Wednesday 19 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 728 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: అభిషేక ఖండము)




ఈయన ప్రొద్దువంగడము హీరము, పంక్తిరథాత్మజుండు, తా
నీ యటవుల్ చరించెడుఁ బితృప్రియ కార్యచణుండు, వింజపున్
మాయుక సింహమైన మునిమండను, పాదనమస్క్రియా సప
ర్యాయుతమైన యూహ పెనుపై చనుదెంచెను బ్రాహ్మణోత్తమా

అవసరంబైన దర్శన మాచరింతు 
మనిన వృద్ధుండు తలయెత్తి హస్తమడ్డ 
మిడి సితాంభోద విద్యుత్ప్రమీల దృష్టి
పఱపి రఘుమూర్తిపై లోనికరిగి లేచి.

ఆకాశమున నుండి యవతరించిన నవాషాఢ నీలాంభోద సదృశమూర్తి
దశరథరాజు పుత్రకుడట, సంజకెంజాయ క్రమ్మిన సితజలదమూర్తి
యొక్కడు, నిలుచున్న ఉర్విలో నుండి బంగరుబొమ్మ లేచిన కరణి నొప్పు
నొక పసిచాన, మదుజ్జ్వలభ్రూదీప్తి వీచి అవసరంబు వేచియుండి

రనినఁ గుంబోద్భవుండు పేర్కొనరయేమి
యాత్మనామంబు లనిన వృద్ధావనిసురుఁ
డిపుడు వారి నామంబుల నేను చెప్పి
తిని గదా యన నవ్వి రమ్మనియె మౌని.

సీతారామలక్ష్మణులు అగస్త్యుని సోదరుని దగ్గర శలవు తీసుకొని, అగస్త్య మహర్షి దర్శనం కోసం బయలుదేరారు. ఆశ్రమ పరిసరాల్లో అగ్నిగృహానికి దగ్గరగా ఉన్న ఒక బావి వద్ద, ముఖం, కాళ్ళు చేతులు కడుక్కొన్నారు.   అక్కడ, కనుబొమలు బాగా తెల్లబడ్డటువంటి, యజ్ఞోపవీతములు ధరించినటువంటి ఒక  తొంభయ్యేళ్ళ వృద్ధుడిని సమీపించి, అతడిని లక్ష్మణుడు ఇలా అడిగాడు.

" బ్రాహ్మణోత్తమా ! ఈయన సూర్యవంశంలో మణిపూస వంటివాడు, దశరథ మహారాజు కుమారుడుపితృవాక్య పరిపాలన చేస్తూ, వనవాసం చేస్తున్నాడు. వింధ్యపర్వతమనే మదగజం పాలిట సింహమైనటువంటి అగస్త్య మహర్షి పాదాలకు నమస్కరిoచాలనే  కోరిక మిక్కుటమై ఇక్కడకు వచ్చాడుఅనుమతిస్తే, వారి దర్శనం చేసుకొంటాము

మాటలు వినగానే వృద్ధుడు తల ఎత్తి, చేతిని అడ్డం పెట్టుకొని, తెల్లని మేఘం వెనుక నున్నట్టి మెఱుపు వంటి  చూపుతో, రాముడిని చూసి, లోపలికి వెళ్ళాడు.

లోపలికి వెళ్ళిన వృద్ధుడు ఇలా చెప్పసాగాడు.

" దశరథ మహారాజు కొడుకట. ఆకాశం నుండి దిగివచ్చిన ఆషాఢ మాసంలోని నీలమేఘం లాగా ఉన్నాడుఇంకొకాయనేమో, సంధ్యారుణ కాంతులు పులుముకొన్న తెల్లని మేఘంలాగా ఉన్నాడు. భూమిలో నుండి నిట్టనిలువుగా లేచివచ్చిన బంగారుబొమ్మ వంటి ఒక పసిపిల్ల నిల్చొని ఉంది. నా దగ్గర నుండి సమాధానం వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నారు.

మాటను వినగానే, అగస్త్య మహర్షి, వారేమన్న వారి పేర్లు చెప్పారా అని అడిగాడు. దానికి, వృద్ధబ్రాహ్మణుడు, ఇందాక చెప్పింది అదే కదా అని అన్నాడు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, సరే రమ్మనమని అన్నాడు

సంభాషణాపూర్వకమైన పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like