడు, ఆమెతో విధంగా అన్నాడు

" నేను చేసిన పని నీకు ఇష్టం కాదని నాకు తెలుసు. నేను చేసిన పని నీకు ఇష్టంగా ఎందుకుంటుందిరాముడు సముద్రం దాటాడనగానే నాకు గుండెలో పెద్ద బరువు పెట్టినట్లయింది. ఇప్పుడు నాగపాశాలను విడిపించుకోవటంతో, అది ఇంకా ఎక్కువయినట్లుగా అనిపిస్తున్నది. "

రావణుడు  మండోదరిని  " వారాశివీచీదృశా ! " అని సంబోధించాడుఅంటే, సముద్ర తరంగములపై దృష్టి సారించినదానా !  " అని అర్థం. సముద్రము అతి విశాలమైనది, లోతైనది, గంభీరమైనది. మండోదరి కూడా అటువంటిదేమహాపతివ్రతపంచకన్యలలో ఒకరిగా పేరుగాంచినది. వివేచనా శక్తి గలిగిన స్త్రీతన భర్త, సీతను లంకకు తీసుకురావటం అనర్థదాయకమని, లంకకు చేటని ఆమెకు తెలుసు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like