Saturday 8 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 707 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)




తన యనుష్ఠానమైనంత మునికి నరఁటి 
యాకు వెన్నీనె తీసి కొసాకు పెద్ద
చెఱువునంతటి యాకు వేసి జల మింత 
చఱచి వండిన వాతాపి యెఱచి బెట్టె.

ముని ముద్దముద్దకును త్రేఁ
చును జేతం గుక్షి రాచుచున్ జీర్ణ మ్మం
చను నమలి నమలి మ్రింగును 
కనుచుండిన యిల్వలునకుఁ గడువెఱఁగొదవన్.

ఎంత కామరూపు లేని వింధ్యాచల
మంత పెరుఁగ లేరురా ! దురాత్మ
కడు నగస్త్యదండి గర్భంబునన్ జీర్ణ 
మైన తమ్ముఁడెట్టు లరుగుదెంచు.

నా విని కుంభసంభవుని నామముచే హృది దిగ్గురంచు దుః
ఖావిలచేతుఁ డిల్వలుఁడు నాగ్రహవృత్తి నగస్త్యమౌనిపైఁ
బోవ ఘటోద్భవుండు కనుమూసి సమాధిని బొందినంత దే
వావలివైరి కీకసచయంబులతో మసిబొగ్గుగాఁగనై.

అరణ్యమార్గంలో వస్తున్న మునిని ఆపి, ఆతిథ్య మిస్తానని చెప్పి, ఇల్వలుడు అతడిని ఇంటికి తీసుకువచ్చాడు. ముని అనుష్ఠానం అయిపోగానే, అతడిని కూర్చోబెట్టి, వెన్ను ఈనె తీసినటువంటి  పెద్ద చెరువంత అరటి ఆకు అతని ముందు వేసి, దాని మీద నీళ్ళు జల్లి, వండినటువంటి వాతాపి మాంసాన్ని వడ్డించాడు

ముని ముద్ద ముద్దకూ త్రేనుస్తూ, చేతితో పొట్ట రాసుకుంటూ, " జీర్ణం జీర్ణం " అంటూ బాగా నమిలి మ్రింగసాగాడుఎదురుగా ఉండి చూస్తున్న ఇల్వలుడికి దడ పుట్టసాగింది. " 

ఇల్వలుడు వాతాపిని, బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని బయటకు రమ్మన్నాడు. అప్పుడు ముని ఇల్వలుడితో ఇలా అన్నాడు:

" ఓరీ దురాత్మ ! మీరెంత కామరూపులైనా కూడా వింధ్య పర్వత మంత ఎత్తు పెరుగలేరురా. అగస్త్యుడి పెద్ద పొట్టలో జీర్ణమైపోయిన నీ తమ్ముడు డెట్లా తిరిగి వస్తాడురా

అగస్తుడనే పేరు వినపడగానే, ఇల్వలుడి గుండె జారిపోయి, దుఃఖవివశుడై, కోపంతో ఊగిపోతూ, అగస్త్య మహర్షి పైకి పోయాడుఅగస్త్యుడు కళ్ళు మూసుకొని సమాధి స్థితిని పొందగానే, ఇల్వలుడు ఎముకలతో సహా మసిబొగ్గుగా మారిపోయాడు. "

సముద్రాన్నే ఔపోసన పట్టిన మునికి పెద్ద చెరువంత అరటి ఆకు కూడా చాలదు. కానీ వచ్చినవాడు, పరమ మాహేశ్వరుడు, పరమ వైష్ణవుడైన, అగస్త్యుడని ఇల్వలుడికి తెలియదు పాపం

సప్తర్షులలో అగ్రగణ్యుడైన అగస్త్యుని మహత్తును తెలిపే యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.












No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like