Thursday 6 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 700 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము : అభిషేక ఖండము)





అని సౌమిత్రిని గాంచి, యొక్కరుఁడు బాహాశౌర్యదీప్రుండయేన్
వనథుల్ నాల్గిట నంపనిప్పు లురలింపన్ జూచుటే ధర్మమా
తన శక్తిన్ గుదియించి ధర్మకలనాతాత్పర్య మార్గంబునం
దుననే పోవుట దేవతాపథము, వేర్త్రోవల్ సురారాతికౌ.

తనకుం జియ్యయుఁ బట్టి క్రూరమృగయూధం బమ్మ నాన్నంచు, నే
రని, దీ మానవలోక మా పగిదివారా? ధర్మ మన్నట్టి చి
క్కని యా చక్కని వస్తు వెచ్చటనొ స్వర్గం బందునా కల్గు? నీ
కును నాకున్ మది సాధువైన యెడలన్ గూలంకషం బిచ్చటన్.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.

రాముడి వనవాస వార్త విన్న లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడుతనకు అన్న రాముడే దైవం, తల్లీ,తండ్రీ, అన్నీ అన్నాడురాముడిని పట్టాభిషిక్తుడిని చేయటం కోసం ఎవరినైనా ఎదిరిస్తానన్నాడు. దానికి సమాధానoగా రాముడు:

" ఎవడైన ఒకడు మహాబాహుబలపరాక్రముడైనంత మాత్రాన, తన శస్త్రాలతో నాలుగు సముద్రాలలో నిప్పులు కురిపించాలని చూడటం ధర్మమా? తన శక్తిని తగ్గించుకొని, ధర్మ మేర్పరిచిన మార్గంలో పోవటమే దేవతలకు ప్రీతికరమైన మార్గంతక్కిన దారులన్నీ రాక్షసులు వెళ్ళేవి

దైవం క్రూరమృగాలకు అమ్మ, నాన్న అంటూ తెలియకుండా చేసిందిమానవలోకం లోని వారు కోవకు చెందినవారాధర్మ మనే అతి చిక్కని, చక్కని వస్తువు స్వర్గంలో నైనా నీకు లభిస్తుందా? మనస్సు కనుక శుద్ధంగా, సాత్వికంగా ఉంటే, ధర్మాచరణ మనేది నీకు, నాకు, ఒక్క మానవలోకం లోనే సంపూర్ణంగా సిద్ధిస్తుంది. " 

తల్లి, తండ్రి, బంధువులు అనే సంబంధాలు చాలా చిక్కనివి, చక్కనైనవి. గోవుల వంటి సాధుజంతువులలో వాత్సల్యం కనపడుతుందికానీ, క్రూరమృగాల్లో ఇది లేదు. అమ్మ, నాన్నలు మానవులకు దైవం ప్రసాదించిన వరం. సంబంధాలను సువ్యవస్థితంగా ఉంచుకోవటానికి ధర్మాన్ని పాటించటం తప్పని సరి. ఇంత మంచి అవకాశం స్వర్గంలో కూడా లేదు.

" రామో విగ్రహవాన్ ధర్మః " అని రామాయణంలో మారీచుని నోటనే పలికిస్తాడు మహర్షి వాల్మీకి. దైత్యుడైన మారీచుడే ధర్మం యొక్క విశిష్టతను చూడగల్గినపుడు, ఇక ధర్మాచరణ మీద నిర్మింపబడవలసిన  మానవ సమాజం, దానిని తప్పి పెర త్రోవల పోతే, మనుగడకు అర్థ మేమున్నదని రాముని భావన.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like